నల్లబెల్లి, జూన్ 15: గోదావరి జలాలతో నర్సంపేట సస్యశ్యామలం అవుతున్నదని, పల్లెప్రగతి కార్యక్రమంతో నేడు గ్రామాలు సర్వతోముఖాభివృద్ధి చెందాయని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మండలంలోని అన్ని గ్రామాల్లో గురువారం పల్లెప్రగతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా రుద్రగూడెంలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే పెద్ది పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలో కోలాటాలు, డప్పుచప్పుళ్ల మధ్య పల్లెప్రకృతి వనం వరకు ప్రగతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యానికి గురైన పల్లెలను సీఎం కేసీఆర్ పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా అద్ధంలా మారుస్తున్నారని కొయాడారు. నాడు తాగేందుకు గుక్కెడు నీరు కరువైన నియోజకవర్గ ప్రజలు నానా అవస్థలు పడ్డారన్నారు. గత ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్ని అడ్డంకులు ఎదురైనా పాకాల, మాదన్నపేట, రంగాయ చెరువుల్లోకి గోదావరి జలాలను తరలించి, నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని పల్లెలు ఓడీఎఫ్ ప్లస్ గ్రామాలుగా మారినట్లు చెప్పారు. గ్రామాల సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని అమలు చేసిందన్నారు.
గ్రామాల పురోభివృద్ధికి బాటలు
ప్రతి గ్రామ పంచాయతీకి కార్యదర్శిని నియమించి గ్రామాల పురోభివృద్ధికి బాటలు వేసినట్లు ఎమ్మెల్యే పెద్ది వివరించారు. ప్రతి జీపీకి డంపింగ్యార్డు, వైకుంఠధామం, పల్లెప్రకృతి వనం, నర్సరీలు, వందశాతం గ్రామాల్లో సీసీరోడ్ల నిర్మాణం, డ్రైనేజీలను శుభ్రపర్చడం, గ్రామాల సుందరీకరణ, సబ్స్టేషన్ల నిర్మాణం, తారురోడ్ల ఏర్పాటు, ఇంటింటికీ మిషన్ భగీరథ నీరు, విద్యుత్ సమస్య తలెత్తకుండా సబ్స్టేషన్ల నిర్మాణం, పల్లెదవాఖానలు, మన ఊరు-మనబడి కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో నూతన భవన నిర్మాణాలు, మౌలిక వసతుల కల్పన, మహిళా అభ్యున్నతికి ప్రతి గ్రామంలో వీవో భవన నిర్మాణం, రూ. 13.80 కోట్ల వ్యయంతో జీపీ భవన నిర్మాణాలు, ఆసరా పింఛన్లు, నిరుపేద ఆడబిడ్డల పెళ్లిళ్లకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా రూ. 1,00,116 ఆర్థిక సాయంతోపాటు 24 గంటల విద్యుత్, ముదిరాజ్ల అభ్యున్నతికి సొసైటీలను ఏర్పాటు చేసి ఉచితంగా చేపపిల్లలు, ద్విచక్ర వాహనాలు, ఫోర్వీలర్స్ పంపిణీ, కులవృత్తుల కుటుంబాలకి రూ. లక్ష సాయం, ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నియోజకవర్గంలో 2022-23లో 5500 మంది మహిళలు, 2023-24లో 8500 మంది మహిళా క్రీడాకారులకు క్రీడా పోటీలు నిర్వహించి మహిళా సాధికారతకు కృషి చేసినట్లు వివరించారు.
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమంతో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలుపుతున్న సీఎం కేసీఆర్ కృషి ప్రశంసనీయమన్నారు. దశాబ్ది ఉత్సావాల విజయవంతానికి ముందుకొస్తున్న ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ ఫ్లోర్లీడర్ పెద్ది స్వప్న, ఎంపీపీ ఊడుగుల సునీత, తహసీల్దార్ దూలం మంజుల, ఎంపీడీవో విజయ్కుమార్, ఎంపీవో కూచన ప్రకాశ్, రూరల్ సీఐ సూర్యప్రసాద్, వైస్ ఎంపీపీ గందె శ్రీలత, పీఏసీఎస్ చైర్మన్ మురళీధర్రావు, బీఆర్ఎస్ మండల కన్వీనర్ ఊడుగుల ప్రవీణ్గౌడ్, నాయకులు, కక్కెర్ల శ్రీనివాస్గౌడ్, గందె శ్రీనివాస్గుప్తా, ఎస్సై నైనాల నగేశ్తోపాటు అధికారులు, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.