తాడ్వాయి, మార్చి 3 : సమ్మక్క-సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో రావడంతో మేడారం పరిసరాలు కోలాహలంగా మారాయి. ఆదివారం సెలవు కావడంతో తెలుగు రాష్ర్టాలతో పాటు పక్క రాష్ర్టాల నుంచి భక్తులు తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవార్ల గద్దెల వద్దకు చేరుకుంటున్నారు.
సమ్మక్క-సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై పసుపు, కుంకుమ, ఎత్తుబెల్లం, నూతన వస్ర్తాలు సమర్పించి సల్లంగా సూడు తల్లీ అని వేడుకుంటూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. అనంతరం తల్లులకు యాటపోతులు, కోళ్లను సమర్పించి జాతర పరిసరాల్లో వంటలు చేసుకుని విందు భోజనాలు చేస్తున్నారు. జాతర ముగిసినా తల్లుల దర్శనానికి భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. జాతర పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి. గద్దెల పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఆదివారం రెండు లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు తెలిపారు.
భక్తులు పుణ్యస్నానాలు చేయడానికి జంపన్నవాగులో నీళ్లు లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. జాతర ముగియడంతో వాగులో భక్తుల కోసం ఏర్పాటు చేసిన బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ను తొలగించారు. నీళ్లులేకపోవడంతో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాగులో నిలిచి ఉన్న మురుగు నీటిలోనే స్నానం చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. జంట వంతెనల వద్ద తాత్కాలిక బ్యాటరీ ఆఫ్ను దేవాదాయశాఖ అధికారులు ఏర్పాటు చేసేవారు. ఈసారి అధికారులు భక్తులకు సౌకర్యాలను కల్పించడంతో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.