హనుమకొండ, జూలై 17 : ‘కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికీ రైతు ద్రోహే. దేశాన్ని, ఉమ్మడి రాష్ర్టాన్ని 60ఏళ్లు పాలించినా ఒక్కరోజు కూడా అన్నదాతల బాగోగులు పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పుడు మరోమారు మోసగించేందుకు కుటిల యత్నం చేస్తున్నది.’ అని కాంగ్రెస్పై పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధ్వజమెత్తారు. సోమవారం హనుమకొండలోని ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో ఎమ్మెల్యేలు అరూరి, పెద్ది, నన్నపునేని, తాటికొండ, మేయర్ సుధారాణి, కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాల్సిందేనని, ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ కోసం అన్నదాతలు ధర్నాలు చేసిన విషయం టీపీసీసీ చీఫ్కు గుర్తు లేదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ద్వంద్వ నీతిని కర్షకులకు వివరిస్తామని, రైతులకు అండగా ఉంటూ వారి సాదకబాధకాల్లో పాలుపంచుకుంటున్న దేశంలోనే ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయం పండుగలా మారిందన్నారు.
గతంలో రైతాంగాన్ని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ మరోసారి ద్రోహం చేసేందుకు సిద్ధమైందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ధ్వజమెత్తారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి రైతులకు మూడు గంటల కరెంట్ చాలని చేసిన వ్యాఖ్యలపై మంత్రి మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు విద్యుత్తు విషయంలో నాతో కలిసి రైతులకు మద్దతుగా ధర్నాలు చేయడంతో పాటు అసెంబ్లీలో కాంగ్రెస్కు వ్యతిరేకంగా మాట్లాడి… ఇప్పుడు రైతులకు మూడు గంటలు కరెంట్ చాలు అనడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం హనుమకొండలోని మంత్రి క్యాంపు కార్యాలయం (ఆర్ అండ్ బీ గెస్ట్హౌస్)లో ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, తాటికొండ రాజయ్య, పెద్ది సుదర్శన్రెడ్డి, నన్నపునేని నరేందర్, మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ సంఘంరెడ్డి సుందర్రాజ్ యాదవ్తో కలిసి విలేకరులతో మాట్లాడారు. రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ రైతాంగం మండిపడుతున్నదన్నారు. మూడు గంటల కరెంట్ వద్దు… మూడు పంటలు కావాలని రైతు వేదికల్లో రైతులు తీర్మానం చేశారని చెప్పారు.
ఆనాడు కరెంట్ విషయంలో కాంగ్రెస్ పార్టీని తిట్టినోడు మళ్లీ అదే కరంటుపై అవగాహన లేని మాటలు మాట్లాడం సిగ్గుచేటన్నారు. విద్యుత్ సమస్యలతో రైతుల మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయని అసెంబ్లీ, ఇందిరా పార్కు ఎదుట ధర్నాలు చేయలేదా? కాలిపోయిన మోటర్లు, స్టాటర్లు, ఎండిన పైర్లను అసెంబ్లీలో ప్రదర్శించిన సందర్భాలు లేవా? అని మంత్రి ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటైతే కరెంట్ సమస్య తీవ్రతరం అవుతుందని వైఎస్సార్ అంటే, కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకొనే పరిస్థితులు వస్తుందని అప్పటి సీఎం కిరణ్కుమార్రెడ్డి అన్నారని మంత్రి గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ 24గంటల ఉచిత నాణ్యమైన కరెంట్ను రైతులకు అందించి దండుగ అన్న వ్యవసాయాన్ని పండుగ చేసి చూపించారని చెప్పారు. ‘రేవంత్రెడ్డి ఓ బ్రోకర్.. నీ చరిత్ర అందరికీ తెలుసు.. ఏనాడైనా వ్యవసాయం చేసిన మొఖమా.. నీవు రైతు బిడ్డవు కావు కాబట్టే.. ఎకరం పారేందుకు మూడు గంటలు విద్యుత్తు సరిపోతుంది.’ అని పనికిమాలిన మాటలు అన్నావని ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ. 80వేల కోట్లు ఖర్చయితే రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టుతో చెరువులు, కాల్వలు నిండుగా పారడంతో పాటు భూ గర్భజలాలు పెరిగాయని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ మాట్లాడేది ఒకటి.. చేసేది మరొకటి అని అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడైనా 24 గంటల కరెంట్ ఇస్తున్నారా? ఛత్తీస్గఢ్ రైతులు తెలంగాణలో భూములు కొనుగోలు చేసి అందులో బోర్లు వేసుకొని వారి రాష్ట్రంలోని సాగు భూములకు నీరు పారించుకుంటున్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఛత్తీస్గఢ్లో రైతులకు రూ.2వేలు ఇస్తే తెలంగాణలో రూ.10వేలు ఇస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయాలతో భూముల ధరలు పెరిగాయని, తద్వారా రైతుల ఆస్తులు సైతం పెరిగాయని మంత్రి పేర్కొన్నారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు రైతాంగాన్ని నాశనం చేశాయని మంత్రి అన్నారు. రైతుబంధు కింద ఇప్పటివరకు రూ.72వేల కోట్లు ఇచ్చామని తెలిపారు. ఉచిత కరెంట్ కోసం రైతులకు సంబంధించిన ఒక్కొక్క మోటర్కు సంవత్సరానికి రూ.1.20లక్షల చొప్పున 12వేల కోట్లు ఎన్పీడీసీఎల్కు చెల్లిస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టని వాటిని సైతం రైతు సంక్షేమం కోసం సీఎం అమలు చేస్తున్నారన్నారు. రాబోయే తొమ్మిది రోజులు ఉద్యమించడంతో పాటు కాంగ్రెస్ గతంలో రైతులకు చేసిన మోసం, మళ్లీ చేయనున్న ద్రోహాన్ని వివరించి ప్రజలను చైతన్యం వంతం చేస్తామని తెలిపారు. రైతాంగానికి రేవంత్రెడ్డి క్షమాపణ చేపాల్సిందేనని డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికల ఫలితాల్లో మొదటి స్థానంలో బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని, సెకండ్ ప్లేస్ కోసం కాంగ్రెస్, బీజేపీ పోటీపడుతున్నాయన్నారు.