మహదేవపూర్(కాళేశ్వరం) మే 12: పన్నెండ్లకోసారి వచ్చే సరస్వతీ పుష్కరాల్లో పుణ్యస్నానాలకు వచ్చే సామాన్యులకు కనీసం సౌకర్యాలు కల్పించకపోవడం సిగ్గు చేటని మాజీ ఎమ్మెల్యే, మంథని నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్చార్జి పుట్ట మధుకర్ అన్నారు. ఈ నెల 15 నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలం కాళేశ్వరంలోని గోదావరినదిలో ప్రారంభం కానున్న సరస్వతీ పుష్కరాల నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టిన పుష్కర పనులను సోమవారం ఆయన స్థానిక బీఆర్ ఎస్ నాయకులతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మరో రెండు రోజుల్లో సరస్వతీ పుష్కరాలు ప్రారంభం కానుండగా ఎక్కడ కూడా పనులు పూర్తి కాలేదన్నారు.
స్థానిక ఎమ్మెల్యే, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇద్దరూ కలిసి సరస్వతీ పుష్కరాలను నిర్వీర్యం చేశారని ఆయన ఆరోపించారు. గోదావరినది ఒడ్డున సరస్వతీ అమ్మవారి మండపాన్ని చూస్తే పుష్కర పనులు ఎలా చేస్తున్నారో అర్థం అవుతుందన్నారు. మంథని ఎమ్మెల్యే మంత్రిగా ఉండగా ఆయన సతీమణి ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉందని, వీరిద్దరు సరస్వతీ పుష్కరాలను ఘనంగా నిర్వహించేలా చూడాల్సిన బాధ్యత ఉన్నా ఆ విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. సరస్వతీ పుష్కరాలు గతంలో రాజమండ్రిలో మాత్రమే జరిగేవని, తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ డిమాండ్ మేరకు గోదావరినదిలో పుష్కరాలు జరుపుకునే అవకావం వచ్చిందన్నారు.
2013లో సరస్వతీ పుష్కరాలను ఘనంగా జరుపుకున్నామని, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి జరుపుకునే సరస్వతీ పుష్కరాలపై మంథని ఎమ్మెల్యే పట్టింపులేమి ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారని మండిపడ్డారు. పుష్కరాల నిర్వహణపై ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గత ఏడాది సెప్టెంబర్లో అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించగా మంథని ఎమ్మెల్యే ఈ ఏడాది జనవరిలో రివ్వూ మీటింగ్ నిర్వహించారని, పలుమార్లు రివ్యూ మీటింగ్లు నిర్వహించినా పనులు పూర్తికాకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. పుష్కరాలకు లక్షలాది మంది తరలివచ్చే సామాన్య భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించలేదన్నారు. స్నానాలు చేసేందుకు వసతులు లేవని, టాయిలెట్లు, అపరకర్మ మండపం పూర్తి చేయలేదన్నారు.
కేవలం వీఐపీలకు సంబంధించిన పనులను మాత్రమే పూర్తి చేశారని, ఈ పుష్కరాలకు సామాన్యులకు అనుమతిస్తరా లేదా అనే అనుమానాలు ఉన్నాయని ఆయన అన్నారు. సాక్ష్యాత్తు సరస్వతీ అమ్మవారు ఆవిర్బవించిన చోటునే పుష్కరాలు ప్రారంభం అవుతాయని చెప్తున్నారని, అక్కడ మాత్రం వీఐపీలకు సకల సౌకర్యాలు కల్పించారని ఆయన ఎద్దేవా చేశారు. పుష్కర పనులను ఎలాంటి నైపుణ్యం లేనివాళ్లకు అప్పగించారని, అధికారులు క్వాలిటీ చేయడానికి భయపడుతున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ఇక్కడ పనులు, ఏర్పాట్లను చూస్తే ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నారు.
ఎన్నికలు వస్తే నోట్ల సంచులతో వచ్చి ఓట్లు దండుకోవచ్చనే ఆలోచనతో మంథని ఎమ్మెల్యే ఉన్నాడని, ప్రజల ఆకాంక్ష, మనోభావాలను గౌరవించడం లేదని విమర్శించారు. పలుమార్లు రివ్యూ మీటింగ్లు కమీషన్ల కోసమే పెట్టారని, ఈ క్రమంలోనే నాణ్యత లేని పనులు జరుగుతున్నాయని ఆరోపించారు. సరస్వతీ పుష్కరాల్లో జరుగిన పనులపై క్వాలిటీ పరీక్షలు నిర్వహించాలని, సమగ్ర విచారణ జరిపించడంతో పాటు పనులకు సంబంధించిన నిధులు, పనులు, టెండర్ల జారీ ప్రక్రియపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పుష్కరాల్లో సామాన్యులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించాలని, లేని పక్షంలో తాము బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తామని ఈ సందర్బంగా హెచ్చరించారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకులు జక్కు రాకేష్, మండల అధ్యక్షుడు లింగంపల్లి శ్రీనివాసరావు, మహాదేవపూర్, కాళేశ్వరం మాజీ సర్పంచులు శ్రీపతి బాబు, వెన్నపురెడ్డి వసంత మోహన్ రెడ్డి, బీఆర్ఎస్ మహిళామండల అధ్యక్షురాలు ఒడేటి స్వప్న మల్లారెడ్డి, కాళేశ్వర ముక్తేశ్వర ఆలయ మాజీ చైర్మన్ పోత వెంకటస్వామి, బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు ఎండీ అలిమ్ ఖాన్, కూరతోట రాకేష్, సీనియర్ నాయకులు కారెంగుల బాపు రావు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.