మరిపెడ, జూన్ 18 : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామం ఎదళ్లగుట్ట మిషన్ భగీరథ (పాలేరు- వరంగల్ సెగ్మెంట్) ప్రాజెక్ట్ వద్ద ఆదివారం మంచినీళ్ల దినోత్సవం కనుల పండువగా సాగింది. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మిషన్ భగీరథ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, డోర్నకల్, మహబూబాబాద్, నర్సంపేట ఎమ్మెల్యేలు డీఎస్ రెడ్యానాయక్, బానోత్ శంకర్నాయక్, పెద్దిసుదర్శన్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ బిందు, కలెక్టర్ కే శశాంక ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. తొలుత వారు భగీరథ ప్రాజెక్ట్ వద్ద వివిధ దశల్లో నీళ్లు శుద్ధి అవుతున్న తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. గోదావరి, కృష్ణ వంటి పుణ్యనదుల జలాలను పల్లెలకు పారించి పునీతం చేసిన ఘనత అపర భగీరథుడు సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గుక్కెడు తాగునీటి కోసం జనం అరిగోస పడ్డారని, ఇంటిల్లిపాది మండుటెండల్లో బిందెలతో వ్యవసాయ బావుల వద్దకు పరుగులు తీసిన దుస్థితి ఇప్పటికీ మన కళ్లముందే కదలాడుతున్నదన్నారు.
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ నల్లాల సురక్షితమైన తాగునీళ్లను అందించి వారి కష్టాలను దూరం చేశారని అన్నారు. కేంద్రంలో దశాబ్దాలకాలం అధికారంలో ఉన్న జాతీయ పార్టీలు చేయలేని ప్రగతిని, సీఎం కేసీఆర్ కేవలం తొమ్మిదేళ్లలోనే చేసి చూపించారని, రాష్ర్టాన్ని దేశానికే రోల్ మోడల్గా నిలిపారని అన్నారు. పెండింగ్ ప్రాజెక్ట్లను పూర్తి చేసి వ్యవసాయానికి జీవం పోశారని చెప్పారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలపై నీతి అయోగ్ సంతృప్తి వ్యక్తం చేసి, రూ. 32వేల కోట్ల నిధులు ఇవ్వాలని బీజేపీ ప్రభుత్వానికి సిఫారసు చేసినా బుట్టదాఖలు చేసిందన్నారు. సమైక్యరాష్ట్రంలో బోర్లపై ఉన్న నిషేధం నేడు స్వరాష్ట్రంలో లేదన్నారు. గణనీయంగా భూగర్భ జలాలు పెరిగి ప్రజలకు నీళ్ల ఇబ్బందులు తొలగిపోయాయన్నారు.
మంత్రి సత్యవతి మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో తాగునీటి కష్టాలు మహిళలకు కన్నీళ్లు తెప్పించాయని, స్వరాష్ట్రంలో మిషన్ భగీరథ ద్వారా ఆ ఇబ్బందులను తొలగించిన మహనీయుడు సీఎం కేసీఆర్ అని అన్నారు. ఏళ్లకొద్ది దేశాన్ని పాలించిన బీజేపీ, కాంగ్రెస్ ప్రజల తాగునీటి సమస్యలను తీర్చడంలో విఫలమయ్యాయని అన్నారు.
ఎంపీ, జిల్లా అధ్యక్షురాలు ఎంపీ కవిత మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో రైతులు, మహిళలు, నిరుద్యోగ యువత అరిగోస పడ్డారని, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సారథ్యంలో అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందడంతో సంతోషంగా ఉన్నారని అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను కాంగ్రెస్ పార్టీ ఓర్వలేకపోతున్నదన్నారు. దశాబ్దాల కాలం అధికారంలో ఉండి గుక్కెడు తాగునీళ్లు అందించలేని కాంగ్రెస్ నాయకులు ఏ మొఖం పెట్టుకుని ప్రజల మధ్యకు వస్తున్నారని, మహిళాలోకం ఎక్కడికక్కడ నిలదీయాలన్నారు. ఎమ్మెల్యే శంకర్నాయక్ మాట్లాడుతూ.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యను తీర్చిన అపర భగీరథుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్రావు, కలెక్టర్ శశాంక పాల్గొన్నారు.