చారిత్రక వరంగల్ నగరాన్ని గ్రీన్ సిటీగా తీర్చిదిద్దే లక్ష్యంతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అడుగులు వేస్తున్నారు. ప్రతి మూడు డివిజన్లకు ఒక నర్సరీ ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలను ఆమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. 66 డివిజన్లు కలిగి ఉన్న గ్రేటర్ పరిధిలో ప్రతి మూడు డివిజన్లకు ఒక నర్సరీ చొప్పున కొత్తగా 22 నర్సరీలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే వీటికి కావాల్సిన స్థలాలను గుర్తించిన అధికారులు, ఎండ వేడి నుంచి మొక్కలను రక్షించే విధంగా గ్రీన్షెడ్లను నిర్మిస్తున్నారు. రూ.19 కోట్ల గ్రీన్ బడ్జెట్తో నర్సరీల్లో అభివృద్ధి పనులు చేపట్టారు.
వరంగల్, డిసెంబర్ 6 : పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందుకోసం నర్సరీల్లో మొక్కలను పెంచుతోంది. నర్సరీల్లో మొక్కలను పెంచేలా గ్రేటర్ అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీతో గ్రేటర్ నిర్వహిస్తున్న రెండు నర్సరీలు మాత్రమే ఉన్నాయి.
ప్రతి నర్సరీలో 50 వేల మొక్కలు
కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఒక్కో నర్సరీలో 50 వేల మొక్కలు పెంచేలా లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, విస్తీర్ణం ఎక్కువ ఉన్న నర్సరీల్లో 70 వేల మొక్కలు పెంచేలా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. గ్రేటర్కు ఏడాదికి ఇచ్చిన 13 లక్షల మొక్కల టార్గెట్ను చేరుకునేలా కొత్తగా ఏర్పాటు చేస్తున్న 22 నర్సరీల్లో మొక్కలు పెంంచేందుకు అధికారులు ప్రణాళికలు చేస్తున్నారు. ప్రతి నర్సరీలో నీటి వసతి కోసం బోర్లు ఏర్పాటు చేస్తున్నారు. చుట్టూ ప్రహరీల నిర్మాణం, విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నారు. కొన్ని నర్సరీలకు ఇప్పటికే ప్రహరీలు ఉండగా లేని వాటికి ప్రహరీ నిర్మాణం చేపట్టనున్నారు. ప్రస్తుతం ఉన్న 6 నర్సరీల్లో 5.70 లక్షల మొక్కలు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. పూలు, పండ్లు, అవెన్యూ మొక్కలను పెంచేలా ప్రణాళికలు చేస్తున్నారు.
ప్రజలకు చేరువగా నర్సరీలు
గ్రేటర్లో ప్రతి ఇంటికి ఆరు మొక్కలు పంపిణీ చేయాలన్న లక్ష్యం పెట్టుకున్నారు. ఆయా డివిజన్ల ప్రజలకు మొక్కల పంపిణీతో పాటు పార్కులు, పట్టణ ప్రకృతి వనాలకు మొక్కలను అందించనున్నారు. దీనికి తోడు రహదారులు, సెంట్రల్ మీడియంలకు దగ్గరలోని నర్సరీల నుంచి పంపిణీ చేసేలా కార్యాచరణ రూపొందించారు.
ప్రజలకు కావాల్సిన మొక్కలు అందిస్తాం..
ప్రజలకు కావాల్సిన మొక్కలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో 5.70 లక్షల మొక్కలు అందుబాటులో ఉన్నాయి. 2023-24 హరితహారం లక్ష్యానికి అనుగుణంగా 13 లక్షల మొక్కలు నర్సరీలలో సిద్ధంగా ఉంచేలా ప్రణాళికలు చేస్తున్నాం. ఎస్ఈ, సీహెచ్వోలతో కమిషనర్ కమిటీ వేశారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న 22 నర్సరీల్లో మౌలిక వసతులపై నివేదిక అందించనన్నాం. రూ.19 కోట్ల గ్రీన్ బడ్జెట్ నుంచి నర్సరీలను అభివృద్ధి చేస్తున్నాం. వచ్చే హరితహారం నాటికి అన్ని నర్సరీలు పచ్చని మొక్కలతో కళకళలాడుతాయి. – శ్రీనివాసరావు, చీఫ్ హార్టికల్చర్ ఆఫీసర్