ఏటూరునాగారం, ఫిబ్రవరి 22 : దట్టమైన అభయారణ్యంలో కొంగు బంగారమైన సమ్మక్క-సారలమ్మను కొలిచేందుకు భక్తులు మేడారానికి తరలివస్తున్నారు. జాతర నలుదిక్కులా భక్తులంతా విడిది చేస్తున్నారు. మాఘ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని సుమారు వెయ్యి హెక్టార్ల అటవీ ప్రాంతం అంతా గుడారాలు ఏర్పాటు చేసుకుంటున్నారు.
చెట్ల కింద ఆహ్లాదకర వాతావరణంలో కుటుంబం, బంధుమిత్రులంతా కర్రలు, వెదురుతో గూడు వేసుకుని ఏసీలు, ఫ్యాన్లను మరిచిపోతున్నారు. స్వచ్ఛమైన గాలి, దుమ్ము, ధూళి లేని అడవిలో హాయిగా గడిపేందుకు వాహనాలు, ఎడ్లబండ్లల్లో చేరుకుంటున్నారు.
ప్రధానంగా తాడ్వాయి నుంచి మేడారం, పస్రా, వెంగళాపూర్, నార్లాపూర్ మీదుగా మేడారం, ఏటూరునాగారం, చిన్నబోయినపల్లి, కొండాయి, ఊరట్టం మీదుగా మేడారం, ఐలాపూర్, కొండాయి, ఊరట్టం మీదుగా మేడారం, బయ్యక్కపేట, నార్లాపూర్ మీదుగా మేడారం, కాల్వపల్లి, నార్లాపూర్ మీదుగా మేడారం, చిన్నబోయినపల్లి, షాపల్లి నుంచి మేడారం, సర్వాయి, ఐలాపూర్, మేడారం పరిసరాలన్నీ అడవులు, పక్షులు, ప్రకృతి సౌందర్యాలు, సెలయేళ్లు, వాగులు, వంకలతో నిండుకుని ఉంది. ఈ అటవీ ప్రాంతం గుండా వచ్చే ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్తో పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి భక్తులు చేరుకుంటారు. తల్లులు కొలువయ్యే మూడు రోజుల ముందు నుంచే మార్గాలన్నీ భక్తులతో కిటకిటలాడుతాయి.
వాగులు, తోగులే అడ్డాలు
ఎడ్లబండ్ల బాటల్లో భక్తులు రోజుల తరబడి ప్రయాణం చేస్తూ మేడారం చేరుకుంటారు. మార్గమధ్యలో ఉండే వాగులు, తోగులు, సెలయేళ్ల వద్ద ఆగుతుంటారు. అవసరమైతే రాత్రివేళ ఇక్కడ నిద్రచేస్తారు. ఇలా తల్లుల సన్నిధికి చేరుకుంటారు. ఈ క్రమంలో వారికి అవసరమైన వనమూలికలను కూడా ఈ మార్గంలో వెతుక్కుంటారు. వాహనాల్లో మేడారం చేరుకునే భక్తులు తమ వెంట అవసరమైన వంట పాత్రలు తెచ్చుకుంటారు. పొయ్యి పెట్టుకునేందుకు అవసరమైన కట్టెలు అడవి నుంచి సేకరిస్తారు. విడిది వద్ద వంటలు చేసుకొని సహపంక్తి భోజనాలు చేస్తారు.
హాట్ వాటర్ అవైలబుల్
ఏటూరునాగారం, ఫిబ్రవరి 22 : జాతర సమయంలో చన్నీళ్ల స్నానం చేయలేని వారికోసం వేడినీళ్లు అందుబాటులో ఉన్నాయి. జంపన్న వాగు వద్ద రూ.50 తీసుకొని బకెట్ నీరు ఇస్తున్నారు.
కల్యాణకట్టలు కిటకిట
ఏటూరునాగారం, ఫిబ్రవరి 22 : జంపన్నవాగు ఒడ్డున ఉన్న కల్యాణ కట్టలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సమ్మక్క తల్లి గద్దెకు రాకముందే మొక్కులు చెల్లించడంలో భాగంగా భక్తులు తలనీలాలు సమర్పిస్తూ జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అయితే ఒకటి రెండు చోట్ల మాత్రమే కల్యాణకట్టలకు శాశ్వత నిర్మాణాలుండగా మిగతా చోట్ల తాత్కాలిక ఏర్పాట్లతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.
జంపన్నవాగులో జడ్త..
ములుగురూరల్, ఫిబ్రవరి 22 : మేడారం జాతరలో జంపన్నకు మొక్కు ప్రకారం భక్తులు జల పిల్లను ఇస్తున్నారు. గురువారం ఓ శివసత్తి మొక్కులో భాగంగా మేక పిల్లను బలిచ్చేందుకు ఇలా జంపన్నవాగులో ముంచి జడ్త పడుతూ కనిపించింది.
ముచ్చటైన తల్లికి ముగ్గులు
ఏటూరునాగారం, ఫిబ్రవరి 22 : చిలుకలగుట్ట నుంచి సమ్మక్క ఆగమనాన్ని స్వాగతిస్తూ భక్తులు రహదారులపై రంగురంగుల ముగ్గులు వేశారు. తల్లిని గద్దెకు తీసుకొచ్చే రహదారంతా రంగవల్లులతో నిండిపోయింది.
పొట్టకూటికి ‘పాములాట’
వాజేడు, ఫిబ్రవరి 22 : మేడారం జాతరకు పొట్ట కూటికోసం చాలా మంది వస్తుంటారు. ఇందులో భాగంగా ఓ వ్యక్తి పాములను ఆడిస్తూ కనిపించగా ‘సమస్తే’ క్లిక్మనిపించింది.
పావుషేర్@ రూ.20
ఏటూరునాగారం, ఫిబ్రవరి 22 : మేడారం జాతరలో గుడుంబా అమ్మకాలు బహిరంగంగానే కొనసాగుతున్నాయి. చాలా చోట్ల పరిసర గ్రామాలకు చెందిన కొందరు టిన్నుల్లో గుడుంబా తీసుకొచ్చి గ్లాసుకు రూ. 20 నుంచి రూ.30 చొప్పున విక్రయిస్తున్నారు. మద్యం ధరలు ఎక్కువగా ఉండడంతో సామాన్యులు గుడుంబా తాగుతున్నారు. ఎక్సైజ్ అధికారుల తనిఖీలు తక్కువగా ఉండడంతో పలు చోట్ల గుడుంబా అమ్మకాలు కొనసాగుతున్నాయి.
చెలిమ నీళ్లే దిక్కు..
కన్నాయిగూడెం, ఫిబ్రవరి 22: మేడారం జాతరలో భక్తులు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. సరి పడ తాగునీరు లభించకపోవడంతో జంపన్నవాగులో చెలిమలు తవ్వుతున్నారు. వాటిలో ఊరిన నీటిని తోడుకొని అవసరాలకు
ఉపయోగిస్తున్నారు.