కరకగూడెం, ఆగస్టు 07 : సీజనల్ వ్యాధులను నియంత్రించేందుకు ముందుస్తు చర్యలు చేపడతున్నట్లు కరకగూడెం పీహెచ్సీ వైద్యాధికారి రవితేజ తెలిపారు. శుక్రవారం మండలంలోని భుట్టుపల్లి పంచాయతీలో గల కేజీబీవీ పాఠశాల, వసతి గృహంలో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అలాగే జాతీయ కీటకజన్య వ్యాధుల నివారణ కార్యక్రమంలో భాగంగా అన్ని తరగతి, వసతి గదులలో మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా దోమల మందు పిచికారి చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తిన వెంటనే స్థానిక పీహెచ్సీలో సంప్రదించి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీహెచ్సీ హెచ్ ఈ ఓ కృష్ణయ్య, సిబ్బంది పాల్గొన్నారు.