అడవులకు నిలయమైన ములుగు నియోజకవర్గంలో ప్రగతి సిరులు పరుచుకున్నాయి. సమైక్య పాలనలో ఆగమైన బతుకులు స్వరాష్ట్రంలో బంగారుమయమయ్యాయి. కండ్ల ముందు ఉన్న ప్రగతి ఫలాలను చూసి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వెనుకబడిన ములుగు జిల్లాగా ఆవిర్భవించిన తర్వాత నియోజకవర్గంలో అభివృద్ధి వరద పారుతున్నది. పల్లె ప్రగతితో పల్లెలు, పట్టణాలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. కార్పొరేట్ తరహా విద్య, వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రసిద్ధిగాంచిన రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చింది. పర్యాటకులను పరవశింపజేసే లక్నవరం సరస్సు వేలాడే వంతెన, కాటేజీలతో కొత్తరూపును దిద్దుకుంది. మిషన్ కాకతీయతో చెరువులకు కొత్త కళవచ్చింది. దగాపడిన దళిత జీవితాలకు కేసీఆర్ పాలనలో సరికొత్త వెలుగులు వచ్చాయి. కులవృత్తులు సాఫీగా మనుగడ సాగిస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని దవాఖాన వంద పడకలకు అప్గ్రేడ్ అవడమే కాకుండా, మార్కెట్ స్థలంలో 300 పడకల వైద్యశాల నిర్మితమవుతున్నది. మెడికల్ కళాశాల మంజూరైంది. ఇదంతా ఎమిదేండ్లలో సీఎం కేసీఆర్ పాలనలోనే సాధ్యమైంది.
ములుగు, మార్చి 20 (నమస్తేతెలంగాణ) : ఏజెన్సీ ప్రాంతమైన ములుగు నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతున్నది. నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లేకపోయినా సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టితో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అభివృద్ధికి భారీగా నిధులు వెచ్చిస్తున్నారు. కేసీఆర్ పాలనలో ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందుతుండడంతో ప్రజలు సంతోషంగా ఉన్నారు. మెడికల్ కళాశాలను మంజూరు చేయడమే కాకుండా మార్కెట్ స్థలంలో 300 పడకల దవాఖానను నిర్మిస్తున్నారు.
ములుగు వైద్యశాలను 100 పడకలకు అప్గ్రేడ్ చేశారు. ఏటూరునాగారంలో కిడ్నీ బాధితులకు డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోనే ప్రయోగాత్మకంగా ములుగులో టీ డయాగ్నస్టిక్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 49 రకాల రక్త, మూత్ర పరీక్షలు చేసేందుకు అన్ని రకాల ఆధునిక పరికరాలు అందుబాటులోకి తీసుకొచ్చి నిరుపేదలు, గిరిజనులు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు సమానంగా విద్యార్థులకు విద్య అందించడమే లక్ష్యంగా అన్ని పాఠశాలలు, వసతి గృహాలు నిర్మించి విద్యార్థులకు ఆవాసం కల్పించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కింది.
గిరిజన సంక్షేమ పాఠశాల, మహాత్మా జ్యోతిరావు ఫూలే, టీఎస్ మోడల్ స్కూళ్లను నిర్మించారు. దళిత బంధు పథకాన్ని పారదర్శకంగా అమలు చేసేందుకు ఎమ్మెల్యేకు పూర్తి అధికారులు అప్పగించి లబ్ధిదారులకు కేటాయించారు. గిరిజన ప్రాంతాలు అధికంగా ఉన్న నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు రహదారుల నిర్మాణంతో పాటు పల్లె ప్రగతి ద్వారా పల్లెలను ప్రగతికి చిహ్నాలుగా మార్చారు. అంతర్గత వీధుల్లో సీసీ రోడ్లను సైతం నిర్మింపజేశారు. 500 జనాభా కలిగిన ప్రతి తండాను గ్రామపంచాయతీగా ఏర్పాటు చేసి విరివిగా నిధులు మంజూరు చేయడంతో అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయి.
