ములుగు, డిసెంబర్ 15 (నమస్తేతెలంగాణ) : ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.75 కోట్లను విడుదల చేసింది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అధికారులు శాఖల వారీగా నిధులను ప్రతిపాదించగా వాటిని ఆమోదిస్తూ శుక్రవారం ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినాజడ్ చోంగ్తూ జీవో విడుదల చేశారు. కోటి మందికి పైగా భక్తులు హాజరయ్యే జాతరలో తాగునీరు, పారిశుధ్య పనులకు అత్యధికంగా రూ.14 కోట్ల 74లక్షల 90వేలను కేటాయించారు. భక్తుల భద్రత కోసం పోలీస్ శాఖకు రూ.10కోట్ల 50లక్షలు, రహదారుల మరమ్మతులు, నిర్మాణం కోసం రూ.2 కోట్ల 80లక్షలు, దేవాదాయ శాఖకు రూ.కోటీ50లక్షలు, పంచాయతీరాజ్ శాఖకు రూ.4కోట్ల 35లక్షలు, మైనర్ ఇరిగేషన్కు రూ.6కోట్ల 11లక్షల 70వేలు, వైద్య ఆరోగ్య శాఖకు రూ.కోటి, ఐటీడీఏ ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ శాఖకు రూ.8 కోట్ల 28లక్షల 85వేలు, విద్యుత్ శాఖకు రూ.3కోట్ల 96లక్షల 92వేలు, టీఎస్ ఆర్టీసీకి రూ.2కోట్ల 25లక్షలు, ఎక్సైజ్ శాఖకు రూ.20లక్షలు, సమాచార పౌర సంబంధాల శాఖకు రూ.50లక్షలు, పశు సంవర్థక శాఖకు రూ.30లక్షలు, టూరిజం శాఖకు రూ.50లక్షలు, రెవెన్యూ శాఖకు రూ.5కోట్ల 25లక్షలు, జిల్లా పంచాయతీ అధికారికి శానిటేషన్ కోసం రూ.7కోట్ల 84లక్షల 97వేలు, మత్స్యశాఖకు రూ.24లక్షల 66వేలు, అగ్నిమాపక శాఖకు రూ.20లక్షలు, అటవీ శాఖకు రూ.20లక్షలు, ఐసీడీఎస్ విభాగానికి రూ.23లక్షలు, ట్రైబల్ డెవలప్మెంట్ విభాగంలో ఐటీడీఏ పీవోకు రూ.4కోట్లను విడుదల చేసినట్లు జీవోలో పేర్కొన్నారు. నిధులను జిల్లా కలెక్టర్ ద్వారా ఖర్చు చేయాలన్నారు.