వరంగల్, ఆగస్టు 3(నమస్తేతెలంగాణ) : జిల్లాలో రిజర్వ్డ్ మద్యం దుకాణాలపై ఉత్కంఠకు తెరపడింది. లాటరీ పద్దతిన అధికారులు రిజర్వ్డ్ మద్యం దుకాణాలను ఖరారు చేశారు. గౌడ కులస్తులకు 14, ఎస్సీ 6, ఎస్టీలకు 2 మద్యం దుకాణాలను కేటాయించినట్లు ప్రకటించారు. 2023-25 కోసం మద్యం దుకాణాల కేటాయింపునకు ప్రభుత్వం బుధవారం షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ అధికారులు గురువారం రిజర్వ్డ్ మద్యం దుకాణాల ఖరారుకు కలెక్టర్ కార్యాలయంలో డ్రా నిర్వహించారు. జిల్లాలోని 63 మద్యం దుకాణాల్లో గౌడలకు 15, ఎస్సీలకు 10, ఎస్టీలకు 5 శాతం దుకాణాల కేటాయింపునకు జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య డ్రా తీశారు. గౌడలకు 14, ఎస్సీలకు 6, ఎస్టీలకు 2 మద్యం దుకాణాలు కేటాయించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్శాఖ జిల్లా అధికారి ఆర్ లక్ష్మానాయక్తో పాటు ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. జిల్లాలోని 63 మద్యం దుకాణాల్లో 22 రిజర్వ్డ్ కేటగిరిలోకి వెళ్లగా 41 అన్ రిజర్వ్డ్విగా ఎక్సైజ్శాఖ అధికారులు వెల్లడించారు. మద్యం దుకాణాల గెజిట్ నెంబర్ల ప్రకారం ఎస్టీలకు డబ్ల్యూఆర్ఆర్ 14, 11, ఎస్సీలకు డబ్ల్యూఆర్ఆర్ 16, 22, 27, 51, 36, 50, గౌడలకు డబ్ల్యూఆర్ఆర్ 39, 58, 5, 57, 24, 3, 21, 38, 61, 4, 9, 15, 48, 45వ నంబర్ వైన్ షాపులు రిజర్వ్ అయినట్లు ప్రకటించారు.
ఎస్టీలకు రిజర్వ్ అయిన రెండింటిలో నల్లబెల్లి, నెక్కొండ మండలాల్లోని మద్యం దుకాణాలు ఉన్నట్లు తెలిసింది. ఎస్సీలకు రిజర్వ్ అయిన ఆరింటిలో గిర్నిబావితో పాటు నెక్కొండ, వర్ధన్నపేట, సంగెం, పరకాల, దామెర మండలాల్లోని ఒక్కో షాపు ఉన్నట్లు సమాచారం. గౌడలకు రిజర్వ్ అయిన పద్నాలుగు షాపుల్లో పరకాలలో 2, శాయంపేట, సంగెం, రాయపర్తిలో ఒకొక్కటి, పర్వతగిరి మండలంలో 2, నర్సంపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఏడు దుకాణాలు ఉన్నట్లు తెలిసింది. రిజర్వ్డ్ మద్యం దుకాణాలేవి అనేది తేలడంతో టెండర్లలో పాల్గొనేందుకు వ్యాపారులు సన్నద్ధం అవుతున్నారు. జిల్లాలోని 63 మద్యం దుకాణాల్లో రూ.50 లక్షల స్లాబులో 11, రూ.55 లక్షల స్లాబులో 46, రూ.85 లక్షల స్లాబులో 6 ఉన్నట్లు ఎక్సైజ్శాఖ అధికారులు తెలిపారు. షెడ్యూల్ ప్రకారం టెండర్ల ప్రక్రియ ద్వారా జిల్లాలోని 63 మద్యం దుకాణాల కేటాయింపునకు శుక్రవారం నోటిఫికేషన్ వెలువడనుంది. ఇదేరోజు నుంచి ఈ నెల 18 వరకు 63 మద్యం దుకాణాలకు ఎక్సైజ్శాఖ అధికారులు వ్యాపారుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు.
ఈ నెల 21న డ్రా నిర్వహిస్తారు. వరంగల్లోని ఉర్సు వద్ద ఖమ్మం బైపాస్రోడ్డులో ఉన్న నాని గార్డెన్లో డ్రా నిర్వహించేందుకు నిర్ణయించారు. లాటరీ పద్ధతిన 63 మద్యం దుకాణాల కేటాయింపు జరగనున్నది. 2021 నవంబర్లో 2021-2023 కోసం 63 మద్యం దుకాణాలకు 1,793 దరఖాస్తులు వచ్చా యి. అత్యధికంగా పరకాల ఎక్సైజ్స్టేషన్ పరిధిలోని డబ్ల్యూఆర్ఆర్ 029 నంబర్ దుకాణానికి 73 దరఖాస్తులు, 046 నంబర్ దుకాణానికి 65, నర్సంపేట ఎక్సైజ్స్టేషన్ పరిధిలోని 024 నంబర్ దుకాణానికి 60 దరఖాస్తులు వచ్చినట్లు అప్పట్లో ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. ఈసారి కూడా మద్యం అమ్మకాలు ఎక్కువ ఉన్న వైన్ షాపులకు వ్యాపారులు పోటీ పడే అవకాశం ఉంది. శుక్రవారం నుంచి దరఖాస్తుల స్వీకరించనుండడంతో వ్యాపారులు మద్యం అమ్మకాలు అధికంగా ఉన్న దుకాణాలను గుర్తించడంపై దృష్టి సారించారు.
హనుమకొండలో..
హనుమకొండ : రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీ ప్రకారం జిల్లాలో రిటైల్ మద్యం దుకాణాలను ఎస్టీ, ఎస్సీ, గౌడలకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను అనుసరించి రిజర్వేషన్ మేర కు లాటరీ ద్వారా కేటాయించినట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. గురువారం హనుమకొండ కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లోఎక్సైజ్, గిరిజన సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, బీసీ అభివృద్ధి శాఖల అధికారుల సమక్షంలో కలెక్టర్ డ్రా ద్వారా మద్యం షాపులను కేటాయించారు. హనుమకొండ జిల్లాలోని 65 రిటైల్ మద్యం షాపులకు ఎస్టీలకు1, ఎస్సీలకు 10, గౌడ సామాజిక వర్గాలకు15 రిటైల్ మద్యం షాపులు కలెక్టర్ డ్రా తీసి కేటాయించారు. 39 మద్యం షాపులు జనరల్ కేటగిరీ కింద మిగిలినట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ జీ అంజన్రావు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ నిర్మల, జిల్లా బీసీ సంక్షేమ అధికారి రామిరెడ్డి, గిరిజన సంక్షేమాధికారి ప్రేమకళ పాల్గొన్నారు.