పేదలు ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తున్న రాష్ట్ర సర్కారు తాజాగా వారి సొంతింటి కలను నెరవేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నది. సొంత జాగ ఉండి అర్హులైన వారికి గృహలక్ష్మి పథకం ద్వారా రూ.3లక్షలు అందించనున్నది. హనుమకొండ జిల్లాకు 8400 ఇళ్లు మంజూరు కాగా, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మొదలైంది. ఇప్పటికే ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించిన అధికారులు పరిశీలన అనంతరం అర్హులకు రూ.3లక్షలు అందజేయనున్నారు. అలాగే గతంలో డబుల్ బెడ్ రూం పథకం ద్వారా జిల్లాకు 4,480 ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో 1,381 గృహాలు అందుబాటులోకి రాగా, ఈ ఏడాది చివరికల్లా అన్నింటి నిర్మాణం పూర్తి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది.
– వరంగల్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
వరంగల్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రతి పేద కుటుంబానికి ఇల్లు ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మీ పథకం లబ్ధిదారుల ఎంపిక జరుగుతున్నది. గ్రామాలు, వార్డులు, డివిజన్ల వారీగా వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలిస్తున్నారు. అర్హుల పేర్లతో జాబితాను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకంతో పాటు సొంత జాగలో ఇల్లు కుట్టుకునే వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. పథకం కింద అర్హులైన వారికి రూ.3 లక్షల చొప్పున అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మూడు విడుతల్లో లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలోనే జమ చేసేలా ఏర్పాట్లు చేసింది. దశల వారీగా అర్హులందరికీ ఈ పథకాన్ని అమలు చేయనున్నది. మొదటి విడుతలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3 వేల ఇళ్లను మంజూరు చేసింది. హనుమకొండ జిల్లాకు 8400 ఇళ్లు మంజూరయ్యాయి. ఇటీవల ఈ పథకం కోసం ప్రజల నుంచి భారీగా దరఖాస్తులు వచ్చాయి. అధికార యంత్రాంగం వీటిని పరిశీలిస్తున్నది. కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ తుది జాబితాను సిద్ధం చేయనున్నది.
గృహలక్ష్మీ పథకం కింద అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు మంజూరు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ పథకంలో సామాజిక వర్గాల వారీగానూ ప్రాధాన్యత ఇస్తున్నది. ప్రతి నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలతో పాటు దివ్యాంగులకు ప్రాధాన్యమిచ్చేలా చర్యలు చేపట్టింది. పథకాన్ని పూర్తి పారదర్శకంగా అమలు చేయనున్నది. ఇళ్ల మంజూరు, బిల్లుల చెల్లింపు అంతా ఆన్లైన్లోనే నిర్వహించనున్నది. గృహలక్ష్మి పేరుతో ప్రత్యేకంగా పోర్టల్ను తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఇంటిని లబ్ధిదారుడు ఇష్టపూర్వకంగా కట్టుకునేలా వెసులుబాటు కల్పించింది.
నిరుపేదలకు సౌకర్యవంతమైన ఇళ్లను నిర్మించి ఇవ్వాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్ల పథకాన్ని మొదలుపెట్టింది. ఈ పథకం కింద జిల్లాకు 4,480 ఇళ్లు మంజూరయ్యాయి. రూ.241 కోట్లతో ఈ పనులను చేపట్టారు. ఇప్పటి వరకు 1,381 డబుల్ ఇళ్ల నిర్మాణం పూర్తయింది. ఈ ఏడాది చివరి వరకు అన్నిం టి నిర్మాణం పూర్తయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వరంగల్ పశ్చిమ నియోజవర్గం అంబేద్కర్నగర్లో 6.33 ఎకరాల్లో 16 బ్లాకులుగా 592 డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం పూర్తయింది. లష్కర్ సింగారంలో 1.10 ఎకరాల్లో 20 ఇళ్లు మంజూరయ్యాయి. న్యూశాయంపేటలో 7.52 ఎకరాల్లో 19 బ్లాకులుగా మరో 608 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. కాజీపేటలో 1.20 ఎకరాల్లో 97 డబుల్ బెడ్రూం ఇళ్లను మంజూరు చేసింది. వర్ధన్నపేట నియోజవర్గం పైడిపల్లిలో 38 గుంటల విస్తీర్ణంలో 70 ఇళ్ల నిర్మాణం కొనసాగుతున్నది. దశల వారీగా ఇవన్నీ పూర్తి కానున్నాయి.