జెన్-జీ పేరెత్తగానే మన మనసులో వారిగురించి అనేక రకాల చిత్రాలను ఊహించుకుంటాం కదా! కానీ, ఈ మూస ధోరణికి పూర్తి భిన్నమైన కొత్త అలవాటుకు తెరతీశారు మనదేశంలోని గ్రామీణ యువతులు. ఒడిశాలోని కేంద్రపారా జిల్లా గొల్రహాట్ గ్రామానికి చెందిన యువతులు జాతీయవాదానికి ఆచరణాత్మక అర్థం చెబుతున్నారు. కళాశాల చదువులు, ఇంటి పనుల మధ్య సమయం కేటాయించుకుంటూ త్రివర్ణ పతాకాలు రూపొందిస్తున్నారు.
వేలాది జెండాలను సిద్ధం చేస్తూ, తమ శ్రమతో నిజమైన దేశభక్తిని చాటుకుంటున్నారు. ఈ గ్రామంలోని ఉత్పాదన బృందంలో 72 మంది సభ్యులు ఉండగా అందులో 25 మంది 18 నుంచి 29 ఏండ్ల వయసున్నవాళ్లే! వస్ర్తాన్ని సరైన కొలతల్లో కత్తిరించడం, కుట్టడం, అశోక చక్రాన్ని ప్రింట్ చేయడం, అదనపు దారాలను తొలగించి ప్యాకింగ్ చేయడం వరకు ప్రతి దశనూ వీరే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
‘ఉత్పత్తి కేంద్రానికి వచ్చాక నా ఫోన్ వినియోగం చాలా వరకు తగ్గింది. సోషల్మీడియాను విచ్చలవిడిగా కాకుండా మా నైపుణ్యాలను ప్రదర్శించడానికి, కస్టమర్లను సంప్రదించడానికి మాత్రమే వాడుతున్నాం’ అని చెబుతున్నది ఓ యువతి. కెమిస్ట్రీ ఆనర్స్ చదువుతున్న 18 ఏళ్ల నఫీసా నాజ్ ప్రాక్టికల్స్ పూర్తయ్యాక నేరుగా ఇకడికి వచ్చి రోజుకు 100 నుంచి 200 జెండాల తయారీలో భాగస్వామి అవుతున్నది.
జెండాల తయారీ ద్వారా ఈ యువతులు ఒక సీజన్లో రూ.8,000 వరకు సంపాదిస్తూ ఆర్థిక పురోగతి సాధిస్తున్నారు. జెండాల సీజన్ ముగియగానే పాఠశాల యూనిఫాంల తయారీకి సన్నాహాలు చేసుకుంటారు. డిజిటల్ విప్లవంలో జీవిస్తున్న ఈ తరం, ఒకవైపు సామాజిక సృ్పహను కలిగి ఉంటూనే, మరోవైపు నైపుణ్యం, ఆర్థిక స్వాతంత్య్రంతో దేశ నిర్మాణంలో నిశ్శబ్దంగా భాగస్వాములవుతున్నది. నినాదాల కన్నా నిర్మాణాత్మక పనే మిన్న అని నిరూపిస్తున్న ఈ గొల్రహాట్ యువతులు నేటి యువతకు ఒక కొత్త దిక్సూచి!