హనుమకొండ, జూలై 11 : బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రైతు వ్యతిరేక పార్టీలు అని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ధ్వజమెత్తారు. తెలంగాణ రైతాంగానికి టీఎస్పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అమెరికాలో రేవంత్రెడ్డి తెలంగాణలోని రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ వద్దు మూడు గంటలు చాలు అని చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా మంగళవారం హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీగా కాళోజీ జంక్షన్ వద్దకు చేరుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులు, పడిన కష్టాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం పునరావృతం కావొద్దనే సంకల్పంతో తొమ్మిదేళ్లుగా రైతులకు ఉచిత నాణ్యమైన కరంటు అందిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా రైతు సంక్షేమం కోసం రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలను అమలు చేయడంతో పాటు ఎరువులు, నాణ్యమైన విత్తనాలు సకాలంలో అందిస్తున్నారని తెలిపారు.
అలాగే, రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు అందిస్తున్న పథకాలను దేశవ్యాప్తంగా రైతులకు అందించాలనే సంకల్పంతో ‘అబ్ కీ బార్ కిసాన్ సరార్’ అనే నినాదంతో సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారన్నారు. దేశ వ్యాప్తంగా రైతులందరూ సీఎం కేసీఆర్ వెంట వస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ రైతు సంక్షేమ పార్టీ అయితే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రైతు వ్యతిరేక పార్టీలని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ ఆందోళన చేపడితే కేంద్రం అనేక మంది రైతులను పొట్టన పెట్టుకోవడంతో పాటు వారి మంత్రుల కొడుకుల వాహనాలతో తొక్కించి రైతులను హత్య చేయించిందన్నారు. వచ్చే రోజుల్లో కాంగ్రెస్, బీజీపీలను పాతర పెట్టడంతో పాటు ఆయా పార్టీలకు ప్రజలు గుణపాఠం చెబుతారని చీఫ్ విప్ తెలిపారు. రేవంత్రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పే వరకూ తమ నిరసన కొనసాగిస్తామన్నారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రావడం ఖాయమని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. కార్యక్రమంలో కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్, మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పులి రజినీకాంత్, నయీమొద్దీన్, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.