వెంకటాపురం(నూగూరు), ఏప్రిల్ 20 : మండలంలోని మల్లాపురం, రాచపల్లి గ్రామ శివారులో నిర్మించిన పాలెంవాగు మధ్యతరహా ప్రాజెక్టులో నీరులేక అడుగంటింది. దీంతో పంటలకు సాగు నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రాజెక్టు కింద యాసంగిలో రైతులు సమారు రెండు వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. యాసంగిలో నారు మడి పోసినప్పటి నుంచి నాట్లు వేసి కలుపు తీసే వరకు ప్రాజెక్టు నుంచి సాగు నీరు బాగానే అందింది. కాగా, వరి పొట్టకు వచ్చి కంకి వచ్చే దశలో ప్రాజెక్టులో నీరు అడుగంటింది. దీంతో రైతులు సాగు నీటి కోసం తంటాలు పడాల్సి వస్తున్నది.
ప్రాజెక్టు ప్రధాన గేటుకు అధికారులు మరమ్మతులు చేయించాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేల రూపాయలు పెట్టుబడులు పెట్టి పంట చేతికి వచ్చే సమయంలో సాగు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వానకాలంలో నష్టాలను చూసిన రైతులు యాసంగి సాగులోనైనా కలిసి వస్తుందని ఆశ పడ్డితే సాగు నీరందక మళ్లీ నష్టాలనే చవిచూడాల్సి వస్తున్నది. పంటలపై పెట్టిన పెట్టుబడులు రాక అప్పలపాలవుతున్నామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.