మక్కల కొనుగోళ్ల కోసం హనుమకొండ జిల్లాలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రైతులు మండల పరిధి దాటకుండా మక్కలు అమ్ముకునేలా సెంటర్లను ప్రతిపాదించారు. రూ.1,962 మద్దతు ధర చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మొత్తం 16 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నారు. త్వరలో చేపట్టనున్న మక్కల కొనుగోళ్లను ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (పీఏసీఎస్) పర్యవేక్షిస్తాయి. మార్క్ఫెడ్ ద్వారా సేకరించిన మక్కలను భీమదేవరపల్లి, పరకాలతో పాటు కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్లో ఉన్న స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్(ఎస్డబ్ల్యూజీ) గోదాముల్లో నిల్వ చేస్తారు. వడ్ల మాదిరిగానే మక్కలను అమ్మిన రైతులకు 3 నుంచి 5 రోజుల్లో వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బులు జమకానున్నాయి. కాగా, ఈ యాసంగిలో సుమారు 60 వేల ఎకరాల్లో రైతులు మక్కజొన్న పంటను సాగు చేశారు.
– హనుమకొండ సబర్బన్, ఏప్రిల్ 29
హనుమకొండ సబర్బన్, ఏప్రిల్ 29 : మక్క రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించిం ది. వడ్ల మాదిరిగానే మక్కలను కూడా కొనేందుకు ముం దుకు వచ్చింది. ఈ మేరకు సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ (టీఎస్ మార్క్ఫెడ్) చకచకా ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా మార్క్ఫెడ్ అధికారులు కొనుగోలు కేంద్రాలను ఎంపిక చేయడంతోపాటు ఇతర ఏర్పాట్లను సైతం యుద్ధ ప్రాతిపదికన చేశారు. ఈ మేరకు హనుమకొండ జిల్లాలో మొత్తం 16 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నారు. రైతులు మండల పరిధి దాటకుండా మక్కలు అమ్ముకునేలా సెంటర్లను ప్రతిపాదించారు. వ్యవసాయ శాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగా అన్ని మండల కేంద్రాల్లో సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఆత్మకూరు మండలంలో పెంచికల్ పేట, ధర్మసాగర్ మండలం నారాయణగిరి, ఐనవోలు మండలంలో నందనంలో మక్కల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ మక్కల కొనుగోళ్ల బాధ్యత మొత్తం ఆయా సెంటర్ పరిధిలో ఉండే ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు(పీఏసీఎస్) చూసుకుంటాయి. మార్క్ఫెడ్ కొన్న మక్కలను భీమదేవరపల్లి, పరకాలతో పాటు కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్లో ఉన్న స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్(ఎస్డబ్ల్యూజీ) గోదాముల్లో నిల్వ చేస్తారు.
60 వేల ఎకరాల్లో మక్కజొన్న సాగు
జిల్లాలో ఈ యాసంగిలో సుమారు 60 వేల ఎకరాల్లో మక్కజొన్న పంటను రైతులు సాగు చేశారు. ఇం దులో ఇటీవల కురిసిన వర్షాలతో 12 వేల ఎకరాల్లో మ క్క పంట నష్టపోయినట్లు వ్యవసాయ శాఖ నివేదిక ఇ చ్చింది. ఇదేకాకుండా సుమారు 10 వేల ఎకరాల్లో ప్రైవే ట్ కంపెనీలు రైతులతో ఆడ, మగ మక్కలు సాగు చే యించారు. ఇక మిగిలిన 38 ఎకరాల్లో రైతులు పండించిన మక్కలను కేంద్రాలకు అమ్మకానికి వచ్చే అవకాశాలున్నాయి. ఇందులో కూడా ముందుగా కోసిన రైతులు మక్కలను అధిక ధరకు అమ్ముకున్నారు. ఇప్పుడు దళారులు రూ.1600 నుంచి 1700 ధరను దించేశారు. దీం తో రైతుల వద్ద ఉన్న ప్రతి మక్క గింజను రూ.1962 మద్దతు ధరతో కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
5 రోజుల్లోగా రైతుల ఖాతాల్లో డబ్బులు
వడ్ల మాదిరిగానే మక్కలను అమ్మిన రైతులకు 3 నుంచి 5 రోజుల్లో వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బులు జమకానున్నాయి. రైతులు సెంటర్కు మక్కలతోపాటు ఏఈవో లేదా ఏవోల నుంచి పంట ధ్రువీకరణ పత్రం, రైతుబంధు పథకానికి ఇచ్చిన బ్యాంకు పాస్బుక్, పట్టాదారు పాస్బుక్, ఆధార్ కార్డు జిరాక్స్ను విధిగా వెంట తీసుకెళ్లాలి. మక్కల్లో 14 శాతానికి మించి తేమ ఉండకుండా చూసుకోవడంతో పాటు నల్లగింజలు, బెండ్లు, ఇతర చెత్త లేకుండా చూసుకోవాలి. ఇదే కాకుండా రైతు తన భూమిలో మక్కజొన్న పంట వేసినట్లు రైతు సమగ్ర సమాచార సేకరణ నివేదిక(ఆర్ఎస్ఎస్ఎస్)లో నమోదై ఉంటేనే ఆ మక్కలను కొనుగోలు చేస్తారు. దీని వల్ల దళారులను నిరోధించే వీలవుతుంది.
రైతులు కేందాల్లోనే అమ్ముకోవాలి
రైతులు తొందర పడి దళారులకు అమ్ముకుని ఆర్థికంగా నష్టపోవద్దు. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు చివరి గింజ వరకూ కొంటాం. కొనుగోళ్లు త్వరితగతిన జరిగేందుకు కేంద్రాల సంఖ్యను కూడా పెంచాం.. రైతులు నాణ్యతా ప్రమాణాలు పాటించి మద్దతు ధరను పొందాలి. కొనుగోళ్ల విషయంలో అన్ని పీఏసీఎస్ల సిబ్బందికి తగిన సూచనలు ఇచ్చాం. కొనుగోళ్ల కోసం అన్ని ఏర్పాట్లు చేశాం.
– శ్యాం, మార్క్ఫెడ్, డీఎం