వర్ధన్నపేట, మార్చి 14 : నిరుపేద వృద్ధురాళ్లకు మరింత చేయూనిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. వృద్ధాప్య పింఛన్ తీసుకుంటున్న భర్త మృతి చెందితే అతడి భార్యకు వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో డీఆర్డీఏ అధికారులు గ్రామాల వారీగా వివరాలు సేకరిస్తూ అర్హులైన వారిని గుర్తిస్తున్నారు. ప్రధానంగా పింఛన్దారులు మృతి చెందితే వారి భార్యలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. అంతేకాక తమకు పెన్షన్ మంజూరు చేయాలని అధికారుల చుట్టూ తిరుగుతూ అనేక అవస్థలు పడుతున్నారు. వీటిని గుర్తించిన సర్కారు భర్త మృతిచెందిన వృద్ధురాలికి వెంటనే పింఛన్ మంజూరు చేయాలని అధికారులను ఆదేశించగా, జిల్లాలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి క్లియర్ చేస్తున్నారు.
జిల్లాలోని 13 మండలాలు, 2 మున్సిపాలిటీలు, వరంగల్ నగర పరిధిలోని 1,27,059 మందికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా ఆస రా పింఛన్లను అందిస్తున్నది. ఆసరా పథకం ద్వారా వృ ద్ధులకు రూ. 2,016, దివ్యాంగులకు రూ.3,016 చొప్పున మొత్తం రూ.28కోట్ల 83లక్షల 58వేల 408 పంపిణీ చేస్తున్నది. ఇందులో 48,817 మంది వృద్ధు లు, 47,779 మంది వితంతువులు, 16,184 మంది దివ్యాంగులు, 2,997 మంది కల్లుగీత కార్మికులు, 2,339 మంది చేనేత కార్మికులు, 5,718 మంది బీడీకార్మికులు, 3,225 మంది ఒంటరి మహిళలు ఉన్నా రు. అలాగే, ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్న వారు మృతిచెందితే వారి భార్యలకు వెంటనే పింఛన్ అందించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.
మార్గదర్శకాలు జారీ..
ఆసరా పింఛన్ పొందుతున్న వృద్ధుడు మృతి చెందితే అతడి భార్యకు పెన్షన్ మంజూరు చేయాలని ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. భర్త డెత్ సర్టిఫికెట్, వృద్ధురాలి ఆధార్కార్డు, ఫొటోను జత చేసి జీపీ కార్యదర్శికి, మున్సిపాలిటీలో అయితే బిల్ కలెక్టర్కు దరఖాస్తు అందించాల్సి ఉంటుంది. అధికారులు మండల పరిషత్ కార్యాలయంలో ఆన్లైన్ చేయించి, 15 రోజుల్లో దరఖాస్తు చేసుకున్న వారికి పింఛన్ మంజూరు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కాగా, ఇప్పటికే దరఖాస్తు చేసుకొన్న వారి వివరాలను జిల్లా అధికారులు పరిశీలిస్తున్నారు. అర్హులకు పింఛన్లను కూడా అందజేస్తున్నారు. దీంతో నిరుపేద వృద్ధురాళ్లు సంతోషం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
అర్హులందరికీ పింఛన్లు..
ఆసరా పింఛన్ పొందుతున్న వృద్ధుడు మృతి చెందితే అతడి భార్యకు వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు జిల్లాలో మండలాల వారీగా దరఖాస్తులను పరిశీలిస్తున్నాం. పింఛన్ పొందుతున్న వృద్ధుడు మృతిచెందితే అతడి భార్య వృద్ధుడి డెత్ సర్టిఫికెట్, ఆధార్కార్డు, పాస్ ఫొటోతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులను మండల పరిషత్ కార్యాలయంలో ఆన్లైన్ చేయించి అర్హులకు ఆసరా పింఛన్లు మంజూరు చేస్తాం. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
– పరమాత్మ, పింఛన్ విభాగం జిల్లా అసిస్టెంట్ ప్రాజెక్టు అధికారి