ప్రజా ఆశీర్వాద సభ సక్సెస్తో బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకెళ్తున్నది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందు నుంచే గులాబీ పార్టీ అభ్యర్థులు మండల, గ్రామ స్థాయిలో సభలు, ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, తొమ్మిదన్నరేళ్లలో సాధించిన ప్రగతిని వివరించారు. ఇప్పటికే ఒక విడుత ప్రజల్లోకి వెళ్లి క్షేత్రస్థాయిలో కలుసుకుని ప్రచారాన్ని ప్రారంభించారు. రెండు రోజుల క్రితం జనగామలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ హాజరై భవిష్యత్ ప్రణాళికను వివరించడంతో ప్రజలు జేజేలు పలికారు. చేర్యాల రెవెన్యూ డివిజన్, జనగామకు నర్సింగ్, పారా మెడికల్ కాలేజీలు సహా ఐటీ, ఇండస్ట్రీయల్ కారిడార్లు వస్తాయని సీఎం కేసీఆర్ శుభవార్తలు వినిపించడంతో ప్రజలు హర్షాతిరేకం వ్యక్తం చేస్తున్నారు. జనగామ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్రెడ్డి, పాలకుర్తి నుంచి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, స్టేషన్ఘన్పూర్ నుంచి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి బరిలో నిలిచి తమదైన శైలిలో ప్రజల వద్దకెళ్లి ప్రచారం చేస్తున్నారు.
జనగామ, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ) : ప్రజా ఆశీర్వాద సభతో బీఆర్ఎస్ దూసుకెళ్తున్నది. జనగామ నియోజకవర్గంలో అందరికంటే ముందే ప్రచారం ప్రారంభించి హోరెత్తిస్తున్నది. జనగామ జిల్లాలో గులాబీపార్టీ అభ్యర్ధులు ఎన్నికల ప్రచారంలో జెట్ స్పీడ్తో పరుగులు పెడుతుంటే కారు టాప్ గేర్లో లక్ష్యం వైపు దూసుకుపోతున్నది. కాంగ్రెస్ పార్టీలో గ్రూపుల పోరు, కుమ్ములాటలు సాగుతుంటే బీజేపీలో అభ్యర్ధుల కరువు కనిపిస్తున్నది. జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్ధులు ఎన్నికల కదన రంగంలోకి దిగి ఇప్పటికే ఒక విడుత జనంలోకి వెళ్లి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే అధినేత కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించగా, అప్పటి నుంచే గులాబీ అభ్యర్ధులు రంగంలోకి దిగారు. నిత్యం జనంతో మమేకమవుతూ ఓట్లు అభ్యర్ధిస్తున్నారు. తమను ఆశీర్వదిస్తే రాబోయే ఐదేళ్లలో నియోజకవర్గాలను మరింత అద్భుతంగా తీర్చిదిద్దుతామంటూ మద్దతు కూడగడుతున్నారు. జనగామ జిల్లాలో మూడు అసెంబ్లీ స్థానాలకుగాను పాలకుర్తి, స్టేషన్ఘన్పూర్ అభ్యర్ధులను ప్రకటించిన పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ జనగామ నియోజకవర్గ అభ్యర్ధిగా పల్లా రాజేశ్వర్రెడ్డిని ఖరారు చేసి జనక్షేత్రంలోకి పంపించారు. ఇప్పటికే పల్లా రాజేశ్వర్రెడ్డి సన్నాహక సభలు, గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులతో సమన్వయ సమావేశాలు నిర్వహించారు.
ఈ నెల 16న జనగామలో నిర్వహించిన తొలి ప్రజా ఆశీర్వాదసభతో అధినేత కేసీఆర్ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. మునుపెన్నడూ లేని విధంగా జనగామ సభకు జనం పొటెత్తడంతో పల్లా గెలుపు పక్కా అయింది. ఈ జనాన్ని చూస్తుంటే ఉమ్మడి జిల్లా సభలా అనిపిస్తుంది. ఇంత పెద్దఎత్తున జనం వచ్చి రాజేశ్వర్రెడ్డిని ఆశీర్విదించారు ఇక ఆయన లక్ష మెజార్టీతో గెలిచినట్టే లెక్క అంటూ అధినేత కేసీఆర్ నిండుసభలో స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జనగామలో నిర్వహించిన ఎన్నికల ప్రజా ఆశీర్వాద సభ సూపర్ సక్సెస్ కావడంతో జిల్లా గులాబీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపింది. దీనికితోడు టీ-పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య గులాబీకండువా కప్పుకోవడంతో బీఆర్ఎస్కు అదనపు బలం చేకూరింది. ఇప్పటికే పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్రావు, స్టేషన్ఘన్పూర్లో కడియం శ్రీహరి గెలుపు ఖాయం కాగా, జనగామలో సీఎం సభ తర్వాత పల్లా గెలుపు ‘నలేరుపై నడకే’ అన్నది స్పష్టం అవుతున్నది. జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ మూడు స్థానాలు కైవసం చేసుకొని ‘తీన్మార్’ మోగించబోతున్నది. ఎక్కడ చూసినా ప్రచార కార్యక్రమాలతో గులాబీ శ్రేణుల అభ్యర్ధులు గ్రామాలను చుట్టేస్తుంటే విపక్ష పార్టీల్లో ఆ సందడి కనిపించడంలేదు.
