రెండు రోజుల నుంచి వర్షం ఏకధాటిగా, కుండపోతగా కురుస్తున్నది. వరంగల్ జిల్లాలో 27.2 మిల్లీమీటర్లు, హనుమకొండలో 19.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా పర్వతగిరి మండలంలోని కల్లెడలో 158.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. రెండు జిల్లాల్లో ఎడతెరిపి లేని వానతో వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా.. చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి. కటాక్షాపురం పెద్ద చెరువు పెద్ద ఎత్తున అలుగు పారుతుండడంతో వరంగల్ నుంచి ములుగు వైపు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే పలు చోట్ల కాజ్వేల పైనుంచి వరద ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కాకతీయ మెయిన్ కెనాల్కు గండ్లు పడగా, రెండు కుంటల కట్టలు తెగాయి. గ్రేటర్ వరంగల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరదల దృష్ట్యా ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ప్రమాదకరంగా మారిన ములుగు రోడ్డులోని నాలాను చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, మేయర్ గుండు సుధారాణి, మున్సిపల్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా పరిశీలించారు. హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్య వానలు, వరదలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
వరంగల్, జూలై 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వానలు పుష్కలంగా పడుతున్నాయి. బుధవారం అన్ని చోట్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో వానలు ఎక్కువగా ఉన్నాయి. మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఓ మోస్తరుగా ఉన్నాయి. అన్ని ప్రాంతాల్లోనూ తెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెంలో 97 మిల్లీమీటర్లు, కమలాపూర్లో 64 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎల్కతుర్తిలో 58, దామెరలో 56, మడికొండలో 51, శాయంపేటలో 5, ఐనవోలులో 47, ధర్మసాగర్లో 43, పెద్ద పెండ్యాలలో 42 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. వరంగల్ జిల్లాలో బుధవారం ఎక్కువ వానలు పడ్డాయి. నెక్కొండలో 76, సంగెం 71 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జనగామ జిల్లా జఫర్గఢ్లో 68, వరంగల్ జిల్లా రెడ్లవాడలో 66, నర్సంపేట మండలం లక్నేపల్లిలో 65, ఖానాపురం మండలం మంగళవారిపేటలో 62, నల్లబెల్లిలో 59, రాయపర్తిలో 56, దుగ్గొండిలో 56, పర్వతగిరి మండలం కల్లెడలో 56, గీసుగొండ మండలం గొర్రెకుంటలో 55, పర్వతగిరి మండలం ఏనుగల్లో 55, భూపాలపల్లి జిల్లా చిట్యాలలో 55 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
వరుస వానలతో అన్ని చెరువులు నిండి పొంగుతున్నాయి. 60 శాతం వరకు చెరవులు మత్తడి పడుతున్నాయి. మిషన్ కాకతీయలో చెరువులను మరమ్మతు చేయడంతో వరద ప్రవాహం సాఫీగా పోతున్నది. ఎక్కడా చెరువులకు ఇబ్బంది లేకుండా ఉంటున్నది. అధిక వానలతో చెరువులు నిండి మత్తడి పడి వరద నీళ్లు రోడ్లపైకి వస్తున్నాయి. కొన్ని చోట్ల వాహనాల రాకపోకలకు అడ్డంకులు ఏర్పడ్డాయి. జాతీయ రహదారులపైనా ఇదే పరిస్థితి ఉన్నది. వరంగల్-ములుగు, వరంగల్-ఖమ్మం జాతీయ రహదారులపై వరద నీటి ప్రవాహంతో వాహనాల రవాణా ఆగిపోతున్నది. పెద్ద వాహనాలు మినహా ఇతర వాహనాలు వేరే మార్గాల్లో పోతున్నాయి. మరో రెండు రోజులు అధిక వానలు కొనసాగుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
నిలిచిపోయిన రాకపోకలు..
