ముంబై: ఒక ఆర్మీ జవాన్ దారుణానికి పాల్పడ్డాడు. ఏడు నెలల గర్భవతి అయిన భార్యను గొంతు నులిమి చంపాడు. ప్రమాదవశాత్తు ఆమె మరణించినట్లు నమ్మించేందుకు ప్రయత్నించాడు. నిందితుడైన ఆ సైనికుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. (jawan strangles pregnant wife) మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 28 ఏళ్ల ద్యానేశ్వర్ మద్నే, 6వ మరాఠా బెటాలియన్లో సైనికుడిగా పనిచేస్తున్నాడు. ఆగస్ట్ 6న ఏడు నెలల గర్భిణీ అయిన భార్య దీపాలి గొంతు నొక్కి హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె కుటుంబానికి ఫోన్ చేశాడు. భార్య కాలు జారి ఇంట్లో పడి తీవ్రంగా గాయపడినట్లు చెప్పాడు.
కాగా, జవాన్ ద్యానేశ్వర్ ఆ తర్వాత తన భార్యను ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాడు. అక్కడి వైద్యులు ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. అయితే దీపాలి మెడపై గాయాలు ఉండటంతో హత్యగా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు అనుమానించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకున్నారు. దీపాలి మృతదేహాన్ని పరిశీలించారు.
మరోవైపు ఆర్మీ జవాన్ ద్యానేశ్వర్కు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉన్నదని, అందుకే భార్య దీపాలిని తరచుగా వేధించేవాడని మృతురాలి సోదరుడు ఆరోపించాడు. అతడి ఫిర్యాదుతో ఆ సైనికుడు, అతడి తల్లిదండ్రులపై పోలీసులు కేసు నమోదు చేశారు. జవాన్ ద్యానేశ్వర్ను అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.