మహబూబాబాద్, డోర్నకల్ అసెంబ్లీ స్థానాలకు జోరుగా నామినేషన్లు దాఖలవుతున్నాయి. బుధవారం బీఆర్ఎస్ డోర్నకల్ నియోజకవర్గ అభ్యర్థి, ఎమ్మెల్యే రెడ్యానాయక్ మంత్రి సత్యవతి, ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు కవిత, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేశ్రెడ్డితో కలిసి మరిపెడలోని తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. బీఆర్ఎస్ మహబూబాబాద్ అభ్యర్థి, ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ మంత్రి సత్యవతి, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్రెడ్డితో కలిసి ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ వేశారు. కాగా, ఇప్పటి వరకు జిల్లాలో 11 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు.
మహబూబాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాలకు చెందిన బీఆర్ఎస్ అభ్యర్థులు బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. మహబూబాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్నాయక్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్రెడ్డి, మాజీ కౌన్సిలర్ రంగన్న, శంకర్నాయక్ కూతురు తేజస్వినితో కలిసి నామినేషన్ వేశారు. మహబూబాబాద్ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి అలివేలుకు నామినేషన్ పత్రాలను అందజేశారు. బీఆర్ఎస్ శ్రేణులు పెద్దఎత్తున తరలివచ్చి శంకర్నాయక్ మద్దతు పలికారు. నామినేషన్ ప్రక్రియ ముగిసిన అనంతరం ఆయన తన పాత ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. డోర్నకల్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి డీఎస్ రెడ్యానాయక్ మంత్రి సత్యవతిరాథోడ్, మహబూబాబాద్ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేశ్రెడ్డి, రామసహాయం రంగారెడ్డితో కలిసి నామినేషన్ వేశారు. మరిపెడలోని తహసీల్దార్ కార్యాలయం లో రిటర్నింగ్ అధికారి నర్సింహారావుకు నామినేషన్ పత్రాలను అందజేశారు. అనంతరం రాజీవ్గాంధీ విగ్ర హం నుంచి సభాప్రాంగణం వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పెద్దఎత్తున యువత, మహిళలు పాల్గొన్నారు. ర్యాలీలో మంత్రి సత్యవతిరాథోడ్, ఎం పీ, జి ల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేశ్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్రావు పాల్గొన్నారు. నామినేషన్కు పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలకు ఎమ్మెల్యే రెడ్యానాయక్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. డోర్నకల్ నియోజకవర్గంపై గులాబీజెండా ఎగరడం ఖాయమన్నారు. సీఎం కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రిని చేయడమే అం దరి కర్తవ్యమని వక్తలు సభలో మాట్లాడారు.
మహబూబాబాద్ రూరల్, నవంబర్ 8 : జిల్లాలో ఎన్నికల నామినేషన్ల పక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నది. ఇప్పటి వరకు మహబూబాబాద్ అసెంబ్లీ స్థానానికి 5, డోర్నకల్ స్థానానికి 6 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. కాగా, బుధవారం మహబూబాబాద్ నియోజకవర్గానికి బీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ శంకర్నాయక్, కాంగ్రెస్ నుంచి డాక్టర్ మురళీనాయక్, బీజేపీ నుంచి జాటోత్ జమున, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నుంచి బట్టు బిన్నమ్మ నామినేషన్ దాఖలు చేశారు. అదేవిధంగా డోర్నకల్ నియోజకవర్గానికి బీఆర్ఎస్ నుంచి డీఎస్ రెడ్యానాయక్, బీజేపీ నుంచి భూక్యా సంగీత, స్వతంత్ర అభ్యర్థులుగా వాంకుడోత్ రవి కుమార్, భూక్యా గోపీకృష్ణ, అజ్మీరా రత్న నామినేషన్లు దాఖలు చేసినట్లు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి శశాంక తెలిపారు.