హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 24 : ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా వరంగల్ రీజియన్ పరిధిలోని అన్ని డిపోల వద్ద శుక్రవారం నిరసనలు, ఆందోళన కొనసాగాయి. శంకర్ గౌడ్ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ డిపోల వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీ జాక్ పిలుపులోభాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగింది. వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించి, ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావం ప్రకటించాయి.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. హనుమకొండ బస్స్టేషన్, వరంగల్-1 డిపో ప్రాంగణం నిర్మానుష్యంగా మారింది. బంద్తో ప్రజారవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందిపడ్డారు. ప్రయాణికులు లేక బస్టాండ్లు వెలవెలబోయాయి. రెండురోజులుగా ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయంగా హైర్బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులు నడిపించగా, మూడోరోజు పూర్తిగా బస్సులను నిలిపివేశారు.
డ్రైవర్ మృతితో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు ఆవేశంగా ఉన్నారని, అసలు బస్సులను బయటకు తీయొద్దని, తీస్తే ధ్వంసం చేసే పరిస్థితి ఉందని, ముందుగానే హైర్బస్ యజమాన్యానికి, వరంగల్-2 ఎలక్ట్రిక్ బస్సుల డీఎంలకు ఆర్టీసీ ఆర్ఎం ఎస్.భవానీప్రసాద్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. హనుమకొండ బస్స్టేషన్లో మృతుడు శంకర్గౌడ్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. బస్సుల బంద్తో కాకతీయ యూనివర్సిటీలో పరిధిలో శుక్ర, శనివారాల్లో జరగాల్సిన అన్ని పరీక్షలను అధికారులు వాయిదా వేశారు.