నాడు బూజుపట్టి పెచ్చులూడుతున్న గదుల్లో.. పాడుబడిన గోడల నడుమ పగిలిన బండలపై కూర్చొని చుట్టూ అలుముకున్న చీకట్లలో విద్యాభ్యాసమంటేనే పిల్లల్లో అనాసక్తి ఉండేది. నేడు ‘మన ఊరు-మన బడి’తో కార్పొరేట్ను తలదన్నేలా మారిన స్కూళ్లలో విద్యాభ్యాసం పూర్తిచేసుకుంటున్న విద్యార్థులు, ఆ పాఠశాలపై మమకారాన్ని పెంచుకొని బడిని వీడి వెళ్లలేక బాధ పడుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. జయశంకర్ జిల్లా పెద్దాపూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి పూర్తయిన విద్యార్థులు, తమ పాఠశాలను వీడి వెళ్లాలంటే బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ను ప్రభుత్వం ఎంతో బాగు చేసిందని, డ్యుయల్ డెస్కులపై కూర్చొని, గ్రీన్ చాక్ బోర్డుపై టీచర్లు పాఠాలు చెబుతుంటే వినేవాళ్లమని, మనసుకు ఎంతో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తున్న ఈ స్కూల్కు ఇక రాలేము అని తలుచుకుంటేనే ఏదో వెలితి ఉందని చెబుతున్నారు.
జయశంకర్ భూపాలపల్లి, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ) : నాడు పాడుబడిన తరగతి గదుల్లో కింద కూర్చుని చుట్టూ అలుముకున్న చీకట్ల నడుమ విద్యాభ్యాసంపై విద్యార్థులు ఏమాత్రం ఆసక్తి చూపకపోయేవారు. ఇక సరైన మరుగుదొడ్లు, మూత్రశాలలు లేక నానా తిప్పలు పడేవారు. పాడుబడిన గోడలు, పైకప్పు ఎప్పుడు కూలిపోతుందోననే భయంతో బిక్కుబిక్కుమనేవారు. ఇన్ని అవస్థలు పడుతూనే బడికి వచ్చేవారు. ఇలా జయశంకర్ జిల్లా పెద్దాపూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులూ ఇబ్బంది పడ్డారు. స్వరాష్ట్రంలో సర్కారు పాఠశాలల అభివృద్ధిపై దృష్టి పెట్టిన సీఎం కేసీఆర్, ‘మన ఊరు-మన బడి’ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించారు. సకల సౌకర్యాలతో స్కూళ్లను కార్పొరేట్ పాఠశాలల తరహాలో తీర్చిదిద్దుతున్నారు. ఇందులో భాగంగానే పెద్దాపూర్ ఎంపీపీఎస్కు నిధులు కేటాయించడంతో నూతన తరగతి గదులు నిర్మించారు. కొన్ని గదులకు మరమ్మతులు చేశారు.
రూ. 64.87 లక్షలతో పనులు
పెద్దాపూర్ ఎంపీపీఎస్కు రాష్ట్ర ప్రభుత్వం రూ.64,87,500 కేటాయించగా రూ.11లక్షలతో మూడు మరుగుదొడ్లు నిర్మించారు. రూ.3.50 లక్షలతో కిచెన్ షెడ్, రూ.19.60 లక్షలతో ప్రహరీ, రూ.16.56 లక్షలతో సంపు, సింటెక్స్ ట్యాంకులు ఏర్పాటు చేశారు. నల్లాల బిగింపు పనులు చేపట్టారు. వీటితో పాటు తలుపులు, కిటికీలు రిపేర్ చేసి, స్లాబ్పై ఫ్లోరింగ్ వేయించారు. ఆవరణలో గ్రౌండ్ లెవలింగ్, స్టేజీ నిర్మాణం, గార్డెనింగ్ పనులు పూర్తి చేశారు. రూ.81,500తో ఐదు గ్రీన్ చాక్బోర్డులు ఏర్పాటు చేశారు. రూ.9.80 లక్షలతో 66 డ్యుయల్ డెస్కులు సమకూర్చాల్సి ఉండగా, 40 డెస్కులు పాఠశాలకు వచ్చాయి. రూ.3.50 లక్షలతో పాఠశాలకు రంగులు వేయించారు. రూ.10వేలతో లైబ్రరీ ర్యాక్ను కొనుగోలు చేశారు. వీటికి తోడు ఓ స్వచ్ఛంద సంస్థ లైబ్రరీకి 240 పుస్తకాలు సమకూర్చింది. సర్కారు బడిలో కార్పొరేట్ స్థాయి వసతులు కల్పించడంతో విద్యార్థులు ఈ పాఠశాలపై మరింత మమకారం పెంచుకున్నారు.
