Anchor | మలయాళ టెలివిజన్ రంగంలో ప్రముఖ యాంకర్గా, యూట్యూబర్గా, బిగ్బాస్ రన్నరప్గా గుర్తింపు పొందిన పెర్లీ మానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. విద్యార్థుల నిరసనలపై ఆమె చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ పెద్ద ఎత్తున వివాదానికి దారితీయగా, కేవలం రెండు రోజుల్లోనే లక్షలాది మంది ఆమెను అన్ఫాలో చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇటీవల కేరళలో జరిగిన విద్యార్థుల నిరసనల నేపథ్యంలో పెర్లీ మానీ ఇన్స్టాగ్రామ్లో ఒక సుదీర్ఘమైన సందేశాన్ని పోస్ట్ చేశారు.ఏ లక్ష్యం కూడా ఒకరి ప్రాణాల కంటే గొప్పది కాదు. మీ భద్రతకు ముప్పు ఉందని భావిస్తే నిరసనలు విరమించి ఇళ్లకు వెళ్లండి అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి.
అయితే ఈ పోస్టులో కామెంట్స్ను డిసేబుల్ చేయడం, పోస్ట్ డిజైన్కు ఉపయోగించిన రంగులు, క్యాప్షన్ వంటి అంశాలపై కూడా కొందరు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సోషల్ మీడియాలో ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. వివాదానికి ముందు పెర్లీ మానీ ఇన్స్టాగ్రామ్లో సుమారు 27 లక్షల మంది ఫాలోవర్లు ఉండగా, అనంతరం ఆ సంఖ్య 24 లక్షలకు పడిపోయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అలాగే యూట్యూబ్, ఫేస్బుక్ వేదికలపై కూడా పలువురు ఆమెను అన్ఫాలో చేస్తున్నట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ వివాదంపై మలయాళ సినీ పరిశ్రమకు చెందిన సీనియర్ దర్శకుడు సిబి మలయిల్ కూడా స్పందించినట్లు సమాచారం. ఆయన చేసిన వ్యాఖ్యలకు పెర్లీ మానీ సోషల్ మీడియాలో పరోక్షంగా కౌంటర్ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది.
తన పోస్ట్పై విమర్శలు చేస్తున్నవారిని ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారితీయగా, అనంతరం దర్శకుడు సిబి మలయిల్ కుమారుడు జో మలయిల్ కూడా సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఈ వివాదం వ్యక్తిగత విమర్శల వరకు వెళ్లింది. సామాజిక అంశంపై ప్రారంభమైన ఈ వివాదం ఇప్పుడు మలయాళ సినీ, టెలివిజన్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. పెర్లీ మానీ చేసిన వ్యాఖ్యలు, వాటిపై వచ్చిన ప్రతిస్పందనలు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీస్తున్నాయి. ఇక తెలుగు ప్రేక్షకులకు కూడా పెర్లీ మానీ సుపరిచితమే. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, దర్శకుడు రాజమౌళితో ఆమె నిర్వహించిన ఇంటర్వ్యూలు మంచి ఆదరణ పొందాయి. ఆ సమయంలో రామ్ చరణ్ ఆమె పేరు గుర్తు పెట్టుకోలేకపోయిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది.