ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం దవాఖానల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నది. అన్ని రకాల వైద్య సేవలను అందుబాటులో ఉంచడంతోపాటు వైద్యులు, సిబ్బందిని నియమిస్తున్నది. దీంతో ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’.. అనే దుస్థితి నుంచి ‘నేను పోత బిడ్డో సర్కారు దవాఖానకు’ అనే వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలో జిల్లాలోని ప్రభుత్వ హాస్పిటళ్ల్లలో ప్రసవాల సంఖ్య పెరుగుతోంది. సీకేఎం, నర్సంపేట, వర్ధన్నపేట సీహెచ్సీల్లో నెలకు సుమారు 700 డెలివరీలు నమోదవుతున్నాయి. 24 గంటలు పనిచేసే కొన్ని పీహెచ్సీల్లో కూడా ప్రసవాలకు వైద్య శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మ ఒడి, కేసీఆర్ కిట్, ఆర్థిక సా యంతో మెరుగైన ఫలితాలు వస్తున్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన వైద్యరంగానికి తెలంగాణ సర్కారు జవ సత్వాలు నింపింది. కోట్లాది రూపాయలు వెచ్చించి అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్ది ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్నది. ఒకప్పుడు ఏరియా వైద్యశాలగా ఉన్న మానుకోట దవాఖానను జిల్లా వైద్యశాలగా అప్గ్రేడ్ చేసి, నిరంతర వైద్యానికి కేరాఫ్గా మార్చింది. 100 పడకలను 330కి పెంచడంతోపాటు ఐసీయూ వార్డు, డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసింది. అన్ని విభాగాల్లో 70 మంది డాక్టర్లు, ఇతర సిబ్బంది షిఫ్టుల వారీగా నిరంతర సేవలు అందిస్తున్నారు. గతంతో పోల్చుకుంటే ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. రోజుకు సగటున 10, నెలకు 365 డెలివరీలు జరుగుతున్నాయి. ప్రత్యేకంగా డయాగ్నొస్టిక్ సెంటర్ను ఏర్పాటు చేసి ఖరీదైన వైద్య పరీక్షలను ఉచితంగా చేయిస్తుండగా, ఇప్పటివరకు జిల్లాలో 47,084 మంది ఈ సేవలను ఉపయోగించుకున్నారు. – మహబూబాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ)
వరంగల్, జూలై 29 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ దవాఖానలను అభివృద్ధి చేస్తోంది. అవసరమైన వసతులను సమకూర్చుతున్నది. వైద్యులు, సిబ్బందిని నియమిస్తున్నది. అన్ని రకాల వైద్య సేవలు లభించేలా కార్పొరేట్ దవాఖానలకు దీటుగా తీర్చిదిద్దుతున్నది. దీంతో సర్కారు దవాఖానలపై ప్రజల్లో ఆదరణ పెరిగింది. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే దుస్థితి నుంచి నేను పోత బిడ్డో సర్కారు దవాఖానకు అనే వాతావరణం ఏర్పడింది. ఇటీవలి కాలంలో ప్రభుత్వం సర్కారు దవాఖానల్లో ప్రసవాలను పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రసవం కోసం ప్రైవేట్ దవాఖానల నిర్వాహకులు పెద్ద మొత్తంలో డబ్బు గుంజుతోంది. దీంతో ప్రజలపై ఆర్థిక భారం పడుతున్నందున ప్రభుత్వ దవాఖానల్లోనే ప్రసవాలను పెంచే దిశగా అడుగులు వేస్తోంది. అదికూడా సిజేరియన్ కాకుండా నార్మల్ డెలివరీలకు ప్రాధాన్యం ఇవ్వాలని వైద్య అధికారులకు చెబుతోంది. కేసీఆర్ కిట్, అమ్మ ఒడి వంటి పథకాలూ తోడు కావడంతో సర్కారు దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెరుగుతోంది.
జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో ప్రతి నెల సుమారు 700 ప్రసవాలు నమోదు అవుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో మూడు సర్కారు దవాఖానల్లో ప్రసవాలు జరుగుతున్నాయి. వీటిలో వరంగల్లోని సీకేఎం ఒకటి. రెండోది నర్సంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్సీ). ఇక మూడోది వర్ధన్నపేట సీహెచ్సీ. అత్యధికంగా సీకేఎం దవాఖానలో ప్రసవాలు నమోదు అవుతున్నాయి. ఈ దవాఖానలో సగటున నెలకు సుమారు 500 ప్రసవాలు జరుగుతున్నాయి. గత జనవరి నుంచి సీకేఎం దవాఖానలో నమోదైన ప్రసవాల సంఖ్యను పరిశీలిస్తే జనవరిలో 490, ఫిబ్రవరిలో 424, మార్చిలో 543, ఏప్రిల్లో 515, మేలో 526, జూన్లో 477 ప్రసవాలు జరిగాయి. ఈ నెలలోనూ ప్రసవాల సంఖ్య అదే స్థాయిలో ఉంది. నర్సంపేట సీహెచ్సీలో సగటున ప్రతినెల సుమారు 100 ప్రసవాలు నమోదవుతున్నాయి. ఈ దవాఖానలో గత జనవరిలో 106, ఫిబ్రవరిలో 93, మార్చిలో 123, ఏప్రిల్లో 92, మేలో 84, జూన్లో 93 ప్రసవాలు జరిగాయి. ప్రస్తుత జూలైలో గురువారం వరకు 98 డెలివరీలు ఇక్కడ జరిగినట్లు నర్సంపేట సీహెచ్సీ సూపరింటెండెంట్ డాక్టర్ గోపాల్ వెల్లడించారు. గత ఏడు నెలలుగా నర్సంపేట సీహెచ్సీలో జరిగిన ప్రసవాల్లో నార్మల్ డెలివరీలు 294 ఉన్నట్లు ఆయన తెలిపారు. వర్ధన్నపేట సీహెచ్సీలో గత జనవరిలో 88, ఫిబ్రవరిలో 76, మార్చిలో 112, ఏప్రిల్లో 109, మేలో 67, జూన్లో 88 ప్రసవాలు జరిగాయి. వీటిలో గత ఆరు నెలల్లో నార్మల్ డెలివరీలు 159 ఉన్నట్లు వైద్య అధికారులు తెలిపారు.
కేసీఆర్ కిట్… అమ్మ ఒడి
సర్కారు దవాఖానల్లో ప్రసవాలను పెంచేందుకు ప్రభుత్వం కేసీఆర్ కిట్, అమ్మ ఒడి పథకాలను అమలు చేస్తోంది. వైద్య పరీక్షల కోసం గర్భిణులు తమకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ దవాఖానకు కాల్ చేయగానే వైద్య శాఖ అధికారులు అమ్మ ఒడి పథకానికి చెందిన 102 వాహనాన్ని పంపిస్తారు. దవాఖాన నుంచి నేరుగా ఈ వాహనం గర్భిణుల ఇళ్లకు వెళ్తుంది. వారిని ఉచితంగా ఇళ్ల నుంచి దవాఖానకు తీసుకొచ్చి వైద్య పరీక్షల అనంతరం తిరిగి ఇళ్ల వద్ద దింపుతోంది. డెలివరీ సమయంలోనూ గర్భిణులను ఇళ్ల నుంచి ప్రభుత్వ దవాఖానకు తీసుకొచ్చి ప్రసవం అనంతరం తల్లీబిడ్డలను సురక్షితంగా ఇళ్లకు చేర్చుతుంది. సర్కారు దవాఖానల్లో ప్రసవించిన మహిళలకు ప్రభుత్వం కేసీఆర్ కిట్ అందజేస్తున్నది. సూట్కేస్ సహా 16 వస్తువులు ఈ కిట్లో ఉంటాయి. కేసీఆర్ కిట్ పథకం ద్వారా ప్రభుత్వం సర్కారు దవాఖానల్లో మగ బిడ్డకు జన్మనిచ్చిన మహిళకు రూ.12 వేలు, ఆడ బిడ్డకు జన్మనిచ్చిన మహిళకు రూ.13 వేల చొప్పున విడుతల వారీగా అందజేస్తున్నది. కేసీఆర్ కిట్, అమ్మ ఒడి పథకాలతో ఎంతో ప్రయోజనం కలుగుతుందని ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవించిన మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 102 వాహనం ద్వారా ఉచిత ప్రయాణ వసతి పొందుతున్నామని మురిసిపోతున్నారు. సీకేఎం దవాఖానకు వరంగల్లోని గర్భిణులతో పాటు గీసుగొండ, సంగెం, పర్వతగిరి మండలాల గర్భిణులు డెలివరీ కోసం వస్తున్నారు. వర్ధన్నపేట సీహెచ్సీలో రాయపర్తి, వర్ధన్నపేట తదితర మండలాలు, నర్సంపేట సీహెచ్సీలో నెక్కొండ, చెన్నారావుపేట, నర్సంపేట, నల్లబెల్లి, ఖానాపురం, దుగ్గొండి మండలాల గర్భిణులు వైద్య సేవలు పొందుతున్నారు. జిల్లాలో 24 గంటలు పనిచేసే కొన్ని పీహెచ్సీల్లో కూడా ప్రసవాలకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.