బయ్యారం ఆగస్ట్ 30 : కాలికి గజ్జె కట్టి.. గళం విప్పి ప్రజలను చైతన్యపరుస్తున్న తెలంగాణ సాంస్కతిక కళాకారులకు కేసీఆర్ సర్కారు సముచిత గుర్తింపునిచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను జనంలోకి తీసుకెళ్లి వాటిని వినియోగించుకునేలా వారు చేస్తున్న కృషికి ఫలితం దక్కింది. వారి సేవలను గుర్తించిన ప్రభుత్వం 30శాతం పీఆర్సీ పెంచుతున్నట్లు సోమవారం ప్రకటన చేయడంతో కళాకారుల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. గతంలో వారికి 25,514 వేతనం వస్తుండగా ప్రభుత్వ తాజా నిర్ణయంతో రూ.6,354(30శాతం) పెరిగి రూ.31,868కి చేరుకోనున్నది. ఇలా వరంగల్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 1,54 మంది కళాకారులకు లబ్ధి చేకూరనున్నది.
తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులను ప్రభుత్వం గుర్తించి వేతనాలు పెంచడంతో అంతటా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి జిల్లావారీగా వరంగల్ 30 మంది, మహబూబాబాద్లో 28మంది, ములుగులో 19మంది, భూపాలపల్లిలో 23మంది, జనగామలో 23మంది, హనుమకొండలో 31మంది కళాకారులు ఉన్నారు. ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడుతున్న తమను గుర్తించినందుకు గాను ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు చేస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
తెలంగాణ సాంస్కృతిక సారథులు నాడు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. సమైక్య పాలకుల హయాంలో దగా పడుతున్న తెలంగాణతో పాటు జరుగుతున్న అన్యాయం, స్వరాష్ట్ర ఆవశ్యకతపై కాళ్లకు గజ్జె కట్టి.. గళం విప్పి పల్లెల్లో తిరుగుతూ గేయాలు ఆలపిస్తూ చైతన్యపరిచారు. అంతేకాకుండా మలిదశ తెలంగాణ ఉద్యమం ఎగసి పడడంతో కళాకారులు చురుకైన పాత్ర పోషించి తెలంగాణ సిద్ధించేందుకు తమ వంతు కృషిచేశారు. అదే సమయంలో అనేక మంది కళాకారులు కేసుల పాలయ్యారు. అయితే వారి కృషిని గుర్తించిన కేసీఆర్ స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015లో తెలంగాణ సాంస్కతిక సారథిని ఏర్పాటు చేసి కళాకారులకు ఉద్యోగాలు కల్పించారు. అప్పటినుంచి రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు పచ్చదనం, పరిశుభ్రత వంటి అనేక అంశాలపై ప్రజలను చైతన్యపరుస్తూ ప్రజల శ్రేయస్సుతో పాటు బంగారు తెలంగాణ సాధన కోసం పాటుపడుతున్నారు.
తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాతనే కళారులకు గుర్తింపు దక్కింది. రాష్ట్రం కోసం జరిగిన మలిదశ ఉద్యమంలో కళాకారులు ముఖ్యపాత్ర పోషించారు. ఊరూరా తిరుగతూ ప్రజలను చైతన్యపరిచారు. కళాకారుల సేవలను గుర్తించిన సీఎం కేసీఆర్ సాంస్కృతిక సారథిని ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పించారు. సమైక్య రాష్ట్రంలో పూట గడవని కళాకారులు నేడు స్వరాష్ట్రంలో దర్జాగా బతుకున్నారు. తాజాగా వేతనాలు పెంచి గళానికి సీఎం కేసీఆర్ సార్ మరింత గౌరవం పెంచారు.
– రాజమౌళి, టీఎస్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మహబూబాబాద్
రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. పాటలే ప్రాణంగా జీవిస్తున్న కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చి కళాకారుల జీవితాల్లో సీఎం కేసీఆర్ సారు వెలుగు నింపారు. ఇప్పుడు వేతనాలు పెంచి కళాకారులను మరోమారు ఆదుకున్నారు. ప్రభుత్వం అందించిన తోడ్పటుతో మరింత ఉత్సాహంగా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం. సర్కారు చేసిన సాయాన్ని ఎన్నటికీ మర్చిపోము.
– అశ్విని, సారథి కళాకారిణి