నల్లబెల్లి, జూలై 6 : పోడు రైతుల కలను సాకారం చేసినట్లు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. త్వరలోనే పోడు భూములను గోదావరి జలాలతో సస్యశ్యామలం చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమం మండలంలోని మూడుచెక్కలపల్లె, గోవిందాపూర్, కొం డాపూర్ గ్రామాల్లో గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భం గా జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పాల్గొని గిరిజనులకు పోడు పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మండలంలోని రంగాయచెరువు, ఎర్రాయిచెరువులను అనుసంధానం చేసి, ఏడు గ్రామాలను ముంపునకు గురి చేసి, రంగాయచెరువును రిజర్వాయర్గా నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించిందన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక వినూత్న పద్దతుల్లో అనుభజ్జులైన రిటైర్డ్ ఇంజినీరింగ్ అధికారులతో రీసర్వే చేపట్టి రంగాయచెరువు రబ్బరింగ్ సిస్టమ్తో ఒక టీఎంసీ నీటి సామర్థ్యంతో ప్రాజెక్ట్ను నిర్మించి, ముంపును నివారించిందన్నారు. అలాగే, గోదావరి జలాలతో ప్రాజెక్ట్ను నింపి ప్రస్తుతం రెండు పంటలకూ నీరు అందిస్తున్నట్లు తెలిపారు.
దశాబ్దాల కాలంగా ఇక్కడ భయపడుతూ పోడు చేసుకుంటున్న పేద రైతులు ఇక నుంచి నిర్భయంగా వ్యవసాయం చేసుకునేలా సీఎం కేసీఆర్ పోడు భూములకు పట్టాలను అందిస్తున్నారన్నారు. ఈ మేరకు వరంగల్ జిల్లాలోని 3262 మంది రైతులకు 7333 ఎకరాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా నల్లబెల్లి, చెన్నారావుపేట, నర్సంపేట, ఖానాపూర్, నెక్కొండ మండలాల్లో 300 మంది పోడు రైతులకు 1054 ఎకరాలు పంపిణి చేయడం సంతోషంగా ఉందన్నారు. పట్టా లు పొందిన ప్రతి రైతుకూ రైతుబంధును సైతం ముందస్తుగానే అమ లు చేస్తున్నట్లు తెలిపారు. రైతుబీమా సైతం అమలు చేస్తున్నట్లు చెప్పా రు. త్వరలో పోడు భూములను గోదావరి జలాలతో సస్యశ్యామలం చేస్తామన్నారు. కార్యక్రమంలో జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, ఎంపీపీ ఊడుగుల సునీత, తహసీల్దార్ దూలం మంజుల, ఎంపీడీవో విజయ్కుమార్, ఎంపీవో కూచన ప్రకాశ్, సర్పంచ్లు బానోత్ ఫూల్సింగ్, కరివేదుల వెంకట్రెడ్డి, గూబ తిరుపతమ్మ, గోనె శ్రీదేవి, ఎఫ్ఆర్వో రమేశ్, బీఆర్ఎస్ మండల కన్వీనర్ ఊడుగుల ప్రవీణ్గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ చెట్టుపెల్లి మురళీధర్రావు, మాజీ ఎంపీపీలు బానోత్ సారంగపాణి, కక్కెర్ల శ్రీనివాస్గౌడ్, ఎంపీటీసీ దేవూనాయక్, నాయకులు గందె శ్రీనివాస్గుప్త, సర్పంచ్ మామిండ్ల అమరేందర్రెడ్డి, మామిండ్ల మోహన్రెడ్డి, భోజ్యానాయక్, ఎఫ్ఆర్సీ సభ్యులు, కార్యదర్శులు యాదగిరి, రజిత పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ సార్కు రుణపడి ఉంటాం
సీఎం కేసీఆర్ సార్కు రుణపడి ఉంటాం. భూములు కొనే స్తోమత లేక మేము ఎన్నో ఏళ్లుగా పోడు చేసుకునే బతుకుతున్నాం. చెట్టు పుట్ట చదను చేసి ఆరుగాళం కష్టపడి పిల్లలను పోషించుకున్నాం. ఇన్నాళ్లు ఫారెస్టోళ్ల బాధలు భరించలేక పోయాం. మా బాధలను తెలుసుకున్న కేసీఆర్ సార్ మాకు పోడు పట్టాలు అందించి, ఆదుకోవడం ఆనందంగా ఉంది. ఇక సార్ ఇస్తున్న 24 గంటల కరంటుతో ఎమ్మెల్యే సార్ పెద్ది సుదర్శన్రెడ్డి ఇస్తున్న గోదావరి జలాలతో రెండు పంటలు పండించుకుంటాం. తెలంగాణ ప్రభుత్వానికి మేము ఎల్లప్పుడూ తోడుగా ఉంటాం
– ధరావత్ వీణ, మూడుచెక్కలపల్లి