ముంబై: ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా మరణించారు. ఆ ఇంటి గదిలో ఒక సూసైడ్ నోట్ను పోలీసులు గుర్తించారు. దీంతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. (Pune Family Suicide) మహారాష్ట్రలోని పూణె జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పింప్రి ప్రాంతంలోని అద్దె ఇంట్లో నివసిస్తున్న 50 ఏళ్ల వినోద్ పిళ్లై, ఐఐఎం అహ్మదాబాద్లో కంప్యూటర్ సైన్స్ చదివాడు. ఆయన భార్య 45 ఏళ్ల సిర్జా ఒక స్కూల్లో కోఆర్డినేటర్గా పనిచేస్తున్నది. వారికి 19 ఏళ్ల కుమార్తె పూర్ణిమ ఉన్నది.
కాగా, శనివారం సిర్జా విధులకు హాజరుకాకపోవడం ఆమెను సంప్రదించేందుకు సహోద్యోగులు ప్రయత్నించారు. మొబైల్ కాల్స్కు స్పందించకపోవడంతో ఆమె బంధువులకు సమాచారం ఇచ్చారు. వారు ఆ ఇంటికి వెళ్లి చూడగా వినోద్, అతడి భార్య, కుమార్తె అచేతనంగా పడి ఉన్నారు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. ఘటనా స్థలంలో ఒక సూసైడ్ నోట్తో పాటు సోడియం నైట్రేట్ ఉన్న డబ్బాను స్వాధీనం చేసుకున్నారు. ఆ ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్య సహాయం అందకముందే వినోద్ మరణించాడు. ఆయన భార్య సిర్జా, కుమార్తె పూర్ణిమకు ఐసీయూలో చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. కొద్దిసేపటికే వారిద్దరు కూడా చనిపోయారు.
కాగా, వినోద్ ఆన్లైన్లో సోడియం నైట్రేట్ ఆర్డర్ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆ రసాయనాన్ని మండించడం వల్ల వెలువడిన పొగ వల్ల ఆ కుటుంబంలోని ముగ్గురూ ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. కుటుంబ ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఈ చర్యకు పాల్పడినట్లు, దీనికి మరెవరినీ బాధ్యులను చేయవద్దని వినోద్ ఆ లేఖలో రాసినట్లు పోలీసులు తెలిపారు.
అయితే ఆ కుటుంబం కొంతకాలంగా భారీ అప్పులతో సతమతమవుతున్నట్లు దర్యాప్తులో తెసిందని పోలీస్ అధికారి చెప్పారు. మూడేళ్ల క్రితం నెహ్రూ నగర్లోని తమ ఇంటిని అమ్ముకున్నారని, ఆ తర్వాత నుంచి మోర్వాడి ప్రాంతంలోని అద్దె ఇంటిలో నివసిస్తున్నట్లు స్థానికుల ద్వారా తెలిసిందన్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.