వరంగల్ చౌరస్తా, మార్చి21: సర్కారు దవాఖానలో ఫార్మాసిస్ట్ చేతివాటం ప్రదర్శించాడు. ప్రాంతీయ నేత్ర వైద్యశాలలో రోగులకు అందించాల్సిన మందులను బహిరంగ మార్కెట్లో విక్రయించాడు. టాస్క్ఫోర్స్ అధికారులు పోలీసులతో కలిసి దాడులు చేయడంతో బండారం బట్టబయలైంది. పోలీసులు, డ్రగ్ కంట్రోలర్ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు తలకోటి నరేందర్ (ఈనాడు మాజీ రిపోర్టర్) వరంగల్ ప్రాంతీయ నేత్ర వైద్యశాలలో ఓపీ ఫార్మాసిస్ట్గా సుమారు 33 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. దవాఖానలో ఎక్కువ మంది ఓపీ సేవలు వినియోగించుకున్నట్లు, వారికి వైద్య పరీక్షల అనంతరం వైద్యులు సూచించిన మందులను రెండింతలు నమోదు చేసి ఉచితంగా పంపిణీ చేసినట్లు రికార్డుల్లో నమోదు చేశాడు. మిగిలిన మందులను గుట్టుచప్పుడు కాకుండా హైదరాబాద్కు చెందిన బలరాందాసు ద్వారా బహిరంగ మార్కెట్కు తరలించి సొమ్ము చేసుకున్నాడు. బుధవారం వరంగల్ జిల్లా డ్రగ్ కంట్రోలర్ అరవింద్ ఆధ్వర్యంలో టాస్క్ఫోర్స్ అధికారులు, ఇంతేజార్గంజ్ పోలీసుల సహకారంతో నిర్వహించిన దాడుల్లో రెడ్హ్యాండెడ్గా దొరికిపోయాడు. అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులు తలకోట నాగేందర్, బలరాందాసును అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. పక్కదారి పట్టించిన మందులను కాశీబుగ్గలో నిల్వ చేసి అక్రమంగా బహిరంగ మార్కెట్లో విక్రయించినట్లు తేలింది. రూ. 69,360 విలువైన 34 బాక్సుల యాంటీ బయాటిక్ టాబ్లెట్స్, రూ. 11, 484 విలువైన 240 కంటి చుక్కల మందు బాటిల్స్, మొత్తం సుమారు రూ. 80, 844 విలువైన మందులను స్వాధీనం చేసుకున్నారు.
ప్రాంతీయ నేత్ర వైద్యశాల ఓపీ ఫార్మాసిస్ట్ బాగోతం బట్టబయలు కావడంతో హాస్పిటల్లో అధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. నిత్యం కంటి పరీక్షలు నిర్వహించి, రోగు లకు అందించే మందుల వివరాలను రికార్డుల్లో నమోదు చేయాల్సి ఉన్నా అధికారులు తగిన శ్రద్ధ చూపకపోవడంతోనే మందులు పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చాలా కాలంగా మందులు పక్కదారి పడుతున్నా గుర్తించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు పూర్తిస్థాయి విచారణ జరిపి మందులు బహిరంగ మార్కెట్కు తరలకుండా చూడాలని రోగులు కోరుతున్నారు.