అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. వరంగల్ జిల్లాలో 80.70. హనుమకొండ జిల్లాలో 66.38 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా నర్సంపేటలో 87.89 శాతం, పరకాలలో 83.76, వర్ధన్నపేటలో 80.22 శాతం ఓట్లు పోలయ్యాయి. ఉదయం మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ తర్వాత ఊపందుకున్నది. కొత్త ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, బస్వరాజు సారయ్య, కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, నన్నపునేని నరేందర్, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, జిల్లా ఎన్నికల అధికారులు ఉదయమే తమ ఓటు హక్కు వినియోగించుకుని ఓటర్లలో ఉత్సాహం నింపారు. కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించగా, వెంటనే సిబ్బంది సరిచేసి పోలింగ్ను కొనసాగించారు. ఓటింగ్ సెంటర్ల వద్ద పోలీసులు 144సెక్షన్ అమలు చేశారు. పలు కేంద్రాలను వరంగల్ సీపీ అంబర్ కిశోర్ ఝా పరిశీలించి, భద్రతా అంశాలపై సిబ్బందికి సూచనలు చేశారు. ఓటింగ్ సరళిని రెండు జిల్లాల ఎన్నికల అధికారులు ప్రావీణ్య, సిక్తా పట్నాయక్ వెబ్కాస్టింగ్ ద్వారా పరిశీలించారు. పోలింగ్ అనంతరం ఈవీఎంలను పటిష్ట భద్రత నడుమ రిసెప్షన్ సెంటర్లకు తరలించారు.
వరంగల్, నవంబర్ 30(నమస్తేతెలంగాణ) : జిల్లాలో శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. చెదురు ముదురు ఘటనలు మినహా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగలేదు. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఆరంభంలో మందకోడిగా సాగిన పోలింగ్ తర్వాత ఊపందుకుంది. సాయంత్రం ఐదు గం టల వరకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడం కనబడింది. ఓటు హక్కు వినియోగించుకోవడంలో ఓటర్లు ఉత్సాహం కనబరిచారు. సా యంత్రం ఐదు గంటల్లోగా పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించిన ఓటర్లకు అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. దీంతో పలు కేంద్రాల్లో రాత్రి పొద్దుపోయేవరకు పోలింగ్ కొనసాగింది. జిల్లాలోని మూడు శాసనసభ నియోజకవర్గాల్లో 80.70 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా నర్సంపేట నియోజకవర్గంలో 87.89శాతం పోలింగ్ జరిగింది. వర్ధన్నపేటలో 80.22, తూర్పు నియోజకవర్గంలో 74 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభించారు. మొదట పోలింగ్ కేంద్రాల వద్ద అంతంత మా త్రంగా కనపడిన ఓటర్లు తర్వాత బారులు తీరారు. గ్రామీణ ప్రాంతాల్లో సాయంత్రం పోలింగ్ ముగిసే వరకు ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి క్యూలో ఉన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు, యువత పోటెత్తారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం ఎన్నికల అధికారులు వాహనాలను సమకూర్చారు. పోలింగ్ కేంద్రాల వద్ద ర్యాం పులు, ట్రైసైకిళ్లు, తాగునీరు, విద్యుత్ సరఫరా వంటి వసతులు కల్పించారు. పట్టణ ప్రాంతాల్లోని పలు పోలింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నం వరకు ఓ టర్లు లేక బోసిపోయాయి. మధ్యాహ్నం 3 గంటల తర్వాత తూర్పులోని పలు పోలింగ్ కేంద్రాలు ఓటర్లతో కిటకిటలాడాయి.
జిల్లాలో పోలింగ్ శాతం క్రమేనా పెరిగింది. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు జిల్లాలో 8.60 శాతం పోలింగ్ నమోదైంది. నర్సంపేటలో 11.5, వరంగల్తూర్పులో 5, వర్ధన్నపేటలో 9.50 శాతం పోలింగ్ జరిగింది. ఉదయం 11 గంటల వరకు పోలింగ్ శాతం 18.73కు పెరిగింది. మధ్యాహ్నం 1 గంట వరకు 37.25 శాతం పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 52.28 శాతానికి చేరింది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ శాతం 73.04 శాతం నమోదైంది. 2018 శాసనసభ ఎన్నికల్లో జిల్లాలో 73.37 శాతం పోలింగ్ నమోదైంది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పర్వతగిరిలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ వరంగల్ పెరికవాడలో తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. నల్లబెల్లిలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, వరంగల్ పెరికవాడలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, వరంగల్ మండిబజార్లో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ పడిశాల వీరభద్రయ్య బాలికల ఉన్నత పాఠశాలలో మేయర్ గుండు సుధారాణి ఓటు వేశారు. కలెక్టర్ ప్రావీణ్య హనుమకొండ రాజ్పుత్ వాడలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంత్రి ఎర్రబెల్లి రాయపర్తి మండలంలో, నర్సంపేట, వర్ధన్నపేట, వరంగల్తూర్పు నియోజకవర్గాల బీఆర్ఎస్ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, అరూరి రమేశ్, నరేందర్ తమ నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు.
