తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన ‘తెలంగాణ రన్’ ఉత్సాహంగా సాగింది. హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాకేంద్రాల్లో పోలీస్ కమిషనర్, కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, వేలాది మంది యువకులు, విద్యార్థులు భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఆయా ప్రాంతాల్లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఉదయం 6గంటల నుంచి ‘2కే రన్’ కొనసాగగా, విజేతలకు మెమెంటోలు అందించారు. అతిథులు జెండా ఊపి, బెలూన్లు ఎగరేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయని తెలిపారు. అభివృద్ధి, శాంతిభద్రతలకు తెలంగాణ కేరాఫ్గా నిలిచిందని కొనియాడారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూన్ 12