కేసముద్రం/శాయంపేట, డిసెంబర్ 16 ;లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పండించిన పంటలు చేతికందకుండా పోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు, వాతావరణ మార్పుల కారణంగా పంటలపై చీడపీడలు ఉధృతంగా దాడి చేస్తుండడంతో చేసేదేం లేక చేతులెత్తేస్తున్నారు. చేతికొచ్చిన పత్తి, మరోవైపు మక్క, మిరప పంటలకు వివిధ తెగుళ్లు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తున్నా అధికారులు కన్నెత్తి చూడడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నివారణకు వివిధ పురుగుమందులు వాడినా ఫలితం కనిపించడం లేదని వాపోతున్నారు. ఈ సారి దిగుబడులు పడిపోయి తమకు అప్పులే మిగిలేలా ఉన్నాయని, ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
చేతికొచ్చే సమయంలో పత్తిపంటను చీడపీడలు ఆశిస్తుండడం, మరోవైపు మక్క, మిరపకు కత్తెర, వేరుకుళ్లు, ఎర్రనల్లి తీవ్ర నష్టం కలిగిస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వాతావరణ ప్రభావంతో మూడు పంటలపైనా చీడపీడలు దాడి చేస్తుండగా నివారణ చర్యలు తీసుకున్నా ఫలితం లేదని వాపోతున్నారు .
మక్కకు ‘కత్తెర’
మక్క పంటకు కత్తెర పురుగు తీవ్ర నష్టం కలిగిస్తున్నది. ఎండాకాలంలో 30 రోజులు జీవించే ఈ కీటకం, చలికాలంలో 3 నెలల పాటు బతికి ఉంటుంది. ఒక్కో ఆడ పురుగు 1500 నుంచి రెండు వేల దాక గుడ్లు పెడుతూ సంతతిని వేగంగా విస్తరింపజేస్తుంది. సరైన సస్య రక్షణ చర్యలు తీసుకుంటే పురుగును అరికట్టవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పంట విత్తిన వెంటనే ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలను అమర్చి పురుగు ఉనికిని గమనించాలని, చేను నలుమూలలా పరిశీలించి పురుగు ఆశించిన మొక్కలను గుర్తించాలని, ఆలస్యంగా సాగు చేసిన మక్కను పురుగు ఎక్కువగా ఆశిస్తుందని చెబుతున్నారు. కేసముద్రం మండల వ్యవసాయాధికారి వెంకన్న మాట్లాడుతూ పంట సాగు చేసిన నెల లోపు మెటారైజియం ఎన్తెసోప్లియో 5 గ్రాములను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేస్తే లార్వా దశను నివారించవచ్చుని సూచించారు. ఇన్ఆక్సీకార్బో, ల్యాండాసైలిత్రిన్, స్పైయినోసైడ్, మిథాక్సీస్పైనోజెడ్ వంటి వాటిని పిచికారీ చేయాలన్నారు. గ్రాము లార్విన్ను లీటర్ నీటిలో నీమ్ అయిల్ను కలిపి పిచికారీ చేస్తే ఫలితం ఉంటుందన్నారు.
పత్తిపై గులాబీ రంగు పురుగు దాడి
ఇటీవలి వర్షాల కారణంగా పత్తికి తెగుళ్లు ఆశించాయి. గులాబీ రంగు పురుగు తీవ్రంగా దాడి చేస్తున్నది. ఈ క్రమంలో దిగుబడి లేక రైతులు దిగులు చెందుతున్నారు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులు, ప్రస్తుతం పత్తిని ఏరుతున్నారు. ఎకరాకు రూ.25వేలకుపైగా పెట్టుబడి పెట్టారు. కొందరు రైతులు ఇంకా క్రాప్ ఏరలేదు. గులాబీ పురుగు కాయలోనికి ప్రవేశించి దూదిపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో కాయ నల్లబడి ఖాళీ గుల్ల అవుతోంది. కొందరు రైతులు పలు మార్లు పత్తి ఏరినా పురుగు ఆశించిన పంటను ఏరేందుకు సాహసించడం లేదు. ఎకరాకు 20 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని ఆశిస్తే చీడపీడలతో తీవ్ర నష్టం వస్తోందని ఆవేదన చెందుతున్నారు. నివారణ కోసం పురుగు మందులు కొట్టినా ఫలితం లేదని మానేశామని చెబుతున్నారు.వ్యవసాయ అధికారులు అందుబాటులో లేకపోవడంతో చీడపీడల నివారణ చర్యలు చేపట్టడం లేదని అంటున్నారు. ఎకరం విస్తీర్ణంలో కనీసం ఐదారు క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు. ఈక్రమంలో ముందుగానే గులాబీ రంగు పురుగును గుర్తించి లింగాకర్షక బుట్టలతో నివారణ చర్యలు తీసుకుంటే బాగుండేదని అధికారులు సూచిస్తున్నారు.
వేరుకుళ్లు, ఎర్రనల్లితో మిర్చికి దెబ్బ
వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి చేతికొచ్చే సమయంలో మిరిపపై వేరుకుళ్లు, ఎర్రనల్లి దాడి చేసి తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. ఇటీవలి వర్షాలు, వాతావరణ మార్పుల కారణంగా తెగుళ్లు సోకి మిరప పంట దెబ్బతింటున్నది. శాయంపేట మండలంలోని నర్సింహులపల్లి, గట్లకానిపర్తి గ్రామాల పరిధి మిర్చి రైతులు తెగుళ్లతో ఆగమవుతున్నారు. నివారణ మార్గాలు చూపాల్సిన వ్యవసాయ అధికారులు అందుబాటులో లేరని ఆందోళన చెందుతున్నారు. పురుగు మందులు పిచికారీ చేసినా ప్రయోజనం లేదని చెబుతున్నారు. ఎకరా మిర్చి పంటకు రూ.2లక్షల వరకు ఖర్చుచేసినట్లు నర్సింహులపల్లి రైతు కే నాగరాజు తెలిపారు. దిగుబడి వచ్చే సమయంలో ఎర్రనల్లి దాడి చేయడంతో పంట ఎదుగుదల ఆగిపోయింది. వేరుకుళ్లు సోకి పంట సాళ్లు చనిపోయాయి. మిర్చిపై నల్లి, ముడత పోయేందుకు, పంట ఎదిగేందుకు పురుగు మందు కొట్టినా ప్రయోజనం లేదని రైతులు వాపోతున్నారు.