Covid-19 | వరంగల్, డిసెంబరు 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తూర్పు తీరం నుంచి బలమైన గాలుల కారణంగా మూడు, నాలుగు రోజుల నుంచి చలి విజృంభిస్తున్నది. వాతావరణ మార్పుల కారణంగా ఇప్పటికే వేలాది మంది జలుబు, దగ్గుతో సతమతమవుతుండగా కరోనా హెచ్చరికలు మరింత వణుకు పుట్టిస్తున్నాయి. పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా హాస్పిటళ్లు జలుబు, జ్వరం బాధితులతో కిటకిటలాడుతున్నాయి. చలి పంజా విసురుతున్న క్రమంలో పిల్లలు, వృద్ధుల పట్ల జాగ్రత్తలు పాటించాలని, వీలైనంత మేరకు ఉదయం, సాయంత్రం ఆరుబయట తిరుగొద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
గాలులతో కూడిన చలితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూడు, నాలుగు రోజులుగా బయటకు రావాలంటేనే జంకుతుకున్నారు. డిసెంబర్ మొదటి వారం నుంచే జలుబు, దగ్గు, జ్వర పీడితులు పెరిగిపోయారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు సతమతమవుతున్నారు. జాగ్రత్తలు పాటిస్తేనే కాస్త ఉపశమనం పొందవచ్చని డాక్టర్లు సూచిస్తున్నారు.
జ్వరం, జలుబు, గొంతు సమస్యలు పెరుగుతున్న ఈ తరుణంలో కరోనా మళ్లీ వ్యాప్తి చెందుతున్నదని వైద్య, ఆరోగ్య శాఖ హెచ్చరికలు చేయడంతో జనంలో ఆందోళన నెలకొంది. కరోనాలో కొత్త వేరియంట్ (జేఎన్1) కారణంగా కేసులు పెరుగుతున్నాయని, మాస్కులు ధరించి అందరూ జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. లేకపోతే జరిమానా విధిస్తామని తాజాగా ఆదేశాలిచ్చింది. చలితో వచ్చిన జ్వరం, జబులుతో ఇబ్బంది పడుతున్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలి. కరోనా తాజా వ్యాప్తి కారణంగా 10 ఏండ్ల లోపు వారు, 60 ఏండ్లు దాటిన వారు, గర్భిణులు అత్యవరమైతే తప్ప బయటికి రావద్దని వైద్య, ఆరోగ్య శాఖ సూచించింది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కు ధరించాలని, వీలైనన్ని ఎక్కువసార్లు చేతులు కడుక్కోవాలని, తప్పనిసరైతేనే ప్రయాణాలు చేయాలని పేర్కొన్నది. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శ్వాసలో ఇబ్బందులు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించింది. ఇంటి లోపల వేడి వాతావరణం ఉండేలా చూసుకోవాలని, వీలైనంతగా పిల్లలు, వృద్ధులు ఉన్ని దుస్తులు ధరించాలని సూచించింది.
మూడు, నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 13.90 డిగ్రీలు, ములుగు జిల్లాలో 14.40, వరంగల్ జిల్లాలో 13.50, హనుమకొండలో 15, జనగామలో 15.10, మహబూబాబాద్లో 16.40 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణం కంటే అన్ని జిల్లాల్లోనూ సగటున ఒకట్రెండు డిగ్రీలు తక్కువ నమోదవుతున్నాయి. దీంతోపాటు సాయంత్రం నుంచి ఉదయం వరకు బలంగా వీస్తున్న గాలులతో భరించలేని చలివాతావరణం నెలకొంటున్నది. దీంతో అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. ఈ రెండు, మూడు రోజుల్లోనే జ్వరం, జలుబు బాధితుల సంఖ్య విపరీతంగా పెరిగింది. తేమ కారణంగా వాతావరణంలో ఆక్సిజిన్ స్థాయిలు తగ్గిపోయి చాలా మందిలో శ్వాస సంబంధ సమస్యలు పెరుగుతున్నాయి. చాలామందిని గొంతు నొప్పి పట్టిపీడిస్తున్నది.
ప్రస్తుత చలి వాతావరణంతో పాడిపంటలకు సైతం ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎక్కువ విస్తీర్ణంలో సాగైన మిరప దెబ్బతింటున్నది. చలి గాలుల కారణంగా పూత, కాత నల్లగా మారుతున్నది. డిసెంబర్లో మామిడి పూతకు వచ్చేందుకు అదునుగా ఉంటుంది. కానీ ప్రస్థుత పరిస్థితి కారణంగా పూత రావడం లేదు. ఇప్పటికే వచ్చిన కొద్దిపాటి పూత సైతం నల్లగా మారిపోతున్నది. మరోవైపు పాడిపశువుల్లో పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతున్నది.