గణపురం, ఫిబ్రవరి 16 : గణపురం మండలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు పాగా వేస్తున్నారు. పదేళ్ల కాలంలో స్తబ్ధుగా ఉండి ప్రస్తుతం ఓ ముఠాగా ఏర్పడి కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములను కాజేస్తున్నారు. గాంధీనగర్- మైలారం గ్రామాల మధ్య 204 సర్వే నంబర్లో ఎనిమిది ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇది జాతీయ రహదారికి ఆనుకొని ఉండడంతో డిమాండ్ బాగానే ఉంది. దీన్ని ఆసరాగా చేసుకున్న కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ భూమిని కబ్జా చేశారు. అంతటితో ఆగకుండా ఏకంగా ప్లాట్లు చేసి హద్దులు ఏర్పాటు చేశారు. గుంటకు రూ.10 లక్షల నుంచి రూ.14 లక్షలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గాంధీనగర్ మొత్తం ప్రభుత్వ భూమి అయినప్పటికీ భూ బకాసురులు కబ్జా చేస్తూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన కొందరు రెవెన్యూ అధికారులు ముడుపులు తీసుకొని చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో గాంధీనగర్, మైలారం మధ్య రియల్ దందా విపరీతంగా కొనసాగుతోంది. ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా కబ్జారాయుళ్లకు కల్లెం వేయాలని ప్రజలు వేడుకుంటున్నారు.
గాంధీనగర్ గ్రామంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న వారిపై కేసులు నమోదు చేస్తాం. 204 సర్వే నంబర్ గల ప్రభుత్వ భూమిలో పాతిన హద్దులను పూర్తిగా తొలగిస్తాం. ప్రభుత్వ భూములను ఎవరు కబ్జా చేసినా సహించేది లేదు.