రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ) : కేసీఆర్ స్వీయ అనుభవంతోనే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, రాష్ట్రంలో కోట్లాది మందికి వైద్య పరీక్షలు, కంటి అద్దాలు, ఆపరేషన్లు చేయించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో ‘కేసీఆర్ కంటి వెలుగు’ కార్యక్రమంలో భాగంగా 1,371 మందికి కంటి అద్దాల పంపిణీ కార్యక్రమం నిర్వహించగా, కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిందని, గత ప్రభుత్వం మంచి కార్యక్రమాలు, పథకాలు చేపడితే కొత్తగా వచ్చిన ఏ ప్రభుత్వమైనా కొనసాగించాలని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక వైఎస్సార్ చేపట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని కొనసాగించిన విషయాన్ని గుర్తుచేశారు. చికిత్సకయ్యే వ్యయాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పెంచి ఆరోగ్యశ్రీని కొనసాగించినట్టు చెప్పారు. వైఎస్సార్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని పెడితే.. కేసీఆర్ సర్కార్ కొనసాగించిందని అన్నారు. కేసీఆర్ సర్కార్ కంటి వెలుగు అనే మంచి కార్యక్రమం పెట్టారని, ఈ ప్రభుత్వం కూడా కంటి వెలుగు కొనసాగించి ఉంటే బాగుండేదని పేర్కొన్నారు.
‘కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ పార్టీ నాయకులకు కేసీఆర్ పేరంటేనే నచ్చుతలేదు. ఏ పథకానికైనా పేరు ఉంటే చాలు తీసి పక్కకు పెడుతున్నరు. మాతా, శిశు మరణాలు తగ్గించడానికి కేసీఆర్ మంచి పథకాలు పెట్టారు. ప్రసూతిలో ఆడపిల్ల పుడితే రూ.13 వేలు, మగ పిల్లవాడు పుడితే రూ.12 వేలు ఇచ్చి, కేసీఆర్ కిట్ ఇచ్చారు’ అని కేటీఆర్ గుర్తుచేశారు. దీంతో ప్రభుత్వ దవాఖానలో ప్రసవాలు పెరిగి మాతా, శిశు మరణాలు తగ్గినట్టు తెలిపారు. కంటి వెలుగు ఎంత మంచి పేరు వచ్చిందో దేశంలోనే కేసీఆర్ కిట్కు అంత మంచి పేరొచ్చిందని చెప్పారు. ‘ఈ ప్రభుత్వం వచ్చినంక కేసీఆర్ కిట్ తీసేశారు. కేసీఆర్ కిట్ నచ్చకపోతే ఇందిరమ్మ కిట్ పేరుతో ఇస్తామంటే మిమ్మల్ని ఎవరైనా కొడుదురా?’ అని ఎద్దేవా చేశారు. కంటి వెలు గుకు కూడా ఏదైనా పేరు పెట్టుకొని అమలు చేసేందుండేనని, కానీ అదికూడా తీసేసిండ్రని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్ మంచి పథకాలను అమలు చేసినా, చేయకపోయినా రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాత్రం తాను అమలు చేయాలనే నిర్ణయించుకున్నట్టు కేటీఆర్ తెలిపారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, తంగళ్లపల్లి మండలాలతోపాటు సిరిసిల్ల టౌన్లో కంటి వెలుగు శిబిరాలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
‘మీ అందరికీ ఇచ్చేది ఒకటే మాట. నేను ఏదో దూరంగా ఉన్నాని అనుకోకండి. తప్పకుండా నా గుండెకు మీరందరూ దగ్గరగా ఉన్నరు. ముమ్మాటికి వీర్నపల్లి మండలాన్ని రాష్ట్రంలో ఆదర్శ మండలంగా తీర్చిదిద్దే బాధ్యత నాది’ అని కేటీఆర్ పేర్కొన్నారు. ‘ఏ చిన్న కష్టం ఉన్నా, ఏ అవసరం ఉన్నా, అధికారం ఉన్నా, లేకున్నా తప్పకుండా మీకు అండగా నిలబడుతా’నని భరోసానిచ్చారు.