అభివృద్ధి బాటలో అన్ని గ్రామాలు
నియోజకవర్గంలోని ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట, తాడ్వాయి, కన్నాయిగూడెం, మంగపేట, ఏటూరునాగారం మండలాలతో పాటు మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ, గంగారం మండలాల్లో 500 జనాభా కలిగిన ప్రతీ తండాను గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారు. పల్లె ప్రగతితో తండాల రూపురేఖలు మారిపోయాయి. ప్రతి జీపీకి పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, డంపింగ్ యార్డు, నర్సరీలను ఏర్పాటు చేయడంతో పాటు గ్రామాలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి.
మహిళలకు రుణాలు
స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం బ్యాంకు లింకేజీ రుణాలు ఇస్తూ అండగా నిలుస్తుంది. 2022-23లో నియోజకవర్గంలోని 5,655 మహిళా సంఘాలకు గాను 3,170 సంఘాలకు రూ.17.65 కోట్ల రుణాలు అందించింది. స్త్రీనిధి ద్వారా రూ.41.25 కోట్లు లక్ష్యం ఉండగా రూ. 29.29 కోట్ల రుణాలు పంపిణీ చేశారు. అలాగే వివిధ పథకాల ద్వారా మహిళా సంఘాలకు ఏటా రూ.500కోట్ల నుండి రూ.700కోట్ల వరకు రుణాల రూపంలో అందుతున్నాయి.
గర్భిణులు, బాలింతులకు వైద్య సేవలు
గర్భిణులు, బాలింతులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. ప్రభుత్వ దవాఖానలో డెలివరీ అయిన నియోజకవర్గంలోని 9,800 మందికి కేసీఆర్ కిట్లు అందించారు. అంతేకాకుండా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను సైతం అందిస్తున్నారు. అమ్మఒడి వాహనాలతో సేవలు మెరుగయ్యాయి.
మెరుగుపడిన రవాణా
పల్లె ప్రగతి ద్వారా ప్రభుత్వం గ్రామాల్లో అంతర్గత రోడ్లను సీసీలుగా మార్చింది. ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖ ద్వారా సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా మార్చడంతో పాటు సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు.
నిరంతర విద్యుత్ వెలుగులు
బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి 24గంటల నాణ్యమైన కరంటు ఇస్తుండడంతో నియోజకవర్గంలో వస్తున్నది. కోతలు లేని ఉచిత విద్యుత్ ఇస్తుండడంతో రైతులు రెండు పంటలు పండిస్తున్నారు. రజకులకు, నాయీబ్రాహ్మణులకు ఉచిత కరంట్ ఇస్తున్నది.
వైద్యంపై ప్రత్యేక నజర్
రాష్ట్ర ప్రభుత్వం ములుగు జిల్లా కేంద్రంలోని దవాఖానను 100 పడకలకు అప్గ్రేడ్ చేసి సిబ్బంది, వైద్యులను పెంచి ప్రజలకు మెరుగై వైద్యసేవలందిస్తున్నది. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పల్లె దవాఖానలు ఏర్పాటు చేసి 52 మంది వైద్యాధికారులను నియమించింది. ఏటూరునాగారం సామాజిక వైద్యశాలలో డయాలసిస్ సెంటర్ నెలకొల్పింది. జిల్లా కేంద్రంలో రూ.3కోట్లతో టీ డయాగ్నస్టిక్ సెంటర్ ఏర్పాటు చేసి 56 రకాల పరీక్షలను ఉచితంగా అందిస్తున్నారు. మెడికల్ కళాశాలను ఏర్పాటుకు గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో పాటు మార్కెట్ యార్డులో 300 పడకల వైద్యశాలను నిర్మిస్తున్నది.
110 మందికి దళిత బంధు
దళిత బంధు మొదటి విడతలో నియోజకవర్గంలోని 110 మందికి లబ్ధి చేకూరింది. ప్రభుత్వం రూ. 11కోట్లు విడుదల చేయగా లబ్ధిదారులకు రవాణా యంత్రాలు, వ్యాపారాలను ఏర్పాటు చేసుకున్నారు.
