Kashmiri Pandits : జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉన్న కాశ్మీరీ పండిట్లకు, ఇక్కడ పని చేసే పోలీసులకు, చివరకు రాష్ట్ర ఎల్జీకి కూడా ఒక ఉగ్రవాద సంస్థ హెచ్చరిక జారీ చేసింది. లష్కర్ ఇ తైబా అనే ఉగ్రసంస్థకు అనుబంధంగా పని చేసే ‘ద యునైటెడ్ లిబరేషన్ కౌన్సిల్ (యూఎల్సీ)’ అనే సంస్థ తాజాగా ఒక లేఖ విడుదల చేసింది. ఆగష్టు 7న ఈ లేఖ విడుదలైందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఈ లేఖలో కాశ్మీరీ పండిట్లకు, వివిధ విభాగాల్లో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు, పోలీసులకు, రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్కు కూడా హెచ్చరికలు జారీ చేశారు.
కాశ్మీర్ ప్రాంతంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేస్తున్న పండిట్లకు సంబంధించిన వివరాలు, వారి కుటుంబ సభ్యుల వివరాలు, వాళ్లు ఉండే ప్రదేశాలకు సంబంధించిన అన్ని వివరాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. అంతేకాదు.. వారు కాశ్మీర్ నుంచి జమ్మూ వెళ్లినా వదిలిపెట్టేది లేదన్నారు. ముఖ్యంగా రెవెన్యూ విభాగంలో స్థానిక పండిట్లే పని చేస్తున్నారని, వారిని లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించారు. పండిట్లకు చెందిన ఆరుగురు ఉద్యోగుల పేర్లను కూడా లేఖలో ప్రస్తావించారు. ఇదే సమయంలో జమ్మూ కాశ్మీర్లో పని చేస్తున్న పోలీసులకు కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఇక్కడ స్థానిక పోలీసులే ఎక్కువగా ఉన్నారని, వారిని లక్ష్యంగా చేసుకుంటామన్నారు. అలాగే, ఈ ప్రాంతంలో వేర్పాటు వాదానికి పాల్పడుతున్న వారికి, ఉగ్రవాదులకు సంబంధించిన ఆస్తుల్ని జప్తు చేస్తూ నిర్ణయం తీసుకుంటున్న రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్తోపాటు డీజీపీకి కూడా హెచ్చరికలు జారీ చేశారు. తమకు, ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చేవారిని, వారి బంధువులను వేధిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.
మసీదు నిర్వాహకులు కూడా హిందువుల్ని ఇస్లాంలోకి మార్చాలని, లేకుంటే కాశ్మీర్ వదిలి వెళ్లి పోయేలా చూడాలని, అలాంటివారిని చంపేస్తామని హెచ్చరించారు. అయితే, ఈ లేఖపై కాశ్మీర్ పండిట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము ఇంకా ఎంతకాలం ఇలా భయపడుతూ బతకాలని ప్రశ్నిస్తున్నారు. ఈ లేఖలోని హెచ్చరికలు ఆమోదయోగ్యం కాదని వారు అంటున్నారు. ఈ లేఖ అహ్మద్ బిలాల్ అనే పేరుతో విడుదలైంది. ఇందులో అతడిని యూఎల్సీ సంస్థ మీడియా కో ఆర్డినేటర్గా, సోల్జర్ ఆఫ్ రెసిస్టెన్స్గా పేర్కొన్నారు.