నర్సంపేట రూరల్, డిసెంబర్ 12 : వ్యవసాయరంగంలో ప్రతీ సంవత్సరం నూతన మార్పులు వస్తున్నాయి. కూలీల కొరత కారణంగా రైతులు యంత్రాలపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఒకేసారి వరి సాగు కోతకు రావడంతో కోత యంత్రాలకు గిరాకీ పెరిగింది. కూలీలకు బదులు యంత్రాలతో గంటల వ్యవధిలోనే పంట ఉత్పత్తులు చేతికి అందివస్తుండడంతో రైతులు ఈ యంత్రాల వైపే మొగ్గుచూపుతున్నారు. ఈ సంవత్సరం కొంత ఆలస్యమైనప్పటికీ సమృద్ధిగా వర్షాలు కురవడంతో బావులు, చెరువులు, కుంటల కింద ఒకేసారి రైతాంగం వరి సాగుకు చేశారు. దాదాపు వరి ఒకేసారి కోతకు రావడంతో యంత్రాలకు భలే గిరాకీ వచ్చింది. రాష్ట్రం నుంచి గాక ఆంధ్రప్రదేశ్, తమిళనాడు నుంచి వరికోత యంత్రాలు భారీగా తరలివచ్చాయి.
అన్ని గ్రామాల్లో హార్వెస్టర్ యజమానులు యంత్రాలను ఇప్పటికే దింపారు. ఎకరం వరి కోసేందుకు హార్వెస్టర్ యజమానులు రూ.2వేల నుంచి రూ.2200 తీసుకుంటున్నారు. చైన్ మిషన్కు మాత్రం రూ.3200ల నుంచి రూ.3600 వరకు చార్జి చేస్తున్నారు. ఒక ఎకరం వరిని వరికోత యంత్రాలు రెండు గంటల్లోపు కోస్తున్నాయి. వరి కోత యంత్రాల విధానమే బాగుందని పలువురు రైతులు అంటున్నారు. కూలీల సహాయంతో కోతకోసి, కుప్పపెట్టి, కుప్ప నూర్పిడి చేసే సరికి సుమారు ఎకరానికి రూ.8వేల నుంచి 9వేల వరకు ఖర్చు వస్తుందంటున్నారు. యంత్రాల సహాయంతో కోస్తే వరిగడ్డి అక్కెరకు రాకుండా పోతుంది. గడ్డి అవసరమున్న రైతులు తప్ప మిగతా వారంతా వరి కోతయంత్రాలను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. రైతుల అవసరాలను గమనించిన హార్వెస్టర్ యజమానులు గ్రామానికి ఒకటి రెండు చొప్పున యంత్రాలను తీసుకువచ్చి సొమ్ముచేసుకుంటున్నారు.