ఖిలావరంగల్, అక్టోబర్ 7: గ్రేటర్ వరంగల్ 37వ డివిజన్లోని గిరిప్రసాద్నగర్ గుడిసెవాసుల చిరకాల వాంఛ అయిన ఇండ్ల స్థలాల పట్టాలు చేతికి అందడంతో సంబురాలు జరుపుకున్నారు. పట్టాలు అందించేందుకు శనివారం కాలనీకి వచ్చిన వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్కు స్థానికులు కోలాటాలు, డప్పు వాయిద్యాలతో పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికారు. అనంతరం గజమాలతో సత్కరించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై అర్హులకు ఎమ్మెల్యే పట్టాలు పంపిణీ చేసి మాట్లాడారు. 2016లో తాను మేయర్గా ఉన్నప్పుడు గుడిసె ప్రాంతాల్లో నివాముంటున్న ప్రజలకు మౌలిక వసతులు కల్పించి, పట్టాలు అందజేస్తానని ఇచ్చిన హామీని నేడు నిలబెట్టుకున్నానని చెప్పారు. ఇంటింటికీ మిషన్ భగీరథ పథకంలో నల్ల కనెక్షన్లు ఇప్పించామన్నారు. గిరిప్రసాద్నగర్లోని వీధుల్లో సీసీరోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్, ఇంటి నంబర్లు ఇచ్చామన్నారు. చెప్పినట్లుగానే గిరిప్రసాద్నగర్లో 481 మందికి పట్టాలు అందించి గుడిసెలకు హక్కుదారులను చేయడం సంతోషంగా ఉందన్నారు.
కాంగ్రెస్ హయాంలో గుడిసెలను తొలగించడం, కాల్చివేసి పేదలకు అన్యాయం చేశారని ఎమ్మెల్యే నరేందర్ విమర్శించారు. వారికి పేద ప్రజలపై ప్రేమ లేకపోగా.. తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. అలాంటి వారు ఓట్ల కోసం కాలనీకి వస్తే నిలదీయాలని పిలుపునిచ్చారు. కరోనా కష్టకాలంలో తాను తూర్పు ప్రజలకు అండగా నిలిచి, 25 వేల మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశానని వివరించారు. నిరుపేదనైన తనను కార్పొరేటర్, మేయర్, ఎమ్మెల్యేను చేసిన ఈ ప్రాంత ప్రజల రుణాన్ని నియోజకవర్గాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసి తీర్చుకుంటానన్నారు. తూర్పు ప్రజల ఆర్థికాభివృద్ధే ధ్యేయంగా నిరంతరం కృషి చేస్తున్నట్లు చెప్పారు.
ప్రతి ఇంటికి సంక్షేమం, ప్రతి మోమున సంతోషం నింపడమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్తోపాటు అనేక సంక్షేమ పథకాలను బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్నదని నన్నపునేని గుర్తుచేశారు. రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతులమీదుగా 15,072 మంది లబ్ధిదారులకు ఈ నెల 6న సంక్షేమ పథకాలు అందించామన్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఇన్నేండ్లు కనిపించని ముఖాలు దర్శనమిస్తాయని, గుడిసెవాసులకు ఏం చేశారో వారిని నిలదీయాలని కోరారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధితో ప్రజల పక్షన నిలబడిన సీఎం కేసీఆర్ నాయకత్వానికి అండగా నిలువాలని ఇతర పార్టీల నాయకులకు నిక్కచ్చిగా చెప్పాలన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తనను అత్యధిక మెజార్టీతో గెలిపించి తూర్పులో గులాబీ జెండాను మరోసారి ఎగురవేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కార్పొరేటర్ వేల్పుగొండ సువర్ణ, బీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు బోగి సురేశ్, గిరిప్రసాద్నగర్ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు ఎండీ ఉల్ఫత్, డివిజన్ ఇన్చార్జి రవి పాల్గొన్నారు.
వరంగల్చౌరస్తా: గుడిసెవాసుల కష్టాలు తీర్చడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే నరేందర్ అన్నారు. 36వ డివిజన్ పరిధిలోని జ్యోతిబసునగర్ ప్రాంతంలో నివాసముంటున్న గుడిసెవాసులకు శనివారం రాత్రి ఆయన పట్టాలు పంపిణీ చేశారు. జీవో 58 ప్రకారం 317 మంది చింతల్ వాసులకు ప్రభుత్వం పట్టాలు మంజూరు చేసిందని ఎమ్మెల్యే అన్నారు. కాంగ్రెస్ హయాంలో కనీస వసతులు కల్పించకుండా స్లమ్ ఏరియాలుగా మార్చిన ప్రాంతాలను బీఆర్ఎస్ సర్కారు మోడల్ కాలనీలుగా తీర్చిదిద్దుతున్నదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదిస్తే కాలనీలు మరింత అభివృద్ధి చెందుతాయన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్, బీఆర్ఎస్ నేత సయ్యద్ మసూద్, డివిజన్ అధ్యక్షుడు వేల్పుగొండ యాకయ్య, మర్రి శ్రీనివాస్, చాంద్పాషా, షరీఫుద్దీన్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.