తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రయోజనం అందించేలా తపాలా శాఖ సరికొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు భరోసా కల్పించేందుకు పోస్టల్ బీమాను అమలు చేస్తున్నది. 18 నుంచి 65 ఏళ్లలోపు వారు ఏడాదికి రూ.399 ప్రీమియం చెల్లించి పోస్టల్బీమా పథకంలో చేరితే చాలు.. ప్రమాదంలో మరణిస్తే కుటుంబానికి రూ.10 లక్షలు బీమా అందిస్తుంది. శాశ్వత వైకల్యం పొందినా, అవయవాలు కోల్పోయినా, పక్షవాతం వచ్చినా ఇన్సూరెన్స్ వర్తింప చేస్తారు. ప్రస్తుతం ములుగుతో కలుపుకొని 6 సబ్ పోస్టాఫీసులు, 81 బ్రాంచ్ పోస్టు ఆఫీసులు ఉన్నాయి. పోస్టల్ ఇన్సూరెన్స్ పథకంపై అధికారులు అవగాహన సదస్సులు నిర్వహిస్తుండడంతో జిల్లాలో 1,100 మంది బీమా తీసుకోగా రూ.4.20 లక్షల బీమా రుసుము ఆన్లైన్ ద్వారా సమకూరింది.
ములుగురూరల్, నవంబర్ 14 : ఇప్పటి వరకు పలు సంస్థలు ప్రజలకు బీమా సౌకర్యం కల్పిస్తుండగా, తాజాగా పోస్టల్శాఖ తీసుకొచ్చిన సరికొత్త ఇన్సూరెన్స్ ప్రజలకు మరింత ప్రయోజనం కలుగనుంది. ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబానికి అండగా నిలిచే సంకల్పంతో తపాలా శాఖ అందుబాటులోకి తెచ్చింది. ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకు ద్వారా దీనిని వర్తింప చేసేందుకు శ్రీకారం చుట్టారు. పల్లెలు, పట్టణాల ప్రజలకు తపాలా బీమాపై సంబంధిత అధికారులు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రయోజనం పొందేలా నిబందనలు రూపొందించారు. పోస్టాఫీసుల్లో ప్రతి నెలా కొంత డబ్బు పొదుపు చేసేందుకు అవకాశం ఉంది. ఇటీవల సుకన్య సమృద్ధి యోజన, ప్రమాద బీమా, పీఎంజేజేబీవై, సేవింగ్స్ బ్యాంకు ఖాతా, ఏపీవైతో పాటు తదితర రంగాల్లో తీసుకొచ్చిన సామూహిక ప్రమాదబీమా వంటి పాలసీలు పేద, మధ్య తరగతి ప్రజలకు ఉపయోగపడుతున్నాయి. ములుగు జిల్లాలో ములుగుతో కలుపుకొని 6 సబ్ పోస్టాఫీసులు, 81 బ్రాంచ్ పోస్టు ఆఫీసులు ఉన్నాయి. మల్లంపల్లిలోని పోస్టాఫీస్ వరంగల్ జిల్లా నల్లబెల్లి పరిధిలోకి కొంత, ములుగులో కొంత ఉండగా ఈ పోస్టు ఆఫీస్ పరిధిలో 8 బ్రాంచ్ పోస్టాఫీసులు ఉన్నాయి. జిల్లాలో 1,100 మంది బీమా తీసుకోగా రూ.4.20 లక్షల బీమా రుసుము ఆన్లైన్లో సమకూరింది.
18 నుంచి 65 ఏండ్ల వారు అర్హులు
ఈ ప్రమాద బీమాకు 18 నుంచి 65 ఏండ్ల వారు అర్హులు. ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్, పోలీసు శాఖల్లో పనిచేసే వారితో పాటు సాహస క్రీడల్లో పాల్గొనే వారు, డ్రైవింగ్ వృత్తితో సంబంధం ఉన్న వారు ఈ పథకానికి అనర్హులు. అంతే కాకుండా ఆత్మహత్య చేసుకున్నా, నేరం, అల్లర్లు, పేలుళ్లలో చనిపోయినా, దోమకాటుతో వచ్చే వ్యాధులు, డ్రగ్స్, ఆల్కహాల్ ప్రభావంతో మరణించినా, ప్రసవ సమయంలో గర్భం వల్ల కలిగే హాని, ఎముకల వ్యాధితో మృతి చెందినా బీమా వర్తించదు.
ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి..
సామూహిక ప్రమాద బీమా పథకం ఎంతో ఉపయోగం. తక్కువ ప్రీమియంతో ఎక్కువ లబ్ధిపొందే అవకాశం ఉంది. పేద, మధ్య తరగతి వారు గ్రామ పంచాయతీల్లో పనిచేసే కార్మికులు సమీపంలోని తపాలా కార్యాలయానికి వెళ్లి ప్రీమి యం చెల్లించి బీమా పొందవచ్చు. జిల్లాలో ఇప్పటి వరకు 1,100 మంది ప్రీమి యం చేసుకోగా రూ.4.20 లక్షలు ఆన్లైన్ ద్వారా లబ్ధిదారులు చెల్లించారు. త పాలా సేవలను ప్రజలు వినియోగించుకొని కుటుంబాల్లో భరోసా కల్పించాలి.
– చింతల రామ్మూర్తి, ఐపీవో సబ్ డివిజన్- ములుగు