పండుగలా వ్యవసాయం
తెలంగాణ ఏర్పడిన తర్వాత రైతు సంక్షేమ పథకాలతో వ్యవసాయం పండుగలా మారింది. ములుగు నియోజకవర్గంలో 2018లో 290 ట్రాక్టర్లను రైతులకు పంపిణీ చేశారు. 24 గంటలు కరంటు ఇస్తూ ధాన్యానికి మద్దతు ధర చెల్లిస్తూ ప్రభుతమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలు చేస్తున్నది. ఆ డబ్బులను నేరుగా వారి ఖాతాల్లో జమచేస్తున్నది.
రైతు బంధు, రైతు బీమాతో అండ
రైతు బంధు పథకం కింద ములుగు నియోజకవర్గంలో 1,30,100 రైతులకు ఇప్పటి వరకు రూ.670 కోట్లు ప్రభుత్వం అందించింది. దురదుష్టవశాత్తు రైతు చనిపోతే వారం రోజుల వ్యవధిలో రైతుబీమా కింద నామినీ అకౌంట్లో రూ.5లక్షలు జమ అవుతున్నాయి. ఇప్పటి వరకు 908 మంది మృతి చెందగా వారి కుటుంబాలకు రూ.45కోట్ల 40 లక్షలు జమ చేసింది.
బిడ్డ పెండ్లికి అయిన ఖర్చులు తీరినయ్..
నాబిడ్డ పెండ్లి చేస్తే కల్యాణలక్ష్మి కింద సర్కారు రూ.లక్షా116లు ఇచ్చింది. లగ్గం చేసినప్పుడు అప్పు చేసిన. కల్యాణలక్ష్మి పథకం కోసం దరఖాస్తు చేసిన. కొన్ని రోజులకే పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వం నుంచి నాకు చెక్కు వచ్చింది. బ్యాంకు ఏసి పైసలు ఇడిపించుకున్న. ఆ పైసలతో అప్పు తీర్చిన. సీఎం కేసీఆర్ సారు సాయం చేయకుంటే అప్పు అట్లనే ఉండి మిత్తీలు పెరిగేవి. ఆయన సల్లంగుండాలె.
-భూక్యా జమున, దుంపెల్లిగూడెం, గోవిందరావుపేట మండలం
రైతు బంధుతోనే సేద్యం..
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఏటా రెండు సీజన్లకు రైతు బంధు ఇస్త్తుండడంతో అప్పులు లేకుండా పంటలు పండి స్తున్న. బోరునర్సాపురం రెవెన్యూ శివారులో నాకు మూడు ఎకరాల పొలం ఉంది. వానకాలం, యాసంగి సీజన్లలో రూ.30వేల రైతు బంధు వస్తున్నది. ఇదివరకు ఎప్పుడూ ఏ సర్కారు రైతుల కోసం ఆలోచించలేదు. సీఎం కేసీఆర్కు రైతుల బాధలు తెలుసుకాబట్టి మాలాంటి చిన్న సన్నకారు రైతులను ఆదుకుంటున్నడు. ఇలాంటి ప్రభుత్వం దేశం మొత్తం ఉండాలె.
– దుర్గం ఏకాంతరావు, బోరునర్సాపురం, మంగపేట మండలం
వితంతు పింఛనే ఆధారం..
ప్రతి నెలా అందిస్తున్న వితంతు పింఛనే నాకు జీవనాధారం. ఎలాంటి ఆస్తులు లేవు. గతంలో ఏ సర్కారు కూడా ఇట్లాంటి సాయం చేయలె. ఈ పథకాన్ని ఎప్పటికీ గిట్లనే కొనసాగియ్యాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సారును వేడుకుంటున్నం.
– గుడివాడ రమాదేవి, బోరునర్సాపురం, మంగపేట మండలం