ప్రతిపక్ష నాయకులు పనిలేక రాష్ట్ర ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నారని రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. ధర్మసాగర్లో స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గడపగడపకూ సంక్షేమ పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ మాట్లాడుతూ కాంగ్రెస్ గ్రూపు తగాదాల్లో కొట్టుకుపోతున్నదని, ప్రతిపక్ష పార్టీలకు అభ్యర్థులే కరువయ్యారని ఎద్దేవా చేశారు. నల్లగొండ ఎమ్మెల్సీ, జిల్లా ఇన్చార్జి ఎంసీ కోటిరెడ్డి మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్గా ఉందని తెలిపారు. రాష్ట్రంలో 60 లక్షల సభ్యత్వాలు కలిగిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు.
ధర్మసాగర్, మార్చి 31 : ప్రతిపక్ష నాయకులకు పనిలేకనే రాష్ట్ర ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నారని రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని సుష్మిత గార్డెన్లో ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అధ్యక్షతన శుక్రవారం బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, నల్లగొండ ఎమ్మెల్సీ, జిల్లా ఇన్చార్జి ఎంసీ కోటిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో పార్టీ కార్యకర్తలకు మాత్రమే సంక్షేమ పథకాలు అందేవని, కానీ తెలంగాణ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని వివరించారు. రాష్ట్రంలో ప్రతి గడప గడపకూ సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. తెలంగాణ రాకముందు వచ్చిన తర్వాత జరిగిన మార్పు, అభివృద్ధిని ప్రజలు గమనించాలని సూచించారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ, ప్రతిపక్షాలను నిలదీయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాలు అందాలంటే మళ్లీ సీఎంగా కేసీఆరే కావాలన్నారు. రాష్ట్రంలో వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చామని, అనేక ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. టీఎస్పీఎస్సీలో ఒకరో ఇద్దరో చేసిన తప్పులకు రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు వేయడం సమంజసం కాదన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో కూడా పేపర్ లీకులు జరిగాయని విమర్శించారు. తెలంగాణలో కష్టపడి చదివిన అభ్యర్థులకే ఉద్యోగాలు వచ్చాయని, పార్టీ కార్యకర్తలకో నాయకుల బిడ్డలకో ఉద్యోగాలు రాలేదని అన్నారు. ధర్మసాగర్, వేలేరు మండలాల్లోని ప్రతి గ్రామంలో మహిళా సంఘం భవనాలు నిర్మించే బాధ్యత తనదేనని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి హామీ ఇచ్చారు. రహదారుల నిర్మాణానికి రూ.11కోట్ల నిధులు మంజూరు చేస్తూ సీఎం కేసీఆర్ అందించిన జీవో పత్రాలను ఎమ్మెల్యే రాజయ్యకు అందించారు.
మనందరిది బీఆర్ఎస్ కుటుంబం : దాస్యం
బీఆర్ఎస్ అంటేనే ప్రేమ, అనురాగాలతో కూడిన పార్టీ అని, మనందరిది బీఆర్ఎస్ కుటుంబమని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. ప్రతిపక్ష పార్టీలకు అభ్యర్థులే కరువయ్యారని విమర్శించారు. కాంగ్రెస్ గ్రూపు తగాదాల్లో కొట్టుమిట్టాడుతోందని చెప్పారు. గత ప్రభుత్వాల హయాంలో మోటర్లు కాలిపోయి, కరంట్ లేక రైతులు ఇబ్బందులు పడ్డారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సాగుకు 24 గంటల ఉచిత కరంటుతోపాటు పెట్టుబడికి రైతుబంధు సాయం, రైతుబీమా పథకాలు అమలు చేస్తున్నట్లు ఆయన వివరించారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ ప్రజలు అదృష్టవంతులని, ఎమ్మెల్యే రాజయ్యతో పాటు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తున్నారన్నారు. ఏ పదవిలో ఉన్నా ఎమ్మెల్యే రాజయ్య ప్రజల మధ్యే ఉంటారని చెప్పారు. ఘన్పూర్లో ప్రతిపక్షాలకు అభ్యర్థులే లేరని, ఒక వేళ పోటీ చేసినా డిపాజిట్ కూడా రాదని ఎద్దేవా చేశారు.
మరో కోనసీమ స్టేషన్ఘన్పూర్ : ఎమ్మెల్యే రాజయ్య
నియోజకవర్గంలో 1.30 లక్షల ఎకరాలకు సాగనీరు అందుతోందని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. ఎక్కడాలేని రిజర్వాయర్లు ఘన్పూర్లో ఉండడం తన అదృ ష్టమని అన్నారు. నియోజకవర్గం మరో కోనసీమలా మారిందని చెప్పారు. ఇక నియోజకవర్గంలో కరువు రాదని, చెరువులు ఎండిపోవని తెలిపారు. అభివృద్ధిలో నియోజకవర్గం పరుగులు తీస్తుందని, రాష్ట్రంలో నాలుగో స్థానంలో ఉందని అన్నారు. మల్లక్పల్లి, తాటికాయల, ధర్మసాగర్ గ్రామాలకు రాష్ట్రస్థాయి అవార్డులు వచ్చాయని తెలిపారు.
అభివృద్ధిని అడ్డుకుంటున్న కేంద్రం : ఎమ్మెల్సీ కోటిరెడ్డి
సీఎం కేసీఆర్ సూచనలు, సలహాల మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్లు నల్లగొండ ఎమ్మెల్సీ, జిల్లా ఇన్చార్జి ఎంసీ కోటిరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 60 లక్షల సభ్యత్వాలు కలిగిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని, మూడోసారి కూడా అఖండ విజయం సాధించి సీఎం కేసీఆర్ చరిత్ర సృష్టించనున్నారని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రగతిని అడ్డుకుంటుందని విమర్శించారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందన్నారు. అనంతరం సీఎం కేసీఆర్ అందించిన సందేశాన్ని చదివి వినిపించారు. ఆత్మీయ సమ్మేళనంలో జీడబ్ల్యూఎంసీ మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, ఏఎంసీ వైస్ చైర్మన్ కాలేరు కరంచంద్, డీసీసీబీ డైరెక్టర్, పీఏసీఎస్ చైర్మన్ గుండ్రెడ్డి రాజేశ్వర్రెడ్డి, కార్పొరేటర్లు ఆవాల రాధికారెడ్డి, మునిగాల సరోజన, ఎంపీపీ నిమ్మ కవితారెడ్డి, జడ్పీటీసీలు పిట్టల శ్రీలత, చాడ సరితారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు గుడివెనుక దేవేందర్, జిల్లా కో ఆప్షన్ సభ్యురాలు జుబేదాలాల్, బొడ్డు ప్రభుదాస్, చాడ కుమార్, రైతు బంధు సమితి అధ్యక్షుడు సోంపల్లి కరుణాకర్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు కర్ర సోమిరెడ్డి, వేలేరు మండల అధ్యక్షుడు మరిజు నర్సింహారావు, మాజీ ఎంపీపీ రఘు, మాజీ జడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్లు, రావుల వెంకట్రెడ్డి, బోడ్డు సోమయ్య, బీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు కల్లెపు రాజమణి, మాజీ సర్పంచ్ రజిత, కార్యకర్తలు పాల్గొన్నారు.