నర్సంపేట రూరల్, అక్టోబర్ 1: ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు మానుకోవాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి హితవు పలికారు. మండలంలోని లక్నేపల్లి రైతు వేదికలో క్లస్టర్ పరిధిలోని రామవరం, లక్నేపల్లి, కమ్మపల్లి, దాసరిపల్లి, మదిర గ్రామాలకు చెందిన 1248 మంది రైతులకు పంట నష్టపరిహారం కింద రూ. 1.25 కోట్ల విలువైన చెక్కులను ఆదివారం పెద్ది ముఖ్య అతిథిగా xహాజరై పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతిపక్షాలకు ఎలాంటి రోల్ లేదన్నారు. తాను జీవితాంతం నియోజకవర్గంలోని రైతుల శ్రేయస్సు కోసం పని చేస్తానన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం రూ. 51 కోట్ల పంట నష్టపరిహారం ప్రకటిస్తే.. అందులో రూ. 42 కోట్ల పరిహారం నియోజకవర్గ రైతులకే రావడం సంతోషంగా ఉందన్నారు.
నాటి ప్రభుత్వాల హయాంలో నష్టపరిహారం అందిస్తామని రైతులకు చెప్పి వెళ్లిన నేతల అడ్రస్ నేటికీ లేకుండాపోయిందని విమర్శించారు. చిల్లరగా ధర్నాలు, అధికారులపై దాడులు చేయడం సరికాదని సూచించారు. టార్పాలిన్ నుంచి మొదలుకొని హార్వేస్టర్ వరకూ 50 శాతం సబ్సిడీపై రూ. 75 కోట్ల వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు అందుబాటులో ఉన్నాయన్నారు. కావాల్సిన రైతులు తీసుకెళ్లాలని కోరారు. కార్యక్రమంలో ఏడీఏ తోట శ్రీనివాసరావు, ఏవో కృష్ణకుమార్, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు కొడారి రవన్న, ఏఈవోలు మెండు అశోక్, భరత్, నవీన్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఈర్ల నర్సింహరాములు, ఆర్బీఎస్ మండల కన్వీనర్ జయపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అన్నదాతకు అండగా సీఎం కేసీఆర్
దుగ్గొండి: రైతు కష్టం తెలిసిన సీఎం కేసీఆర్ అన్నదాతకు అండగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. లక్ష్మీపురం క్లస్టర్ పరిధిలోని రైతులకు ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఆయన పరిహారం చెక్కులు అందజేశారు. అకాల వర్షాలకు పంట దెబ్బతింటే పరిహారం అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందనన్నారు. మండలవ్యాప్తంగా 10,294 ఎకరాల్లో పంటనష్టం జరుగగా, రూ. 11 కోట్ల పరిహారం అందజేశామన్నారు. అవసరమున్న రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఏడీఏ తోట శ్రీనివాస్రావు, ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య, ఆర్బీఎస్ మండల కన్వీనర్ తోకల నర్సింహారెడ్డి, బీఆర్ఎస్ ఎన్నారై ప్రతినిధి రాజ్కుమార్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సుకినె రాజేశ్వర్రావు, ఏవో దయాకర్, పీఏసీఎస్ చైర్మన్లు ఊరటి మహిపాల్రెడ్డి, ఏఈవోలు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
రైతు కన్నీరు తుడుస్తుంటే రాజకీయాలా?
చెన్నారావుపేట: వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించి, వారి కన్నీళ్లు తుడుస్తుంటే రాజకీయాలు చేస్తారా అని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. ఉప్పరపల్లి క్లస్టర్ పరిధిలోని 1200 మంది రైతులకు పరిహారం చెక్కులు పంపిణీ చేశారు. రైతుల విషయంలో రాజకీయాలు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. అలాగే, 30 కుటుంబాలు ఉన్న బాల్నాయక్తండాకు బీటీరోడ్డు కోసం నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే చెప్పారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్ కంది కృష్ణారెడ్డి, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు రఫీ, ఆర్బీఎస్ మండల కన్వీనర్ బుర్రి తిరుపతి, నాయకులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, క్లస్టర్ బాధ్యులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.