మడికొండ, జూలై 6 : ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో బీజేపీ రాజకీయ లబ్ధి కోసమే కాజీపేటలో వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. పరిశ్రమ ఏర్పాటు కోసం కేటాయించిన స్థలంలో ఉపాధి కోల్పోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని కోరారు. వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ శంకుస్థాపన కోసం ప్రధాని నరేంద్ర మోదీ నగరానికి విచ్చేస్తున్న సందర్భంగా పరిశీలనకు వచ్చిన రైల్వే జీఎం అరుణ్కుమార్ జైన్ను గురువారం ఎమ్మెల్యే అరూరి రమేశ్ మర్యాద పూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏపీ విభజన చట్టం ప్రకారం కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాల్సిందేనన్నారు. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు ప్రకటన చేసి, వెనక్కి తీసుకున్న ప్రధాని మోదీ పర్యటనను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలపై కేంద్ర ప్రభుత్వం కక్ష్య పూరిత ధోరణి అవలంభిస్తున్నదని విమర్శించారు. వ్యాగన్ ఫ్యాక్టరీ కోసం భూములు కోల్పోయిన స్థానిక రైతులతో పాటు స్థానిక యువతకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని, అన్ని సదుపాయాలు కలిగిన కాజీపేటను రైల్వే డివిజన్గా ఏర్పాటు చేయాలని రైల్వే జీఎంను ఎమ్మెల్యే కోరారు. దీనికి స్పందించిన జీఎం రైల్వే బోర్డు నిబంధనలను అనుసరించే నియామకాలు చేపడుతామని తెలిపారు.
పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
నియోజకవర్గంలోని విలీన గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే అరూరి రమేశ్ తెలిపారు. గ్రేటర్ 45వ డివిజన్ పరిధి కడిపికొండలో రూ.50లక్షలతో ఏర్పాటు చేసిన శ్మశానవాటికను ఆయన ప్రారంభించారు. అలాగే, రూ.93.55లక్షలు, రాంపేటలో 19.75లక్షలు, తరాలపల్లిలో 42.53లక్షలతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డివిజన్ పరిధిలో ఇప్పటివరకు రూ.125కోట్లతో అభివృద్ధి పనులు చేసినట్లు గుర్తు చేశారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వర్రావు, పీఏసీఎస్ చైర్మన్ ఊకంటి వనంరెడ్డి, డివిజన్ అధ్యక్షుడు రమేష్, మాజీ కార్పొరేటర్ బసె శ్రీలేఖ, నాయకులు కృష్ణ, కర్ర హరీశ్రెడ్డి, అరూరి రంజిత్కుమార్ పాల్గొన్నారు.