భారీ వర్షాలతో నిండా మునిగిన వరంగల్ నగరానికి రాష్ట్ర సర్కారు అండగా నిలిచిందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. వరద ముంపు ప్రాంతాల్లో ఆస్తులు ధ్వంసం కాగా, తక్షణ సాయంగా రూ. 250 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్తో కలిసి చీఫ్విప్ ఆదివారం కుడా కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిస్తే, కేంద్రం మాత్రం ఇప్పటివరకు నయా పైసా ఇవ్వలేదని మండిపడ్డారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వరంగల్కు వచ్చారు.. వెళ్లారు.. కానీ వరద సాయంపై మాత్రం నోరు మెదపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ముఖ్యమంత్రి, మంత్రి కేటీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
– వరంగల్, ఆగస్టు 20
వరంగల్, ఆగస్టు 20 : ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరద ముంపునకు గురైన వరంగల్ నగరానికి తెలంగాణ ప్రభుత్వం చేయూత అందించింది. వరద నష్ట తక్షణ సాయంగా రూ.250 కోట్లు మంజూరు చేసింది. వరంగల్ నగర ముంపు నివారణకు శాశ్వత పరిష్కారంలో భాగంగా తక్షణ సహాయం చేసిన సీఎం కేసీఆర్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్కు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం కుడా కార్యాలయంలో ఆయన వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్తో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చీఫ్విప్ మాట్లాడుతూ 2020లో కురిసిన భారీ వర్షాలతో వరంగల్ నగరంలోని అనేక లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో మునిగిన సందర్భంగా స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించిన మంత్రి కేటీఆర్ అప్పటికప్పుడే రూ.20కోట్లు తక్షణ సహాయంగా మంజూరు చేశారన్నారు.
తర్వాత రూ.100 కోట్లు మంజూరు చేసి నగరాభివృద్ధికి తోడ్పాటునందించారన్నారు. ఇటీవల 275 మిల్లీమీటర్ల వర్షం కురువడంతో నగరంలోని అనేక లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో మునిగాయని, వరద ఉధృతికి నాలాలు, చెరువు కట్టలు తెగిపోయానన్నారు. నగర ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని తెలిపారు. బల్దియా, రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేసినందుకు ఆయా శాఖల అధికారులను అభినందించారు. వరంగల్ నగరానికి తక్షణ సహాయంగా రూ.250 కోట్లు మంజూరు చేసి ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. నగరంలో ముంపు నివారణకు ప్రత్యేక శ్రద్ధ చూపుతూ స్ట్రాటజికల్ నాలా డెవలప్మెంట్ ప్రోగాం అమలు చేయాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారని చెప్పారు. రూ.1000 కోట్ల నష్టం అంచనాలను ప్రభుత్వానికి పంపించగా తక్షణ సహాయంగా రూ. 250 కోట్లు మంజూరు చేశారని వివరించారు. వారం రోజుల్లో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి, వరద నష్ట పునరుద్దరణలో భాగంగా నాలాలు, డ్రైనేజీలు మరమ్మతు చేపడుతామని తెలిపారు.
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి నగర వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పైసా సహాయం ప్రకటించలేదని విమర్శించారు. కేంద్రం నుంచి వరద సహాయం అందించలేని దుస్థితిలో ఆయన ఉన్నారన్నారు. పైగా వరదలను రాజకీయం చేయడం బాధాకరమన్నారు. భద్రకాళీ కట్టకు చిన్న బుంగ పడితే విషయాన్ని రాద్దాంతం చేసి అసత్య ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. 60, 70 క్రితం నాయకులు చేసిన ఆశ్రద్ధ కారణంగానే నాలాలు, రోడ్లు ఆక్రమణకు గురయ్యాయన్నారు. కొంత సమయం తీసుకున్నా ప్రస్తుతం నాలాలపై అక్రమ నిర్మాణాలను తొలగించే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారన్నారు. ప్రజలకు 24 గంటలు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అండగా నిలుస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ లేదన్నారు.
వరంగల్ నగరానికి తెలంగాణ ప్రభుత్వం రూ.వేల కోట్ల నిధులు మంజూరు చేసి, అభివృద్ధి చేస్తున్నదని తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. బీజేపీ నాయకులు అర్థం లేని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం నయా పైసా నిధులు తేలేక ప్రజలను ఆగం చేస్తోందన్నారు. హైదరాబాద్ తర్వాత పెద్ద నగరంగా ఉన్న వరంగల్లో ప్రణాళికాబద్ధంగా నాలాలను విస్తరించి, ముంపు నివారణకు శాశ్వత పరిష్కారం చేస్తున్నామన్నారు. సమగ్ర ప్రణాళికలు రూపొందించి నగర ముంపు నివారణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇందులో భాగంగా చేపడుతున్న నాలాలపై అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియకు ప్రజలు సహకరించాలని కోరారు.
వరంగల్ నగరానికి తక్షణ సహాయంగా రూ. 250 కోట్లు మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన చిత్ర పటానికి చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పాలాభిషేకం చేశారు. కుడా కార్యాలయం ఆవరణలో పాలాభిషేకం చేసి, సంబురాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, కార్పొరేటర్లు వేముల శ్రీనివాస్, అశోక్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు బోయినపల్లి రంజిత్రావు, శివశంకర్ పాల్గొన్నారు