వరంగల్లో ఆధునిక హంగులతో కొత్త బస్స్టేషన్ను నిర్మించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇందుకు కావాల్సిన రూ.75 కోట్ల నిధులను ఆర్టీసీ, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థలు సమకూర్చనున్నాయి. 5 అంతస్తులు, 32 ప్లాట్ఫారాలతో నిర్మించే స్మార్ట్ బస్ స్టేషన్లో కమర్షియల్, షాపింగ్ కాంప్లెక్స్, మాల్స్, హోటల్స్ లాంటివి ఉండనున్నాయి. ఈ మేరకు బస్స్టేషన్ నిర్మాణానికి గ్రీన్సిగ్నల్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి జీవో జారీ చేసింది. కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి వరంగల్ రైల్వే స్టేషన్ వరకు నిర్మించే నియో మెట్రోకు అనుసంధానం చేసేలా బస్ స్టేషన్ డిజైన్ను తయారుచేశారు. త్వరలోనే పనులను ప్రారంభించి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయనున్నారు.
– వరంగల్, డిసెంబర్ 30
త్వరలో పనులు ప్రారంభిస్తాం..
ప్రస్తుత వరంగల్ బస్ స్టేషన్ ప్రాంతంలోనే స్మార్ట్ బస్ స్టేషన్ నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభిస్తాం. దీనికి సంబంధించిన జీవో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. రూ. 75 కోట్ల నిధులతో స్మార్ట్ బస్స్టేషన్ను నిర్మించనున్నారు. కొత్త బస్ స్టేషన్ నిర్మాణంతో వరంగల్ జిల్లా ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో వరంగల్ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాం. త్వరలోనే వరంగల్ స్మార్ట్ స్టేషన్ పనులను ప్రారంభించి నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటా.
– నన్నపునేని నరేందర్, తూర్పు ఎమ్మెల్యే
వరంగల్, డిసెంబర్ 30: ఆధునిక హంగులతో వరంగల్లో స్మార్ట్ బస్ స్టేషన్ నిర్మాణానికి వడి వడిగా అడుగులు పడుతున్నాయి. ప్రస్తుత వరంగల్ బస్ స్టేషన్లోనే స్మార్ట్ బస్ స్టేషన్ను నిర్మించనున్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో టీఎస్ ఆర్టీసీ అధికారులతోపాటు కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ అధికారులు స్మార్ట్ బస్స్టేషన్ నిర్మాణానికి క్షేత్రస్థాయిలో స్థలాన్ని పరిశీలించారు. 2050 సంవత్సరం నాటికి నగర రవాణా అవసరాలకు అనుగుణంగా వరంగల్లో ఆధునిక హంగులతో కొత్త బస్ స్టేషన్ను నిర్మించేలా ప్రణాళికలు చేశారు. రూ.75 కోట్లతో స్మార్ట్ బస్ స్టేషన్ నిర్మాణానికి అంచనాలు రూపొందించారు. దీనికి సంబంధించిన నివేదికను టీఎస్ ఆర్టీసీ, కుడా అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు.
స్మార్ట్ బస్ స్టేషన్ నిర్మాణానికి కావాల్సిన రూ.75 కోట్ల నిధులను టీఎస్ ఆర్టీసీ, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థలు సమకూర్చనున్నాయి. 1/3 నిధులను టీఎస్ ఆర్టీసీ, 2/3 నిధులను కుడా ఖర్చు చేయనున్నాయి. కొత్త బస్స్టేషన్ నిర్మాణం అయ్యే వరకు తాత్కాలిక బస్ స్టేషన్ను ఓ సిటీలో ఏర్పాటు చేయనున్నారు. తాత్కాలిక బస్స్టేషన్లో ప్రయాణికులకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించనున్నారు. రాత్రి వేళ బస్సుల పార్కింగ్కు కావాల్సి న సౌకర్యాలు అన్ని తాత్కాలిక బస్ స్టేషన్లో కల్పించనున్నారు. ఆధునిక హంగులతో నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇ స్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి జీవో జారీ చేసింది.
నియో మెట్రోకు అనుసంధానం..
ఆధునిక హంగులతో స్మార్ట్ బస్ స్టేషన్ను రూ. 75 కోట్లతో టీఎస్ ఆర్టీసీ, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ సంయుక్తంగా ఆధ్వర్యంలో నిర్మాణం చేయనున్నారు. 5 అంతస్తులు, 32 ప్లాట్ఫారాలతో స్మార్ట్ బస్ స్టేషన్ను నిర్మించనున్నారు. కమర్షియల్ కాంప్లెక్స్, షాపింగ్ కాంప్లెక్స్, మాల్స్, హోటల్స్ లాంటి అన్ని హంగులు స్మార్ట్ బస్ స్టేషన్లో కల్పించనున్నారు. దీనికి తోడు కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి వరంగల్ రైల్వే స్టేషన్ వరకు నిర్మించే నియో మెట్రో రైలు అనుసంధానం చేసేలా స్మార్ బస్ స్టేషన్ డిజైన్ను రూపొందించారు.
మెరుగైన రవాణా సౌకర్యం
వరంగల్లో స్మార్ట్ బస్ స్టేషన్తో వరంగల్ ప్రాంత ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందనుంది. ఇక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వెళ్లే బస్సులను నడుపనున్నారు. ప్రస్తుతం ఇతర జిల్లాలకు వెళ్లాలంటే హనుమకొండ బస్ స్టేషన్ వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వ వరంగల్లో ఆధునిక హంగులతో ఐదు అంతస్తులు, 32 ప్లాట్ ఫారాలతో నిర్మించే స్మార్ట్ బస్ స్టేషన్ మెరుగైన రవాణా సౌకర్యం ఏర్పడనుంది. ప్రస్తుత బస్ స్టేషన్ ప్రాంతంతో పాటు చుట్టూ ఉన్న స్థలాలను సేకరించి స్మార్ట్ బస్ స్టేషన్ను నిర్మించనున్నారు. కొత్తగా నిర్మించే స్మార్ట్ బస్ స్టేషన్ వరంగల్ జిల్లాకు ఐకాన్గా నిలువనుంది.