ప్రస్తుతం పచ్చి, పండు మిర్చికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దీంతో ఇటు పంట సాగు చేసిన రైతులకు సిరులు కురిపిస్తుండగా, కూలీలకూ చేతినిండా పనిదొరుకుతోంది. ఒకప్పుడు పెట్టుబడికి ఇబ్బంది పడే పరిస్థితి ఉండగా ప్రస్తుతం ఆశించిన దిగుబడి వస్తుండడంతో ఇతర ప్రాంతాలకు సైతం ఎగుమతి అవుతోంది. క్వింటాల్కు రూ.3వేల ధర పలుకుతుండడంతో మిర్చి రైతుల్లో సంతోషం కనిపిస్తోంది.
పచ్చి, పండు మిర్చి అమ్మడం వల్ల కొంత మేర పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది. పచ్చిమిర్చి అమ్మడం మాకు లాభసాటిగా ఉంది. లావుగా కాసిన పచ్చిమిర్చికి మార్కెట్లో ధర బాగానే పలుకుతోంది. పచ్చి మిర్చి, పండు మిర్చి అమ్మకాల వల్ల మాతో పాటు కూలీలకు సైతం చేతినిండా పనిదొరుకుతోంది.
ములుగు జిల్లా వాజేడు మండలంలోని పలు గ్రామాల్లో రైతులు ఎక్కువగా మిర్చి సాగుచేశారు. ఇందులో 341, ఇండికా, వండర్హాట్ తదితర రకాల పచ్చిమిర్చి, పండు మిర్చి ఉన్నాయి. ఇందులో కాతకు వచ్చిన పచ్చి మిర్చి, పండు మిర్చికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. బయట మార్కెట్కు ఎగుమతులు చేస్తూ ఆశించిన లాభాలు గడిస్తున్నారు. మిర్చి సాగుకు ఎకరాకు రూ.2లక్షలపైనే ఖర్చు అవుతుండగా గతంలో రైతులు పెట్టుబడులకు ఇబ్బంది పడేవారు. కానీ ఇప్పుడు మిర్చి పంట వేసిన మూడు నెలల్లో పచ్చి మిర్చి కోతకు సిద్ధంగా ఉండడంతో రైతులు కూలీల సహాయంతో పచ్చి మిర్చిని కోయించి వాటిని ప్రత్యేకంగా గ్రేడింగ్ చేయించి తూకం వేసి సంచుల్లో నింపి అమ్ముతున్నారు. క్వింటా పచ్చి మిర్చికి మార్కెట్లో రూ.2800, పండు మిర్చి రూ.3వేల వరకు ధర పలుకుతోంది. దీంతో చిన్న, సన్నకారు రైతులు పచ్చిమిర్చిని చేను వద్దకు వచ్చే వ్యాపారులకు విక్రయించి పంటను సాగుచేసుకుంటున్నారు. దీని వల్ల తమకు బయట పెట్టుబడి తెచ్చే బాధ కొంత మేర తగ్గిందని చెబుతున్నారు. అమ్మిన మిర్చి డబ్బులతో పంటకు పెట్టుబడి సొంతంగా పెట్టుకుంటున్నామని రైతులు పేర్కొంటున్నారు. ఏదేమైనా పచ్చి మిర్చి, పండు మిర్చి అమ్మకాల వల్ల రైతులకు చేతికి నగదు అందుతుండడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మండలంలో మిర్చి సాగుచేస్తున్న రైతుల వద్దకు బయట నుంచి వ్యాపారులు వచ్చి మిర్చి కొనుగోలు చేసి హైదరాబాద్, వరంగల్, నర్సంపేటతో పాటు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. పచ్చి, పండు మిర్చికోతలు కోసే కూలీలకు సైతం చేతినిండా పని దొరుకుతుండడంతో వారు సైతం సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
పచ్చిమిర్చి కోతల వల్ల మాకు చేతినిండా పనిదొరుకుతాంది. రోజు కూలీ రూ.300 వరకు వస్తున్నయి. వరి కోతలు అయిపోయిన తర్వాత మాకు పచ్చిమిర్చి కోతలు మొదలవుతున్నయి. దీని వల్ల ఆడుతూపాడుతూ పనులకు పోతున్నం.