వరంగల్, జూలై 26 (నమస్తేతెలంగాణ) : జిల్లాలో ఎడతెరిపిలేకుండా వర్షం కురిసింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు జిల్లావ్యాప్తంగా 397 మిమీ వర్షపాతం నమోదైంది. వర్ధన్నపేట మండలంలో 13.8 మిమీ తేలికపాటి వర్షం పడింది. ఇతర మండలాల్లో 20.4మిమీ నుంచి 55.2 మిమీ వర్షం కురిసింది. ఖానాపురంలో 55.2మిమీ వర్షపాతం నమోదైంది. పర్వతగిరి మండలంలోని కల్లెడలో 90, రాయపర్తి మండల కేంద్రంలో 84.8, నెక్కొండలో 78.5, సంగెంలో 72.5, నెక్కొండ మండలం రెడ్లవాడలో 66.5, నర్సంపేట మండలంలోని లక్నేపల్లిలో 65.8, ఖానాపురం మండలంలోని మంగళవారిపేటలో 65 మిమీటర్లు నమోదైంది. పాతముగ్ధుంపురం వద్ద ఉన్న కాజ్వే మీదుగా వరద నీరు ప్రవహిస్తుండడంతో నర్సంపేట- నెక్కొండ ప్రధాన రూటులో రాకపోకలకు బ్రేక్ పడింది. నర్సంపేట నుంచి గురిజాల, మాదన్నపేట, గురిజాల- గుంటూరుపల్లి రూట్లలోనూ రాకపోకలు నిలిచిపోయాయి.
వరంగల్లో వరద నీరు చేరిన కాలనీల్లో ప్రభుత్వ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మేయర్ గుండు సుధారాణి బల్దియా కమిషనరు షేక్ రిజ్వాన్ బాషాతో కలిసి వరద తీవ్రత ఉన్న వరంగల్లోని ఎన్టీయార్నగర్ సందర్శించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించారు. త్వరలో సమస్య పరిష్కరిస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు. ఇక్కడ 28వ డివిజన్ పరిధిలోని సంతోషిమాత గార్డెన్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో స్థానికులు ఆవాసం పొందుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ ప్రావీణ్య గూగుల్ మీట్ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, తాసిల్దార్లతో మాట్లాడారు. నష్ట నివారణ చర్యలపై సూచనలు చేశారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సంబంధిత అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలిస్తున్నారు.
నీటితో నిండిన 639 చెరువులు..
భారీ వర్షాలతో వరద నీరు చెరువుల్లోకి చేరుతోంది. జిల్లాలోని 815 చెరువుల్లో ఇప్పటికే 639 చెరువులు నిండి మత్తడి దుంకుతున్నాయి. గీసుగొండ మండలంలోని 76, సంగెం మండలంలోని 70, వరంగల్ మం డలంలోని 20 చెరువులు నిండి మత్తడి పోస్తున్నట్లు జలవనరుల శాఖ అధికారులు వెల్లడించారు. వర్ధన్నపేట మండలంలోని 68 చెరువుల్లో 67 అలుగు పోస్తున్నాయి. ఖిలావరంగల్ మండలంలోని 48 చెరువుల్లో 47 మత్తడి దుంకుతున్నాయి. ఖానాపురం మండలంలోనూ 23 చెరువులు ఉండగా 22 అలుగు పోస్తున్నాయి. రాయపర్తి మండలంలోని 88 చెరువుల్లో 80 నిండాయి. వరద తీవ్రతతో ఖిలావరంగల్ మండలం మామునూరులోని నిమ్మకుంట, బొల్లికుంటలోని జగన్నాయకులకుంట కట్టలు తెగాయి. ఇరిగేషన్ అధికారులు ప్రస్తుతం తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. ఎస్సారెస్పీ కాకతీయ కాలువకు సంగెం మండలంలోని షాపూర్, పర్వతగిరి మండలంలోని కొంకపాక, వర్ధన్నపేట మండలంలోని కుమ్మరిగూడెం గ్రామం వద్ద మూడుచోట్ల గండ్లు పడ్డాయి. కుమ్మరిగూడెం వద్ద తాత్కాలికంగా మట్టికట్ట వేసినట్లు జలనవరుల శాఖ వరంగల్ డీఈఈ హర్షవర్ధన్ చెప్పారు. కొంకపాక, షాపూర్ వద్ద ఇసుక బస్తాలను వేస్తామని తెలిపారు.