వరంగల్ చౌరస్తా, ఆగస్టు 1: తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపడానికై ఆ సంస్థను ప్రభుత్వ పరం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైనదని తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. మంగళవారం వరంగల్ బస్టాండ్ ఆవరణలో ఆర్టీసీ కార్మికుల యూనియన్ ప్రతినిధులతో కలిసి నిర్వహించిన వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, పువ్వాడ అజయ్కుమార్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ల చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కార్మికులకు, నాయకులకు మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేసీఆర్ కార్మికుల పక్షపాతి అని అన్నారు. ప్రజల అవసరాలను తీర్చడానికి పని చేస్తున్న ఆర్టీసీని ప్రభుత్వపరం చేసి అందులో విధులు నిర్వర్తిస్తున్న కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు ఇవ్వడమనేది సామాన్య విషయం కాదన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికుల యూనియన్ ప్రతినిధులు, పలువురు కార్పోరేటర్లు, మాజీ కార్పోరేటర్లు, డివిజన్ అధ్యక్షులు పాల్గొన్నారు.
హనుమకొండ చౌరస్తా : టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపై ఆర్టీసీ డిపోల్లో సంబురాలు మిన్నంటాయి. ఈ మేరకు సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఆర్టీసీ కార్మికులు, యూనియన్ నాయకులు, అధికారులు క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్-1 డిపోలో డ్రైవర్ ఈఎస్బాబు ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అలాగే, వరంగల్-2 డిపోలో డీఎం సురేశ్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. పటాకులు కాల్చి స్వీట్లు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. హనుమకొండ డిపోలో సీఎం కేసీఆర్, మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్కి కృతజ్ఞతలు తెలియజేస్తూ డీఎం ధరమ్సింగ్ ఆధ్వర్యంలో వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఏఎం నజియాసుల్తానా, ఎంఎఫ్ చంద్రశేఖర్, డిపో వెల్ఫేర్ కమిటీ సభ్యులు బాబు, కమురుద్దీన్ పాల్గొన్నారు. ఆర్ఎం ఆఫీస్ వద్ద డిప్యూటీ ఆర్ఎంలు కృపాకర్రెడ్డి, మాధవరావు ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
నర్సంపేట, ఆగస్టు 1 : తెలంగాణ కోసం జరిగిన ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర కీలకమని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మంగళవారం నర్సంపేటలోని క్యాంపు కార్యాలయంలో ఆర్టీసీ కార్మికులు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డిని కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని రాష్ట్ర కేబినేట్ నిర్ణయం తీసుకోవడం హర్షించదగిన విషయమన్నారు. సంస్థలోని దాదాపు 43 వేల మంది సిబ్బందికి శ్రమకు దక్కిన గౌరవం దక్కిందన్నారు. ఎన్నో ఏళ్లుగా నిబద్ధతతో పనిచేస్తున్న సిబ్బంది శ్రమను గుర్తించి, వారిని ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. స్వరాష్ట్రం కోసం తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మేలో ఆర్టీసీ కార్మికుల పాత్ర కీలకమైందన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికులు వేముల రవి, వెంకటేశ్వర్లు, ప్రవీణ్, రాంరెడ్డి, నాగిశెట్టి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.