బడి విడిచి వెళ్లలేక..
ఇక్కడ ఐదో తరగతి వరకే ఉండగా, ఈ సంవత్సరం ఐదో తరగతి పూర్తి చేసుకుంటున్న విద్యార్థులు బడిని విడిచి వెళ్లలేక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ను విడిచి వెళ్లాలంటే బాధగా ఉందని పేర్కొంటున్నారు. ప్రభుత్వం తమ పాఠశాలను చాలా బాగు చేసిందని, ఇక్కడికి రోజూ రావాలనిపించేలా బడిని మార్చిందని చెబుతున్నారు. పాఠశాలను ఎంతో ఆహ్లాదకరంగా మార్చారని, అందుకే ఈ పాఠశాలను విడిచి వెళ్లాలనిపించడం లేదని వాపోతున్నారు.
విడిచి వెళ్లాలంటే బాధగా ఉంది
నేను ఇక్కడ 5వ తరగతి చదువుతున్న. ఈ సంవత్సరం పూర్తవుతది. ఇంతకుముందు బడిలో సరైన వసతులు లేకపోయేవి. టాయిలెట్లు మంచిగ లేక ఇబ్బంది పడ్డం. అప్పట్ల ఇక్కడ మొక్కలు పెడితే గొర్లు, మేకలు వచ్చి మేసేవి. తరగతి గదిల మొత్తం చీకటి ఉండేది. కింద కూర్చునేటోళ్లం. ఇప్పుడు అన్నీ మంచిగ చేసిన్రు. నల్లాలు పెట్టిన్రు. ఫ్యాన్లు, ట్యూబ్లైట్లు ఫిట్ చేసిన్రు. మంచి బెంచీలు వేసిన్రు. రోజూ స్కూల్కు రావాలనిపిస్తది. ఇప్పుడు ఇక్కడ చదువు అయిపోతాంది. స్కూల్ను వదిలిపోవాలంటే బాధగా ఉంది.
– ముత్యాల గగనప్రియ, 5వ తరగతి విద్యార్థిని
సకల వసతులు కల్పించాం
సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడిన పెద్దాపూర్ పాఠశాలను తెలంగాణ ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేశాం. గతంలో విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు, మూత్రశాలలు లేక ఇబ్బంది పడేవారు. బాలికలు పాఠశాల నుంచి బయటికి వెళ్లి వచ్చేవారు. ప్రహరీ లేక పశువులు ఆవరణలో తిరిగేవి. రాత్రి వేళ తరగతి గదుల్లో అసాంఘిక కార్యక్రమాలు జరిగేవి. ప్రహరీ, మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్మాణంతో బాలికల అవస్థలు తీరాయి. కార్పొరేట్ స్థాయిలో విద్యార్థులకు డ్యుయల్ డెస్కులు ఏర్పాటు చేశాం. ఇన్ని వసతులున్న పాఠశాలకు ఇప్పుడు విద్యార్థులు ఆనందంగా వస్తున్నారు.
– దూలం కుమారస్వామి, హెచ్ఎం