కమలాపూర్, డిసెంబర్ 3 : బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కోటకు గండికొట్టి హుజూరాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్దేనని పాడి కౌశిక్రెడ్డి విజయం సాధించి నిరూపించాడు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురవేస్తూ వచ్చింది. కారు గుర్తుపై ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ గెలిచారు. కేసీఆర్ ప్రత్యేక స్థానం కల్పించడంతో మంత్రిగా రెండుసార్లు చేపట్టి తిరుగులేని నేతగా ఎదిగారు. ఆ తర్వాత టీఆర్ఎస్ను వదిలి బయటకు వచ్చిన ఈటల 2021లో బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. హుజూరాబాద్లో తనకు తిరుగులేదని ఈటల అహంభావంతో పదవులు కట్టబెట్టిన కేసీఆర్పై పోరాటం అంటూ ఊదరగొట్టాడు. బీజేపీ అధికారంలోకి వస్తే తనే ముఖ్యమంత్రి అంటూ చెప్పుకుంటూ రాష్ట్రంలోని నియోజకవర్గాల్లో పర్యటించారు. ఆదుకున్న హుజూరాబాద్ ప్రజలను మరచిపోవడంతో బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచి రెండేళ్లు అయిన నియోజకవర్గం వైపు చూడకపోవడం, కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉన్న అభివృద్ధికి నిధులు తేకపోవడంతో ప్రజలకు దూరమయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీచేస్తున్న గజ్వేల్లో పోటీ చేయడంతో హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల ఆదరణ కోల్పోయారు.
పాడి కౌశిక్రెడ్డి హుజూరాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొంది 20ఏళ్ల చరిత్రను తిరగరాశారు. బీఆర్ఎస్కు పెట్టని కోటగా ఉన్న హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో ఓటమి పాలుకావడంతో కేసీఆర్ ఎమ్మెల్సీ విప్ కౌశిక్రెడ్డికి పదవులు కట్టబెట్టి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కౌశిక్రెడ్డి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి పనులు చేపట్టి ప్రజల్లోకి దూసుకుపోయాడు. పాడి కౌశిక్రెడ్డి నియోజకవర్గంలో ఈటలను మరిపించేలా ప్రజలను తనవైపు తిప్పుకోవడంలో విజయవంతమయ్యారు. నియోజకవర్గంలో తిరుగేలేదని విర్రవీగిన ఈటలకు 16వేలకుపైగా ఓట్ల మెజారీటీతో గెలుపొంది చరిత్రను సృష్టించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగిన నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఓట్ల సునామీ కొనసాగించారు. సర్వేల అంచనాలకు అంతుపట్టని విధంగా కౌశిక్రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొంది హుజూరాబాద్ గడ్డపై గులాబీ జెండా ఎగురవేశాడు.
సమైకాంధ్ర పాలనలో కమలాపూర్ నియోజకవర్గం అప్పటి టీడీపీ ఎమ్మెల్యేగా ముద్దసాని దామోదర్రెడ్డికి 20ఏళ్లు అవకాశం ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ 2004లో గెలిచాడు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో హుజూరాబాద్ నియోజకవర్గం ఏర్పడింది. హుజూరాబాద్ టీఆర్ఎస్ తరపున పోటీచేసి ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ నాల్గు సార్లు, 2021లో బీజేపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 20ఏళ్లు హుజూరాబాద్ ప్రజలు అవకాశం ఇవ్వడంతో తనకు తిరుగలేదని, తనకు ఓటమి లేదంటూ ఊహించిన ఈటలకు 2023లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కౌశిక్రెడ్డిని గెలిపించి గట్టి షాక్ ఇచ్చారు. నియోజకవర్గ ప్రజలు ఒక్కసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే ఇరవై ఏళ్లపాటు ఆదరిస్తారని దామోదర్రెడ్డి, ఈటల రాజేందర్లతో నిరూపితమైంది. ఎమ్మెల్యేగా గెలిచిన కౌశిక్రెడ్డి నియోజకవర్గ ప్రజల మనుసులు గెలిచి 20ఏళ్లు ఏలుతాడా? లేదా? ప్రజలు చర్చించుకుంటున్నారు.