జనగామ ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ రాకతో గులాబీ క్యాడర్లో కొత్త ఉత్సాహం నెలకొన్నది. సభాస్థలికి సమీపంలోని గ్రామాలు, మండల కేంద్రాల నుంచి పార్టీ శ్రేణులు, అభిమానులు కాలినడకన సైతం కేసీఆర్ ప్రసంగాన్ని వినేందుకు పోటెత్తారు. కార్యకర్తలు, అభిమానులు సొంత ద్విచక్ర వాహనాలు, సొంత వాహనాల్లో వచ్చి కేసీఆర్కు జేజేలు పలికారు. లంబాడీ, గుస్సాడీ, కోయ, చిందుయక్ష గానం, ఒగ్గుడోలు వంటి వివిధ కళా రూపాలను ప్రదర్శిస్తుసూ కళాకారులు తరలివచ్చారు. మరోపక్క జనగామ సభ ఊహించిన దానికంటే సూపర్ డూపర్ సక్సెస్ కావడంతో అటు నాయకులు, ఇటు గ్రామస్థాయి టీఆర్ఎస్ కార్యకర్తల్లో నయా జోష్ నెలకొంది. వరాల జల్లు కురిపిస్తారని..కొత్తగా అభివృద్ధి ఫలాలు ప్రకటిస్తారని ఎప్పటి నుంచో ఎదురుచూసిన జిల్లా ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేర్యాల రెవెన్యూ డివిజన్, జనగామకు నర్సింగ్, పారా మెడికల్ కాలేజీలు సహా ఐటీ, ఇండస్ట్రీయల్ కారిడార్లు వస్తాయని శుభవార్తలు వినిపించడంతో ప్రజలు హర్షాతిరేకం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా దేవాదులను పూర్వ వరంగల్ జిల్లాకు అంకితం చేసి వచ్చే ఏడాదిలోగా ప్రతి ఎకరాకు సాగునీరు అందించడం సహా మల్లన్నసాగర్ నుంచి తపాస్పల్లికి కాళేశ్వరం నీళ్లు వస్తే జనగామ నెత్తిన కుండపెట్టినట్లేనని.. ఎక్కడ కరువొచ్చినా జనగామకు ఢోకా ఉండదన్న భరోసా కల్పించిన కేసీఆర్ ప్రసంగం రైతుల్లో ఆనందాన్ని నింపింది. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా రైతుబంధు ఎకరానికి రూ.16 వేలకు వచ్చే ఐదేండ్లలో క్రమంగా పెంపు, సౌభాగ్యలక్ష్మి పేరుతో బీపీఎల్ కుటుంబాలకు చెందిన అర్హులైన మహిళలకు కొత్తగా నెలకు రూ.3వేల గౌరవ భృతి, అర్హులైన పేద కుటుంబాలు, అక్రిడెటెడ్ జర్నలిస్టులకూ రూ.400కే వంట గ్యాస్ సిలిండర్, కేసీఆర్ ఆరోగ్యరక్ష ద్వారా రూ.15 లక్షలు, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే జర్నలిస్టులకు రూ.15 లక్షల వరకు నగదు రహిత వైద్యబీమా, పేద కుటుంబాలకు రూ.5 లక్షల కేసీఆర్ బీమా, సన్నబియ్యం, ఆసరా పింఛన్లను రూ.5016కు పెంపును మార్చి నుంచి దశలవారీగా అమలు చేస్తామని సభలో కేసీఆర్ ప్రకటించగానే ప్రజలు జయజయ ద్వానాలు చేశారు. మరోపక్క గ్రామాల నుంచి పెద్దఎత్తున సంక్షేమ పథకాల లబ్దిదారులు, ముఖ్యంగా ఆసరా పించన్లు అందుకుంటున్న వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు సభకు తరలివచ్చి కేసీఆర్ చెప్పే మాటలను ఆసక్తిగా విన్నారు.
ఒకప్పుడు తాగు నీటికి తండ్లాట..సాగునీరు లేక యువకులు వలసలు వెళితే ఊర్లలో వృద్ధులు మాత్రమే కనిపించే వారంటూ బచ్చన్నపేట సంఘటనను అటు సభా వేదికపై ప్రస్తావించిన కేసీఆర్ సాధించుకున్న తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన జనగామ జిల్లా ఇకపై గ్రోత్ సెంటర్గా మారబోతున్నదన్న సీఎం వ్యాఖ్యాలు రియల్ ఎస్టేట్, వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక వర్గాలల్లో ఆశలు చిగురించాయి. 24 గంటలు నా వెంట ఉండే నీరటి కాడే మీ దగ్గరు ఉన్నడు రానున్న రోజుల్లో జనగామ ఎవరూ ఊహించని అభివృద్ధిని చూస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం సహా హైదరాబాద్-వరంగల్ కారిడార్లో ఉన్న జనగామ రాజధాని తర్వాత కీలకం కాబోతున్నదని, ఐటీ, పరిశ్రమలు, విద్యాసంస్థలు తరలివస్తాయి..హైదరాబాద్తోపాటు మరో 32 అభివృద్ధి కేంద్రాలు తయారవుతాయని స్వయంగా సీఎం స్పష్టం చేశారు.