వరంగల్ : ఉచితాలు వద్దని చెబుతున్న బీజేపీ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సంగెం మండల కేంద్రంలో నూతన ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు పింఛన్ రూ.75 ఉండేదని, ఎవరైనా చనిపోతేనే తప్ప వారి స్థానంలో నాడు కొత్తవి ఇచ్చేవి కావు అన్నారు. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 200 చేసింది. కానీ ఒంటరి మహిళలకు, చేనేత, గౌడ వృత్తిదారులకు పింఛన్లు ఇవ్వలేదన్నారు.
నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఏకంగా పదింతలు పెంచి పింఛన్ రూ.2016 అందిస్తున్నారని తెలిపారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇస్తామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కన్న కొడుకు బతుకమ్మ పండుగకు చీర కొనిచ్చిన ఇవ్వకపోయినా పెద్ద కొడుకు సీఎం కేసీఆర్ చీర ఇస్తున్నారు.
ఆడబిడ్డ పెండ్లికి కల్యాణ లక్ష్మి ఇస్తున్నరు. కుల,మతాలతో సంబంధం లేకుండా పేదలందరికీ భరోసా ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. కరోనా వల్ల కొంత ఇబ్బంది ఉండేదని, అయినా పేదలను కడుపులో పెట్టుకొని కేసీఆర్ చూసుకున్నాడని అన్నారు.