మహబూబాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో జిల్లాలో తనిఖీలు ముమ్మరమయ్యాయి. ముఖ్యంగా రూ.50వేలకు మించి నగదు, మద్యం అక్రమ రవాణాపై అధికారులు నిఘా మరింత పెంచారు. ప్రతి వాహనాన్ని క్షణ్ణంగా తనిఖీ చేసి పంపిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన వెంటనే జిల్లాలో 10 చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. నోటిఫికేషన్ విడుదల తర్వాత వచ్చేనెల 3 నుంచి పెద్దవంగర, కురవి మండలాల్లో ఒకో చెక్పోస్టు చొప్పున ఏర్పాటు చేయనున్నారు. 2023 సాధారణ ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. పదిచోట్ల ఏర్పాటు చేసిన చెక్పోస్టుల వద్ద ప్రతి వాహనాన్ని ఆపి, తనిఖీ చేసిన అనంతరం తిరిగి పంపిస్తున్నారు. ప్రతి చెక్ పోస్ట్ వద్ద ఇద్దరు ఎస్ఐలు, ఇద్దరు ఏఎస్ఐలు, ఆర్అండ్బీ, ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖలలో ఏదైనా ఒక శాఖ నుంచి ఒక ఏఈ, నలుగురు పోలీస్ కానిస్టేబుళ్లు, ఎక్సైజ్ శాఖ నుంచి కానిస్టేబుల్, రెవెన్యూ శాఖ నుంచి అధికారి చెక్ పోస్టులో ఉంటున్నారు. కార్లు, ఆటోలు, ఆర్టీసీ బస్సులు, ద్విచక్రవాహనాలు ఇలా ప్రతి వాహనాన్ని పోలీసులు తనిఖీ చేస్తున్నారు.
వీటితోపాటు ప్రజాప్రతినిధులు, నాయకుల వాహనాలను కూడా వదిలిపెట్టడం లేదు. పది చెక్ పోస్టులు కాకుండా ఫ్లయింగ్ స్వాడ్స్, మైక్రో అబ్జర్వర్స్, ప్రత్యేక బృందాలు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. చెక్పోస్టుల వద్ద నగదుతోపాటు బెల్టు షాపుల్లో తనిఖీలు చేసి మద్యం సీజ్ చేసి, సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేస్తున్నారు. అలాగే గుడుంబా స్థావరాలపై నిఘా పెంచారు. గుడుంబా బట్టీలను ధ్వంసం చేసి, సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేస్తున్నారు. ఎస్పీ సంగ్రామ్సింగ్ జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఆకస్మిక పర్యటిస్తూ పోలీసులను అప్రమత్తం చేస్తున్నారు. అంతేకాకుండా జిల్లాలో ఏర్పాటు చేసిన చెక్పోస్టులో కూడా ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం బెల్టు షాపులపై పోలీసులు మరింత నిఘా ఏర్పాటు చేశారు. బెల్టుషాపుల్లో దొరికిన మద్యం బాటిళ్లు ఏ వైన్స్ షాపు నుంచి తెస్తున్నారో గుర్తించి సంబంధిత వైన్స్ కూడా కేసు నమోదు చేస్తున్నారు.
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో 10 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. కేసముద్రం మండలం కోరుకొండపల్లి క్రాస్ రోడ్డు వద్ద, గూడూరు మండలం భూపతిపేట వద్ద, డోర్నకల్ మండలం ములలపల్లి, డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలోని ఎస్సీ, బీసీ కాలనీలో, దంతాలపల్లి మండలం పెద్దముప్పారం క్రాస్ రోడ్డు వద్ద, సూర్యాపేట – మహబూబాబాద్ సరిహద్దుల్లో, మరిపెడ మండలం రాజీవ్ విగ్రహం వద్ద, నెల్లికుదురు మండలం నెల్లికుదురు క్రాస్ రోడ్ వద్ద, బయ్యారం మండలం నామాలపాడు వద్ద, గార్ల మండలం బంధం రోడ్డు వద్ద మొత్తం పది చెక్ పోస్టులను ఏర్పాటు చేసి 24 గంటలు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా వచ్చే నెల 3 నుంచి జిల్లాలో మరో రెండు చెక్పోస్టుల ను ఏర్పాటు చేసేందుకు ప్రాంతాలను గుర్తించారు. పెద్ద వంగర మండల కేంద్రంలో ఒకటి, కురవి మండల కేంద్రంలోని పెట్రోల్ పంపు వద్ద మరో చెక్ పోస్ట్ ఏర్పాటు చేయనున్నారు.