జనగామ, జనవరి 3 (నమస్తే తెలంగాణ) : ‘ఊసరవెల్లిలా రంగులు మార్చి.. పొద్దుతిరుగుడు పువ్వులా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరి రాజకీయ పబ్బం గడుపుకొనే కడియం శ్రీహరి, నీకు గోరీ కడతం.. జాగ్రత్త బిడ్డా.. సిగ్గుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయ్’ అని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యేపై ఫైర్ అయ్యారు. శుక్రవారం సాయంత్రం జనగామలోని క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెకులను పంపిణీ చేశారు. అనంతరం పల్లా మాట్లాడుతూ కడియం శ్రీహరి పదవి పిచ్చోడు.. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వెళ్తడు.. ఆయన బిడ్డకు ఎంపీ టికెట్ ఇస్తే పైసలతో సహా వెళ్లి మోసం చేసిండు.. గులాబీ జెండా కింద గెలిచిన నీకు ఏ మాత్రం సిగ్గు, శరం ఉన్నా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
కడియం శ్రీహరిని నాయకులు, ప్రజలంతా కష్టపడి గెలిపిస్తే ఊసరవెల్లి సిగ్గుపడేలా అధికారం ఎటు ఉంటే అటు పొద్దుతిరుగుడు పువ్వులా తిరుగుతూ కేసీఆర్, కేటీఆర్, కవితపై ఇష్టం వచ్చినట్లు అవాకులు, చెవాకులు కూస్తున్నాడని మండిపడ్డారు. రాజీనామా చేసి మళ్లీ గెలవాలని.. శ్రీహరికి రెండు సార్లు అవకాశం ఇచ్చింది కేసీఆర్ కదా? నీ బిడ్డకు ఎంపీ టికెట్ ఇస్తే పైసలతో వెళ్లి మోసం చేసింది నువ్వు కాదా? అని ప్రశ్నించారు. స్టేషన్ ఘన్పూర్లో ఉప ఎన్నిక వస్తది.. నిన్న పాతర పెట్టడం ఖాయమని పేర్కొన్నారు.
గతంలో నియోజకవర్గానికి ఏ పనులు చేయకుండా అడ్డుకున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. పదే పదే 40ఏళ్ల రాజకీయం అని చెప్పే కడియం శ్రీహరి.. ఒక డిగ్రీ కాలేజీ అయినా తెచ్చావా? నేను తీసుకొచ్చిన ఎత్తిపోతలకు కొబ్బరికాయ కొడ్తావా..? సిగ్గు, శరం ఉండాలి.. రాజీనామా చేసి గెలిచి అవసరముంటే అప్పుడు కొట్టు’ అని పల్లా సవాల్ చేశారు. కేసీఆర్ మీద మాట్లాడే మొనగాడివి కాదు నువ్వు.. మా ప్రజల దయాదాక్షిణ్యాలు, పార్టీ జెండా కింద గెలిచావ్.. మా నాయకుల దగ్గర నుంచి టికెట్లు పొందా వు.. పదవులు పొందావ్.. అధికారం అనుభవించావ్.. అని మండిపడ్డారు. ఇవ్వాల నీతులు మాట్లాడితే జాగ్ర త్త బిడ్డా.. రాజకీయంగా చివరి దశకు వచ్చావు.. జాగ్రత్త అని ఎమ్మెల్యే పల్లా హెచ్చరించారు. జనగామ, స్టేషన్ఘన్పూర్ ప్రజలంతా నీలాంటి ఊసరవెళ్లులకు గోరి కడతారు ఖబడ్దార్.. ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయని మీటింగులు పెడుతున్నావ్.. ఏం చేశావని నీ సమావేశాలు.. ప్రజలు మిమ్మల్ని పాతర పెట్టడం ఖాయమన్నారు.
ఏడాది కాలంలో దాదాపు వెయ్యికి పైగా సీఎంఆర్ఎఫ్ చెకులను అందించానని, కల్యాణలక్ష్మి చెకుల విషయంలో ఏ ఒకరోజు ఆలస్యం కాకుండా ప్రభుత్వం ద్వారా అందించామని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి చెప్పారు. కొంతమంది రాజకీయంగా కేసీఆర్ పెట్టిన భిక్షతో ఎన్నికైన వారు కారు కూతలు కూస్తున్నారని అలాంటి వారిని ఎక్కడికక్కడ ఎండగట్టాలని కార్యకర్తలు, నాయకులకు ఎమ్మెల్యే పల్లా పిలుపునిచ్చారు. జనగామ జిల్లా మొదటినుంచీ ఉద్యమాలకు ఊతంగా ఉన్నదని, ఉద్యమాల్లో పాల్గొన్న వారినే ఎకువగా గెలిపించిందన్నారు. ఏడాది కాలంగా నాయకులు, కార్యకర్తలు ఏ విధంగా కష్టపడి పనిచేశారో అలాగే ప్రజలకు అండగా ఉండాలని కోరారు.