ప్రతి నియోజకవర్గంలో ఎన్నికల అధికారులు ఈ సారి మహిళలు, దివ్యాంగులు, యువత కోసం ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలు ఓటర్లను విశేషంగా ఆకట్టుకున్నాయి. వీటిని సుందరంగా తీర్చిదిద్దారు. మహిళా పోలింగ్ కేంద్రాల్లో పూర్తిగా మహిళా అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తించారు. ఓటర్లకు స్వాగతం పలికేలా ఆహ్వాన బ్యానర్, ఎంట్రన్స్ నుంచి గ్రీన్ కార్పెట్ ఏర్పాటుతో పాటు బెలూన్లతో అలంకరణ, అన్ని టేబుళ్లను వస్త్రంతో కప్పి ఉంచడం, పిల్లలు ఆడుకోవడానికి ఆట బొమ్మల ఏర్పాటు, మహిళా పోలీసు సిబ్బందికి ఏకరూప దుస్తులు, ప్రత్యేకంగా ఫీడింగ్ రూం, పోలింగ్ కేంద్రంలో రంగవల్లులు, సెల్ఫీ పాయింట్, వాష్ రూం వంటివి ఏర్పాటు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి ప్రావీణ్య కొత్తవాడలోని గోల్డెన్ ఓక్ స్కూల్లో ఏర్పాటు చేసిన మహిళా పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. జిల్లాలో సమస్యాత్మకమైనవిగా గుర్తించిన 161 కేంద్రాల్లో కేంద్ర పోలీసు బలగాలు బందోబస్తు విధులు నిర్వర్తించాయి. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. సీపీ అంబర్ కిశోర్ ఝా దుగ్గొండి, వర్ధన్నపేట మండలాల్లోని వివిధ పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఏసీపీలు బోనాల కిషన్, సతీశ్బాబు, తిరుమల్, రఘుచందర్ బందోబస్తును పర్యవేక్షించారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియను వెబ్కాస్టింగ్ ద్వారా కలెక్టర్ ప్రావీణ్య, ఆర్వోలు పరిశీలించారు. పోలింగ్ ముగిసిన తర్వాత అధికారులు, సిబ్బంది ఈవీఎంలను వరంగల్ ఎనుమాములలోని వ్యవసాయ మార్కెట్, నర్సంపేట నియోజకవర్గంలోని ఈవీఎంలను నర్సంపేట వ్యవసాయ మార్కెట్ గోదాము వద్దకు చేర్చారు. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.
హనుమకొండ : వరంగల్ పశ్చిమ, పరకాల నియోజకవర్గాల్లో ఓటింగ్ ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. శాసనసభ ఎన్నికల ప్రక్రియను హనుమకొండ కలెక్టరేట్ నుంచి ఆమె పర్యవేక్షించారు. జిల్లాలో సాయంత్రం 5గంటల వరకు 63.38 శాతం పోలింగ్ జరిగిందని ఆమె చెప్పారు. పశ్చిమ నియోజకవర్గంలో ఉదయం 9గంటల వరకు 7శాతం, 11గంటల వరకు 17.23శాతం, మధ్యాహ్నం ఒంటి గంట వరకు 30.44 శాతం, మూడు గంటల వరకు 41.87 శాతం, సాయంత్రం 5గంటల వరకు 53 ఓటింగ్ శాతం నమోదైంది. పరకాల నియోజకవర్గంలో ఉదయం 9గంటల వరకు 6.74 శాతం, 11 గంటల వరకు 26.25 శాతం, మధ్యాహ్నం ఒంటి గంట వరకు 41.56 శాతం, సాయంత్రం 3గంటల వరకు 58.23 శాతం, సాయంత్రం 5గంటల వరకు 83.76శాతం ఓట్లు పోలైనట్లు తెలిపారు.
సుబేదారి/వర్ధన్నపేట, నవంబర్ 30 : వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని 1128 పోలింగ్ కేంద్రాల వద్ద 4వేల మంది పోలీసు సిబ్బంది, 1700 మంది కేంద్ర బలగాలు ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. సీపీ అంబర్ కిశోర్ ఝా హనుమకొండలోని మరజీ సూల్, దుగ్గొండి మండలం, వర్ధన్నపేట పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఈవీఎంలను తరలించే వరకు అప్రమత్తంగా ఉండాలని సీఐ శ్రీనివాస్, ఎస్సై ప్రవీణ్కుమార్కు సూచించారు.